రూ.10 విలువైన వస్తువునూ వదల్లేదు..
పెద్దపల్లిటౌన్, జూలై 17 : ‘దొంగోడికి చెప్పే లాభం..’ అన్న చందంగా ఉన్నదీ అంతర్ జిల్లా దొంగల ముఠా ముచ్చట! 10 విలువైన పిల్లల ఆట బొమ్మలు మొదలుకుని కత్తులు, చాకులు, కుక్కర్లు, మిక్సీలు, టీపాయ్లు, పెళ్లి పీటలు, పానలు, ప్లాస్కులు, స్టీల్ డబ్బాలు, ఇస్త్రీ పెట్టెలు, ఫ్రిజ్లు, టీవీలు, ఆటోలు, ఆభరణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మేళాలో వస్తువులను తలపించేలా ఉంది ఈ ముఠా ఎత్తుకెళ్లిన లిస్టు! పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఏది దొరికితే అదే ఎత్తుకెళ్లారు గ్యాంగ్లోని నలుగురు సభ్యులు! దాదాపు 14 చోరీల్లో దోచుకెళ్లిన 18,13,600 విలువైన సొత్తును పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్న ముగ్గురిని స్థానిక పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ వెలుగు చూసింది.
గత కొన్ని రోజులుగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతోపాటు జగిత్యాల జిల్లాలో 14 దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు సంబంధించిన వివరాలను సీపీ సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సీలివేరు శంకర్, సీలివేరు బ్రహ్మయ్య, గుర్రాల చిన్న భూమయ్య, గుర్రాల పెద్ద భూమయ్య (పరారీలో వున్నాడు)లు ముఠాగా ఏర్పడి మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని తొమ్మిది పోలీస్సేషన్లలో 14 దొంగతనాలు చేశారు. రూ.10 విలువైన వస్తువు నుంచి ఆపై విలువైన వస్తువులను దొరికినకాడికి దోచుకెళ్లారు.
అలా దొంగిలించిన సొత్తును పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడ బజారులో అమ్మకానికి తీసుకురాగా ఇందులో శంకర్, బ్రహ్మయ్య, భూమయ్యను పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు,13 తులాల వెండి వస్తువులు, 4 రిఫ్రిజ్ రేటర్లు, మూడు ఎల్ఈడీ టీవీలు, 3 ఆటోలు, 35 పట్టు చీరలు, 2 సిలిండర్లు, ఒక గ్యాస్ స్టవ్, ఒక మైక్రో ఓవెన్,10 కంప్యూటర్లు, ఒక మిక్సీ జారు, ఒక ప్రెషర్ కుక్కర్, కత్తులు, ప్యానల్స్, గుడి గంట, కెమెరా, ప్లాస్కులు, స్టీల్ డబ్బాలు, హోం థియేటర్, ఇస్త్రీ పెట్టెలు, డీవీడీలు, బ్యాగులు, సూట్కేస్, పెళ్లిపీటలు, టీపాయ్లు, పాఠశాల సామగ్రి, ఎగ్జిట్ ప్యాన్, వెయిట్ మిషన్, చిన్న పిల్లల ఆట వస్తువులు, బొమ్మలు, ఇతర గృహోపకరణ వస్తువులు ఉన్నాయి. వీటి విలువ దాదావు రూ.18,13,600 ఉంటుందని సీపీ తెలిపారు.
అప్రమత్తంగా ఉంటున్నాం : సీపీ
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ఎల్లప్పుడూ పోలీసులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడంలో పెద్దపల్లి పోలీసులు ముందు వరుసలో ఉన్నారని, ఏసీపీ సారంగపాణి బాధ్యతలుచేపట్టినప్పటి నుంచి పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారని అభినందించారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ రాజేశ్,ఏఎస్ఐ పోచయ్య, కానిస్టేబుళ్లు రవికుమార్, దుబాసి రమేశ్, మాడిశెట్టి రమేశ్ను అభినందించి, నజరానా అందజేశారు.