మేడ్చల్, మార్చి18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరాన్ని అన్ని వైపులా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్న మేడ్చల్ జిల్లాలో ఐటీ పార్కును విస్తరించే ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శాసనసభ బడ్జెట్ సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని కొంపల్లి, పోచారం, ఉప్పల్లోని వివిధ ప్రాంతాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుపై గతంలోనే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. నివేదికల పరిశీలన అనంతరం ఐటీ పార్కుల విస్తరణపై రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్నది. సుమారు 150 ఎకరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
లుక్ఈస్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్ నగరంలో ఐటీ పార్కులను విస్తరించనున్నది. నలుదిశలా ఐటీ పార్కులు ఏర్పాటయితే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
ఐటీ రంగంలో వస్తున్న పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఐటీ ఉత్పతులకు కేంద్రంగా తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజ సంస్థలు తమ డాటా బేస్ సెంటర్లను హైదరాబాద్ నగరంలో నెలకొల్పాయి. ఐటీ విస్తరణపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ విస్తరణకు నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడంతో త్వరలోనే ప్రణాళిక అమలువుతుందన్న అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.