లేకుంటే దేశవ్యాప్త మెరుపు సమ్మె
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
14, 15 తేదీల్లో దేశవ్యాప్త నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఉద్దేశించిన విద్యుత్ సవరణ చట్టం-2020 బిల్లును ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్ పంజాగుట్టలోని యూనియన్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 12 యూనియన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తున్నదని వారు ఆరోపించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసిన మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ర్టాల్లో వాటి పనితీరు సరిగ్గా లేదని, ఫ్రాంచైజీలను రద్దు చేశారని గుర్తుచేశారు. కేంద్రం తెస్తున్న చట్టంతో ఎవరైనా లైసెన్స్ లేకుండానే విద్యుత్ సరఫరా చేయవచ్చని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాలలో ఒకరి కంటే ఎక్కువమంది ఆపరేటర్లు ప్రవేశించే అవకాశం వస్తుందని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ప్రైవేటుసంస్థలు సిండికేట్గా ఏర్పడి చార్జీలు పెంచి వినియోగదారులపై భారం వేస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉద్యోగులకు పదోన్నతులు, ఉద్యోగ భద్రత ఉండవని తెలిపారు. పార్లమెంటులో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 14,15 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ నేతలు తమ మద్దతు ప్రకటించారు.
సమావేశంలో జేఏసీ నాయకులు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్రావు, జనరల్ సెక్రటరీ సదానందం, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ అనిల్కుమార్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీసీ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, జనరల్ సెక్రటరీ ఈశ్వర్గౌడ్తోపాటు 1104 యూనియన్ నాయకులు శంకర్ పాల్గొన్నారు.