నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
వేదిక ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం
8 హాళ్లు, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లు
56 టేబుళ్లలో ఏకకాలంలో లెక్కింపు
25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట
రాత్రి 9:30 గంటల తర్వాతే తొలి రౌండ్
సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 8 హాళ్లు, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లు ఏర్పాటు చేసి ఏకకాలంలో 56 టేబుళ్లలో 25 బ్యాలెట్ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కట్టి ఓట్లను లెక్కించనున్నారు. రాత్రి 9:30 గంటల తర్వాతే తొలి రౌండ్ ఫలితం వెలువడనుండగా పూర్తిస్థాయి ఫలితానికి రెండ్రోజుల సమయం పట్టేలా అవకాశం ఉన్నదని అధికారుల అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలోని తొ మ్మిది జిల్లాల పరిధిలో 5,31,268 ఓటర్లు ఉండగా.. 3,57,354 ఓట్లు పోలయ్యాయి. అయితే పోలింగ్ శాతం అధికంగా ఉండడం, 93 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఫలితాల కోసం రెండు నుంచి మూడు రోజుల పాటు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు నిర్విరామంగా కొనసాగనున్నది. షిఫ్ట్ల వారీగా పనిచేసేందుకు అధికారులు, సిబ్బందిని నియమించారు. ఉద యం 6:30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏ జెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుం ది. 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూంలను ఓపెన్ చేయనున్నారు. ఏజెంట్ల సంతకం తీసుకున్న తరువాతే బ్యాలెట్ బాక్సులను తెరవనున్నారు. 25 బ్యాలెట్ పత్రాలను ఒక్క కట్ట చొప్పున చేసేందుకుగానూ దాదాపు 12 గంటల సమయం పట్టనున్నట్లు అధికారుల అంచనా.
ఆ తరువాత కట్టలో ఉన్న బ్యాలెట్ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో టేబుల్కు వెయ్యి ఓట్ల చొప్పున ఒక్కో రౌండుకు 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. అయితే 3,57,354 ఓట్లు పోలైన నేపథ్యంలో సంబంధిత ఓట్లను లెక్కించేందుకు దాదాపు 12 గంటల సమ యం పట్టే అవకాశముందని అధికారుల అంచ నా. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన అనంతరం ఏ అభ్యర్థికి అయితే 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో.. సంబంధిత అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటిస్తారు. కాగా, ఏ అభ్యర్థికి కూడా 50 శాతానికిపైగా ఓట్లు రాకుం టే రెండో ప్రాధాన్యత ఓట్లను లెకిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ రౌండ్ కూడా ప్రారంభమవుతుంది. 93వ అభ్యర్థికి సంబంధించి మొద టి ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకోకుండా రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశారనేది పరిగణనలోకి తీసుకొని వారికి సంబంధిత ఓట్లను కలుపనున్నా రు. ఈ విధంగా చివరి నుంచి ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను ప్రధాన అభ్యర్థులకు కలుపనున్నారు. ఈ విధంగా కలిపిన ఓట్లతో ఎవరికి అయితే 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు అవుతుంది.