సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలు
శాఖల వారీగా పకడ్బందీ ఏర్పాట్లు
రామగుండం ఎమ్మెల్యే చందర్
గణేశ్ నిమజ్జన కార్యాచరణపై సమీక్షా సమావేశం
కోల్సిటీ, సెప్టెంబర్ 13: పవిత్రమైన గోదావరి జలాలను కలుషితం కాకుండా కాపాడుకుందామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాల కార్యాచరణపై సోమవారం బల్దియా కార్యాలయంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, హెచ్ఆర్కే సంస్థల అధికారులతో నగర పాలక సంస్థ మేయర్ డా.అనిల్కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. గోదావరి పవిత్రను కాపాడుకునే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేసి పీవోపీ విగ్రహాలను నది సమీపంలోని సింగరేణి బూడి ద చెరువులో నిమజ్జనం చేద్దామన్నారు. గోదావరి వద్ద సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ సంస్థల అధికారులు ఏర్పాట్లను ప్రారంభించాలని ఆదేశించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి సుమారు వెయ్యి వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకవచ్చి గోదావరి నదిలో నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. పారిశుధ్య పనులను నగర పాలక సంస్థ అధికారులు సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నది పరిసరాల్లో వాహనాల పార్కింగ్ కోసం తుమ్మ చెట్లను తొలగించాలని సింగరేణి అధికారులను కోరారు. నగర మేయర్ డా.అనిల్కుమార్ మాట్లాడుతూ, ఉత్సవాల్లో ఆయా పరిశ్రమలకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. హెచ్కేఆర్ సంస్థ అధికారుల నిర్లక్ష్యంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు పారిశుధ్య పనులను గాలికి వదిలేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్ అధికారులకు అప్పగించిన పనులను ప్రారంభించాలన్నారు.
డీజేలకు అనుమతి లేదు: డీసీపీ
నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి ఇచ్చేప్రసక్తే లేదని పెద్దపల్లి డీసీపీ రవీందర్ స్పష్టం చేశారు. పలువురు కార్పొరేటర్లు, ఉత్సవ నిర్వాహకులు స్వాగత వేదిక వద్దకైనా డీజేలను అనుమతి ఇవ్వాలని కోరగా, డీసీపీ జోక్యం చేసుకొని డీజేలను నిషేధించినట్లు చెప్పారు. సమావేశంలో ఖని ఏసీపీ ఉమేందర్, డిప్యూటీ కమిషనర్ నారాయణరావు, మేనేజర్ రాములు, సూపరింటెండెంట్ చిన్నారావు, మహేందర్, కిశోర్కుమార్, వెంకటేశ్వర్లు, గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్, రామగుండం సీఐలు, ఉత్సవ కమిటీ సభ్యులు, వీహెచ్పీ, భజరంగ్దళ్ కార్యకర్తలు, కార్పొరేటర్లు తదితలు ఉన్నారు.