నాగపూర్ : విడాకులు ఇచ్చి వేరొకరిని వివాహం చేసుకున్నా లైంగిక సంబంధం కొనసాగించాలని వేధిస్తున్న 65 ఏండ్ల మాజీ భర్తను కత్తిపోట్లతో కడతేర్చిన మహిళ ఉదంతం నాగపూర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు స్వాతి మాలిక్ అలియాస్ స్వాతి శర్మ మాజీ భర్త లక్ష్మణ్ మాలిక్ను నాగపూర్లోని గణేష్పేట్ కాలనీలోని ఆయన ఇంట్లో మార్చి 8న హత్య చేసింది. మధ్యవయస్కురాలైన నిందితురాలు లక్ష్మణ్ జీవితంలోకి వచ్చిన ఐదుగురు మహిళల్లో నాలుగో భార్య. స్వాతి బోటిక్ నడుపుతుండగా లక్ష్మణ్ ఈఐఎస్సీ దవాఖానలో పనిచేస్తూ పదేండ్ల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. నాలుగో భార్య స్వాతి నిర్వహించే బొటిక్లో పనిచేసే మైనర్ బాలికపై లక్ష్మణ్ కన్నేయడంతో 2018లో వీరు విడిపోయారు.
ఆపై స్వాతి వేరొకరిని వివాహం చేసుకుంది. మరో వ్యక్తితో ఆమె వైవాహిక జీవితం గడుపుతున్నా తనతో లైంగిక సంబంధం నెరపాలని స్వాతిపై లక్ష్మణ్ ఒత్తిడి తెచ్చేవాడు. తన పెన్షన్ను స్వాతి విత్డ్రా చేస్తుండటంతో ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. దీంతో లక్ష్మణ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న స్వాతి ఏకంగా ఆయన ఇంటికి వెళ్లింది. అశ్లీల వీడియోలు చూపుతూ లక్ష్మణ్ను కుర్చీలో కూర్చుండబెట్టి తాళ్లతో బంధించింది. ఆపై కత్తితో కసితీరా పొడుస్తూ చనిపోయాడని నిర్దారించుకున్న అనంతరం ఘటనా స్ధలం నుంచి పారిపోయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు 180 మంది అనుమానితులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెపుతూ దొరికిపోయిన స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా లక్ష్మణ్ రెండో భార్య, ఆమె సహచరురాలు కలిసి తనను కుర్చీలో కట్టేసి నిర్బంధించారని 2016లో స్వాతి అంబజరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్ధానిక పోలీస్ అధికారి తెలిపారు.