ముంబై : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్కు మళ్లీ డిమాండ్ పెరిగింది. దీని విలువ బుధవారం 5 శాతం పెరిగి 50,942 పాయింట్లను దాటింది. మంగళవారం సెషన్లో 2,426 డాలర్లకు పైగా లాభపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 4 న 27,734 డాలర్లు పలికింది. ఇక అప్పటినుండి గురువారం వరకు 84 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత గత నెల 21వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం… 58,354 డాలర్లను తాకింది. ఆ తర్వాత దారుణంగా పడిపోయి 45 వేల డాలర్ల దిగువకు చేరుకుంది. మళ్లీ పుంజుకుని ఇప్పుడు 51 వేల డాలర్లకు చేరువలో ఉందిది.
గత రెండు నెలల్లో పలు కారణాల వల్ల బిట్ కాయిన్ భారీగా లాభపడింది. బీఎన్వై మెలన్, మాస్టర్ కార్డ్, టెస్లా స్క్వేర్ ఇంక్ వంటి దిగ్గజ సంస్థలు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టడం/ క్రిప్టో కరెన్సీని అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమలో బిట్కాయిన్… ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత టెస్లా అధినేత చేసిన ట్వీట్, బిట్ కాయిన్కు ఇప్పటికే హైజంప్ వచ్చిందనే వాదనల నేపధ్యంలో ‘విలువ’ పడిపోయింది. మళ్ళీ… బుధవారం బిట్ కాయిన్ 50 వేల పాయింట్లను తాకింది. ఓ దశలో ఆల్ టైమ్ హై ఫిబ్రవరి 21 నాటి 58,354 డాలర్లతో పోల్చుకుంటే 12 శాతం క్షీణించింది.
ఇక మరో క్రిప్టోకరెన్సీ ఎథెర్ విలువ బుధవారం ఏడు శాతానికి పైగా పెరిగింది. ఎథెరియమ్ బ్లాక్ చైన్ నెట్ వర్క్కు చెందిన ఎథేర్ క్రిప్టో కూడా బుధవారం 1,595.64 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 106.84 డాలర్లు ఎగిసింది. ఇటీవల ఇతర క్రిప్టో కరెన్సీల విలువ కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, భారత్లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఫిబ్రవరి నెలలో రెండింతలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు క్రిప్టో కరెన్సీని నిషేధించనున్నట్లు వార్తలొచ్చినా దాని విలువ పెరగడం గమనార్హం. గతేడాది డిసెంబర్లో క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ విలువ 500 మిలియన్ డాలర్లు కాగా, జనవరి 21 న 1.4 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 2.3 బిలియన్ డాలర్లకు పెరిగింది.