జైపూర్: ప్రియుడితో కలిసి పారిపోయిన కుమార్తెను ఆమె తండ్రి హత్య చేశాడు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల శంకర్ లాల్ సైని తన 18 ఏండ్ల కుమార్తె పింకి సైనికి ఫిబ్రవరి 16న ఒక వ్యక్తితో బలవంతంగా పెండ్లి చేశాడు. అయితే ఫిబ్రవరి 21 ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చింది. అదే రోజు గ్రామానికి చెందిన ప్రియుడు రోషన్ మహావర్తో కలిసి పారిపోయింది. ఆ దళిత యువకుడు తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ పింకి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు తాము పెండ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పింకి, ఆమె ప్రియుడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 1న గ్రామంలోని ఆ యువకుడి ఇంటికి వారిద్దరు తిరిగి వచ్చారు.
అయితే పింకి కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి ఆమెను అక్కడి నుంచి తమ ఇంటికి తీసుకెళ్లారు. తండ్రి శంకర్ లాల్ తన కుమార్తె పింకి గొంతు నొక్కి హత్య చేశాడు. మరోవైపు తన భార్యను కిడ్నాప్ చేశారంటూ ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న పింకి తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. కుమార్తెను తానే హత్య చేసినట్లు చెప్పాడు.
మరోవైపు ఆ జంటకు రక్షణ కల్పించాలని హై కోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారి తరుఫు న్యాయవాదులు ఆరోపించారు. పోలీసులు తగిన రక్షణ కల్పించి ఉంటే పింకీని కాపాడగలిగి ఉండేవారని పేర్కొన్నారు.