రాంచీ: కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఒక వైద్యుడికి వైరస్ సోకింది. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా నోడల్ అధికారి, అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాహిర్ పాల్ తెలిపారు. ఆ వైద్యుడి భార్యకు కూడా కరోనా సోకిందని చెప్పారు. ఆ వైద్యుడు కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నారని వివరించారు. అయితే ఆయన భార్య మాత్రం టీకా వేయించుకోలేదని చెప్పారు.
కరోనా సోకిన ఆ వైద్య దంపతుల్లో ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం వారిద్దరు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సమర్థత 60 శాతం కంటే ఎక్కువని, కోవాక్జిన్ సమర్థత 80 శాతమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో టీకాల సామర్థ్యంపై కొన్ని మినహాయింపులుంటాయని, దీనిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.