సెలవులొచ్చాయి. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్ని ఎండలుంటే ఏంటి సమ్మర్ టూర్లు వేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కదా! పర్లేదు. వేసవిలో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ప్రయాణమే కదా ఎంజాయ్ చేస్తే పర్లేదు. ఎండలే కదా అని నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వడదెబ్బ తగిలి మంచానికెక్కాల్సి వస్తుంది.
వేసవిలో దాహం ఎక్కువే అవుతుంది. కాకున్నా సరే నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. ఇది చాలా ముఖ్యం. నీళ్లు ప్రయాణపు అలసట నుంచి దూరం చేయడమే కాకుండా శరీరాన్ని వాతావరణపు మార్పులు తట్టుకునేలా చేయగలవు.
ప్రయాణమంటేనే చిరుతిండ్లు అంటారు చాలామంది. అది సహజం కూడా. కానీ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను, కాయలను తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోస వంటివాటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంతలాభం.
ఎండలకు చర్మం మండిపోతుంది. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రయాణాలేంటో కానీ చర్మం పాడైపోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎండలో వెళ్లే ముందు చర్మానికి సన్స్క్రీన్, లోషన్ వంటివి రుద్దుకోవడం మరిచిపోవద్దు. అవి మీ చర్మాన్ని కాపాడుతాయి.
సెలవులు ఉన్నప్పుడు బాగా నిద్రపోవాలనుకుంటాం. కానీ తిరిగి అలిసిపోతాం. కొత్త ప్రదేశాల్లో నిద్రకూడా పట్టదు. కానీ నిద్ర అవసరం. చాలాముఖ్యం కూడా. బాగా నిద్రపోయి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వండి. సుదూర ప్రయాణాలను సురక్షితంగా చేసి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి.