పెద్దపల్లి రూరల్, జూలై 14: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందొచ్చని పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లిలోని రైతు వేదికలో బుధవారం రైతులకు పంటల సాగు సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై ఏవో కాంతాల అలివేణి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులకు పీఎస్బీ (భాస్వరం కరిగించే బ్యాక్టీరియా) సంచులను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో శ్వేత పాల్గొన్నారు.
అవమానించారని ఫిర్యాదు
బ్రాహ్మణపల్లి రైతు వేదికలో రైతులకు అవగాహన సమావేశంలో వేదికపైకి తనను ఆహ్వానించలేదని ఉప సర్పంచ్ ఓదెల రాజు కలెక్టర్ కు ఫిర్యా దు చేశారు. సమావేశానికి సర్పంచ్ హాజరు కాలేదని అలాంటప్పుడు అక్కడే సమావేశంలో ఉన్న తనను ఉప సర్పంచ్గా వేదికపైకి ఆహ్వానించాల్సి ఉన్నా పిలువలేదని చెప్పారు. ఆయన ఏవోపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డ్రమ్సీడర్తో సులభంగా వరినాట్లు
పాలకుర్తి, జూలై 14: డ్రమ్సీడర్తో వరి నాట్లు సులభంగా వేసుకోవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శశిధర్ పేర్కొన్నారు. పాలకుర్తిలోని మాదాసు శ్రీనివాస్ తనకు ఉన్న రెండెకరాల్లో డ్రమ్సీడర్తో వరి సాగు చేశారు. ఈ విధానంలో సాగు చేస్తే ఎకరానికి రూ.8వేల ఖర్చు మిగులుతుందని, కూలీల సమస్య తగ్గుతుందని చెప్పారు. పంటకాలం తగ్గి అధిక దిగుబడి సాధించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఆవుల కొమురయ్య, గంగుల నర్సయ్య, దారవేణి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.