‘చావుకబురు చల్లగా’ కథ వినగానే నచ్చింది. ఈ రోజు సినిమా చూశాను. తప్పకుండా మీ మనసులకు హత్తుకునే సినిమా అవుతుంది. దర్శకుడు కౌశిక్ తన దర్శకత్వ ప్రతిభను చాటుతూ ఎంతో గొప్ప ఫిలాసఫీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’ అన్నారు ప్రముఖ యువ కథానాయకుడు అల్లు అర్జున్. కార్తికేయ, లావణ్యత్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 19న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ రోజు నేను మీ ముందు ఇలాంటి గొప్పస్థితిలో వుండటానికి మా నాన్నతో పాటు బన్నీ వాసు కూడా కారణం. కథల జడ్జిమెంట్పై మంచి అవగాహన వున్న నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా అందరి హృదయాలను గెలుచుకుంటుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ నటన ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘గీతా ఆర్ట్స్ ప్రతిష్ట పెంచే సినిమాలను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.ఈ కథ విన్నప్పుడు దర్శకుడు ఈ సినిమాను బాగా తీయగలడనిపించింది. ఈ రోజు అది రుజువైంది’ అన్నారు. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ను ఐకానిక్ మాస్స్టార్గా చూడబోతున్నారని, ‘చావుకబురు చల్లగా’ లాంటి కొత్త కథలను ఎంచుకుని సినిమాలు తీసే అల్లు అరవింద్ జడ్జిమెంట్కు హ్యాట్సాఫ్ చెబుతున్నానని ప్రముఖ దర్శకుడు సుకుమార్ చెప్పారు. గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప బ్యానర్లో పనిచేయడం ఆనందంగా వుందని కార్త్తికేయ అన్నారు.