లింగన్నపేటలో శతచండీ యాగం
రేపటి నుంచి 21 వరకు ఉత్సవాలు
గంభీరావుపేట, మార్చి 15:జగన్మాత చండికా పరమేశ్వరీ ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అలరారుతుంది. దుర్భిక్షం, దుఃఖం అనేవి అక్కడ ఉండవు. చండీ మాత సకల దేవతల స్వరూపిణి. ఆమె అమ్మల గన్న అమ్మ. ఆ చల్లని తల్లిని ప్రసన్నం చేసుకుని అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆకాంక్షిస్తూ తలపెట్టే పవిత్ర కార్యం శతచండీ యాగం. యాగ ఫలంతో సమస్త ప్రాణులు సుఖ సంతోషాలతో శాంతియుత జీవనం సాగిస్తాయి.
శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి సప్తతి(70) మహోత్సవాల సందర్భంగా లింగన్నపేట హరిహర దేవాలయంలో ఈ నెల 17 నుంచి శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అఖండ శ్రీరామనామ సప్తాహం, సామూహిక కుంకుమార్చన, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శృం గేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారి కరకముల సంజాతులు (ప్రియ శిష్యుడు) విధుశేఖర భారతీ స్వామి వారి సంపూర్ణ కరుణా కటాక్షాలతో నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు..
17న ఉదయం గురుదేవతా ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ చండీ యంత్ర స్థాపన, సప్తశతీ పారాయణం ప్రారంభం, కుంకుమార్చన, నవర్ణ పూజ, కన్యకా పూజ, నవాక్షరీ మూల మంత్ర అనుష్టాహం నిర్వహిస్తారు. 18, 19న సువాసిని కన్యకా పూజ, విశేష హోమాలు, సామూహిక కుంకుమార్చన, మంత్ర అనుష్టాహం, ప్రముఖులతో ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. 20న సాయంత్రం జగద్గురువుల పాదుకల ఊరేగింపు, పాదుక పూజ, మహా మంగళహారతి, 21న చండీ తర్పణం, దశాంశ హోమం, మహా పూర్ణాహుతి, కలశ విసర్జనం, అవబృథం, మహదాశీర్వచనం, అఖండ శ్రీరామనామ సప్తాహ మహా మంగళహారతి నిర్వహిస్తారు. అత్యంత పుణ్యప్రదమైన శతచండీ యాగానికి వచ్చి అందరూ యజ్ఞంలో భాగస్వాములు కావాలని యాగ నిర్వాహకులు వ్యాసోజ్జల రామశర్మ, దేశపతి సుదర్శన శర్మ, వ్యాసోజ్జల రాధాకృష్ణశర్మ కోరారు. భక్తులకు ప్రతి రోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు వెల్లడించారు.
లోక కల్యాణం కోసమే..
శృంగేరి జగద్గురు భారతీ తీర్థస్వామి వర్ధంతి మహోత్సవం సందర్భంగా 2009 నుంచి ఏటా హరిహర దేవాలయంలో హోమాది కార్యక్రమాలు చేపడుతున్నాం. లోక కల్యాణార్థం, సమస్త ప్రాణులు సుఖసంతోషాలతో శాంతియుత జీవనం సాగించాలనే సత్సంకల్పంతో లింగన్నపేటలో శతచండీ యాగం నిర్వహిస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గి సకలజనులు సంపూర్ణ ఆరోగ్యం, సౌభాగ్యాలు పొందాలని, చండీ మాత అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఆకాంక్షిస్తూ ఐదు రోజల పాటు యాగం నిర్వహిస్తున్నాం. ఈ అత్యంత పుణ్యప్రదమైన యాగానికి వచ్చి ధన్యులు కావాలి.