తీర్మానాలపై అప్పటి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు
ప్రత్యేక విచారణ చేపట్టి నిధులు రికవరీ చేయాలి
డీసీసీబీ మాజీ, తాజా పాలకవర్గ సభ్యులు
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31: గత పాలకవర్గంలో రైతు సంక్షేమ నిధి ద్వారా రైతుల డబ్బులు దారిమళ్లిన మాట వాస్తవమేనని, కానీ అందులో తమ ప్రమేయం ఏమాత్రమూ లేదని ఖమ్మం డీసీసీబీ మాజీ, తాజా పాలకవర్గ సభ్యులు తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుత డీసీఎంఎస్ చైర్మన్, డీసీసీబీ గత పాలకవర్గసభ్యుడు అయిన రాయల శేషగిరిరావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు మాట్లాడారు. గత పాలకవర్గ కాలంలో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేసి నిధులు దారి మళ్లించినట్లు చెప్పారు.
ఈ విషయంతో పాటు పాలకవర్గ సభ్యుల విజ్ఞాన యాత్రలు, బహుమతుల కోసం అధిక నిధులు వెచ్చించిన అంశాలపై రాష్ట సహకార శాఖ 51 సెక్షన్ కింద ఎంక్వయిరీ చేసింది. ఆ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను పరిశీలించామని అన్నారు. పాలకవర్గ సభ్యులు విజ్ఞాన యాత్రలు చేయడం, బహుమతులు తీసుకోవడం అన్ని డీసీసీబీలతోపాటు ఖమ్మం డీసీసీబీలోనూ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే ఏయే అంశానికి ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే కార్యాచరణను బ్యాంకు చైర్మన్, సీఈవో సమన్వయంతో సిద్ధం చేస్తారని అన్నారు. అనంతరం పాలకవర్గంలో తీర్మానం జరుగుతుందన్నారు. వారం రోజులకు ముందే తీర్మానాలు తమకు చేరుతాయన్నారు. తమతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా రెండు జిల్లాల సహకార అధికారులు, నాబార్డు డీజీఎం, టెస్కాబ్ డీజీఎం, డీసీసీబీ సీఈఓలు ఉంటారన్నారు. అయితే గతంలో ఈ విషయాలపై చేసిన తీర్మానాలు సరికాదని వారు చెప్పలేదన్నారు.
కోఆపరేటివ్ చట్టంలో ఎంతో అనుభవం ఉన్న అధికారులు నాడు వ్యతిరేకించకపోవడంతో నేడు తమపై అనేక అభియోగాలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమ నిధి ఏర్పాటు అంశాన్ని నాడు పాలకవర్గ సభ్యులుగా తాము వ్యతిరేకించామన్నారు. ఈ విషయంలో పాలకవర్గంలో సభ్యులుగా ఉన్న అధికారులు కూడా రైతు సంక్షేమ నిధి అనేది సహకార నిబంధనలకు వ్యతిరేకమని చెప్పకపోవడమే నిధుల దారి మళ్లింపునకు కారణమైందని అన్నారు. సహకార చట్టంలో ఉన్న బలహీనతలు గ్రహించి నాటి చైర్మన్, సీఈఓలు పాలకవర్గంలో తీర్మానాలను ఆమోదించుకున్నట్లు ఆరోపించారు. దారి మళ్లిన నిధులకు, తమకు ఏమాత్రమూ సంబంధం లేదన్నారు. రైతు సంక్షేమ నిధికి వెళ్లినప్పటి నిధులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. తాజా, మాజీ పాలకవర్గ సభ్యులు తుళ్లూరి బ్రహ్మయ్య, జనగం కోటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు మండే వీరహనుమంతరావు, బోజెడ్ల అప్పారావు, బద్దులాల్, పోలదాసు కృష్ణమూర్తి, గూడపాటి శ్రీనివాసరావు, కూరపాటి రంగరాజు, బీ.వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.