విద్యుత్ శాఖ సరికొత్త బాట
పల్ల్లె, పట్టణ ప్రగతిలో విస్తృత కార్యక్రమాలు
ఏండ్లనాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
తొలగుతున్న ఇబ్బందులు
ముకరంపుర, జూలై 15 : పక్క చిత్రం గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లె గ్రామంలోనిది. స్తంభం ఎత్తు తక్కువగా ఉండడంతో పాటు లూజ్లైన్లతో నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. పల్లె ప్రగతిలో భాగంగా కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి లైన్లను సరిచేయడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
అభివృద్ధిలోఅందరి భాగస్వామ్యం ఉండేలా ప్ర భుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి లో విద్యుత్ శాఖ పాత్ర కీలకంగా మారింది. ప్రత్యేకంగా పవర్ వీక్ పేరిట ప్రత్యేక కార్యాచరణ రూ పొందించింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లూజ్లైన్లు, వంగిపోయిన, తుప్పు పట్టిన స్తంభాలను తొలగింపు, రోడ్ల విస్తరణతో రోడ్డుపైకి వచ్చి రాకపోకలకు అసౌకర్యంగా మారిన స్తంభాలతో పాటు తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఎత్తులో ఏర్పాటు చేయడం, నాణ్యమైన సరఫరా కు సామర్థ్యాన్ని పెంచడం, డిమాండ్కు అనుగుణంగా కొత్తవి బిగింపు వంటి పనులు చేపట్టారు. మూడో తీగతో పాటు అవసరమైన పరికరాలు బిగించి పల్లెల్లో విద్యుత్ వృథాను అరికట్టి పంచాయతీలపై బిల్లుల భారం తగ్గించారు.
మొదటి దశలో 5 కోట్ల పనులు పూర్తి..
మొదటి విడుతలో భాగంగా కరీంనగర్ సర్కిల్లో 5 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. అందులో అత్యధికంగా లూజ్లైన్లతో పాటు మిడిల్ ఫోల్స్, పాత, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి పాతారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసి ప్రమాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. 180 వంగిపోయిన స్తంభాలు, 421 తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు, పాడైపోయిన స్తంభాల స్థానం లో 1,114 కొత్తవి, 161 మిడిల్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఫుట్పాత్లకు దూరంగా 35 డీటీఆర్లు బిగించారు. 488 లూజ్లైన్లు సరిచేయడంతో పాటు 307 డీటీఆర్ల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 108 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. 33.42 కిలోమీటర్లు చొప్పున మూడో వైరు, ఐదో వైరు వేశారు. గ్రామాల్లో 4,106 లూజ్లైన్లు, 1,552 వంగిపోయిన స్తంభాలను మార్చారు. 457.1కిలోమీటర్ల పొడవైన మూడో వైరు వేశారు. గ్రామాల్లో వీధిదీపాలు నిరంతరం వెలుగకుండా 1074 ఎంసీబీలు (మినియేచర్ కంట్రోల్ సర్క్యూట్ బ్రేకర్) బిగించారు.
ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమంలో 1094 లూజ్లైన్లు గుర్తించగా 910 లైన్లు సరిచేశారు. 531వంగిపోయిన స్తంభాల స్థానంలో 337 స్తంభాలను పాతారు. మూడో వైరు 1.787 కిలోమీటర్లు అవసరమని గుర్తించగా ప్రస్తుతం 1.031కిలోమీటర్ల పని పూర్తి చేశారు.
వేగంగా పనులు పూర్తి చేస్తాం..
పల్లె, పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేస్తున్నారు. పవర్వీక్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది.