గోదావరిఖని, జూలై 14: ఆర్జీ-1 పరిధిలో ఓసీపీ-5 నిర్మాణంతోనే గోదావరిఖని ప్రాంతానికి మనుగడ ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, దీటి బాలరాజు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం వారు మాట్లాడారు. ఓసీపీ-5పై ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ నాయకుడు మక్కాన్ సింగ్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మక్కాన్ సింగ్ మాట్లాడడమే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రజలు, ఈ ప్రాం త అభివృద్ధిని ఆకాంక్షించి చిత్తశుద్ధితో పోరాడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఫైవింక్లయిన్ ఏరియా రైల్వే ట్రాక్ పక్క నుంచి ఓసీపీ-5 నిర్మాణం జరుగుతుందని తెలిసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి అధికారులతో మాట్లాడి ఇక్కడి ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం జరుగవద్దని మాట్లాడి ఫైవింక్లయిన్ నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరం నుంచి ప్రాజెక్టు నిర్మాణం జరిగేలా ఒప్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఓసీపీ-4 జీవితకాలం పూర్తి కాగా, ఇన్నాళ్లు అందులో పని చేసిన కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబా లు మరో చోటకు బదిలీపై వెళ్లడం కంటే ఓసీపీ-5 నిర్మాణం జరిగితే ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు భవిష్యత్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే అవకాశం ఉంటుందని వివరించారు. అందుకు బొగ్గు కొరత కూడా ఏర్పడకుండా ఓసీపీ-5 దోహద పడుతుందన్నారు. అంతేగానీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసేందుకు ఓసీపీ-5ని అడ్డుపెట్టుకొని మాట్లాడడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు. సమావేశంలో కుమ్మరి శ్రీనివాస్, మొగిలి, నారాయణ దాసు మారుతి, వేణు, తిరుపతి, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, రమేశ్, హమీద్ ఉన్నారు.