ఊరూరా గులాబీ జోష్
గ్రామగ్రామాన సంస్థాగత సందడి
వాడవాడనా గులాబీ దండు
పూర్తయిన వార్డు, గ్రామస్థాయి కమిటీల నియామకం
మండల, పట్టణ, జిల్లా కమిటీలపై అధిష్ఠానం దృష్టి
పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహం
పెద్దపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఊరూరా గులాబీ జోష్ కనిపిస్తున్నది. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ప్రజాసంక్షేమ పాలనతో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలోనూ దూసుకుపోతున్నది. పల్లె నుంచి పట్నం వరకు బలపడుతున్నది. ఇప్పటికే గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మండల, పట్టణ, జిల్లా కమిటీలపై అధిష్ఠానం దృష్టి సారిస్తుండగా శ్రేణుల్లో కదనోత్సాహం కనిపిస్తున్నది.
పల్లె నుంచి పట్టణం వరకు టీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్గదర్శకత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు దాదాపు పూర్తి కాగా, కార్మిక, విద్యార్థి, మహిళా విభాగాలతో పాటు మండల, పట్టణ, జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. ఇందు కోసం నియోజకవర్గాల ఇన్చార్జీలను నియమించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి.
టీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి గ్రామ కమిటీ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులకు పోటీ వాతావరణం ఏర్పడింది. పల్లె నుంచి మొదలుకుని జిల్లా స్థాయి వరకు ఎదురులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగేలా కార్యకర్తల నుంచి మొదలు సీనియర్ నేతల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆమాత్యుడి ఆదేశాలతో జిల్లాలోని ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ సీనియర్ నాయకులు పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని మించి చే యించారు. జిల్లాలోని 14 మండలాల్లో 267 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ కమిటీలు పూర్తి కాగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, రామగుండం కార్పొరేషన్లో డివిజన్ల వారీగా కమిటీల ఎన్నికలు సైతం పూర్తి చేశారు.
మండల, పట్టణ ఎన్నికలు …
క్షేత్ర స్థాయిలో గ్రామ కమిటీలు పూర్తి చేసిన ఇన్చార్జీలు ఇక మండల, పట్టణ కమిటీల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించారు. పెద్దపల్లి మున్సిపాల్టీలో 36 వార్డులు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు, మంథనిలో 13 వార్డుల్లో కమిటీలు వేశారు. రామగుండంలో 50 డివిజన్ల వారీగా కమిటీలు పూర్తి చేశారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణ కమిటీలతో పాటు అన్ని మండలాల కమిటీలు ఈనెల 20లోగా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఆశావహులకు అవకాశం దక్కడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు.
పట్టణ, జిల్లా పదవులపై పెరుగుతున్న పోటీ…
గ్రామ స్థాయిలో కమిటీలు పూర్తయిన నేపథ్యంలో పట్టణ, జిల్లా స్థాయి ఎన్నికలపై అందరి దృష్టి మళ్లింది. రోజురోజుకూ పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్ట మవుతుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అందరూ ఆకర్షితులవుతున్నారు. దీంతో పార్టీలో పట్టణ, జిల్లా పదవులకు తీవ్ర పోటీ పెరుగుతున్నది. ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. పట్టణ అధ్యక్ష పదవి కోసం కొత్త తరం పోటీ పడుతున్నది. ఎదురులేని రాజకీయ శక్తిగా, క్రమశిక్షణ గల టీఆర్ఎస్ పార్టీలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలంతా సంఘటితంగా పనిచేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం..
క్షేత్ర స్థాయిలో జరిగిన గ్రామ కమిటీ ఎన్నికల్లో పదవులు దక్కించుకున్న వారంతా ఉత్సాహం చూపుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ చెబుతున్నారు. మరింత అభివృద్ధి జరిగేలా తాము పనిచేస్తామన్న రెట్టింపు ఉత్సాహంతో కొత్త కమిటీల సభ్యులు దూసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 20వరకు అన్ని అనుబం ధ కమిటీల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.