జూబ్లీహిల్స్, మార్చి 6: కరోనాతో కుదేలైన చిరు వ్యాపారులకు పీఎం నిధి పథకంలో మళ్లీ రుణాలు అందజేయనున్నారు. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీతో పాటు రూ.10వేలకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడ్డ వీధి వ్యాపారులకు కొవిడ్ రుణాలు అందజేశారు. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులున్న స్ట్రీట్ వెండర్స్కు ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందజేశారు. కాగా లబ్ధిదారులు 12 నెలల వ్యవధిలో, అంతకంటే ముందుగా రుణాలు తిరిగి చెల్లిస్తే వారికి పూర్తిగా వడ్డీ మాఫీచేసి కొత్త రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు శనివారం యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో చిరు వ్యాపారులతో బ్యాంకర్లు సమావేశమయ్యారు. యూసీడీ ప్రాజెక్ట్ అధికారి హిమబిందు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూబీఐ రాజీవ్నగర్ బ్రాంచ్ మేనేజర్ రమేశ్నాయుడు మాట్లాడుతూ నిర్ణీత కాలవ్యవధిలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మళ్లీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇందుకుగానూ వీధి వ్యాపారులందరినీ ఉద్యమి మిత్ర పోర్టల్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులున్న వారితో పాటు రుణాలు పొందిన వీధి వ్యాపారులను పోర్టల్తో లింక్ చేయడం వల్ల కొత్తగా రుణాలు ఇవ్వడం వీలవుతుందన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మళ్లీ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమయానుకూలంగా రుణాలు చెల్లించిన వారికి అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో యూసీడీ సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.