ఆధునిక హంగులతో జీ ప్లస్ 2 పద్ధతిలో భవంతి
తుదిమెరుగులు దిద్దేపనిలో అధికారులు
త్వరలోనే ప్రారంభోత్సవం
పెద్దపల్లి, జూలై 13(నమస్తే తెలంగాణ): 22 ఎకరాల విశాలమైన స్థలం.. ఆరు బ్లాకులు, వందగదులు.. సకల వసతులు.. ఆధునిక హంగులతో పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ రెడీ అయింది. ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో పెద్దబొంకూర్లోని ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో వివిధ శాఖల కార్యాలయాలు, ఉన్నతాధికారుల క్యాంపు ఆఫీసులతో కూడిన అతి పెద్ద భవంతి నిర్మాణం పూర్తయింది. 40.08 కోట్లతో నిర్మాణ పనులన్నీ పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దబొంకూర్ ఎస్సారెస్పీ క్యాంపు ఆవరణలో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం 22 ఎకరాల్లో 40.08 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. వివిధ శాఖల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా జీ ప్లస్ టూ పద్ధతిలో ఆరు బ్లాక్లుగా విభజించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 45, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించారు. మొత్తంగా ఈ భవన సముదాయంలో 42 శాఖలకు కేటాయించనున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ చాంబర్లతో పాటు డీఆర్వో, జిల్లా స్థాయి అధికారుల చాంబర్లలో సకల సౌకర్యాలు కల్పించారు. విశాలమైన మీటింగ్ హాల్, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కలెక్టరేట్ ఆవరణలో అహ్లాదకరమైన వాతావరణం కోసం అందమైన గ్రీనరీని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కార్యాలయానికి భారీ కమాన్ను ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు.
పెద్ద పెద్ద మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. కార్యాలయం లోపల ఫౌంటెయిన్ను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి ఆర్డీఓ శంకర్కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయం నిర్మాణ పనులు, వసతి సౌకర్యాలు, గ్రీనరీ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు. అలాగే అధికారుల నివాసాల కోసం ప్రభుత్వం రూ. 6.58 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్ క్యాంపు ఆఫీసులు పూర్తయ్యాయి. డీఆర్వోతోపాటు మరో ఎనిమిది మంది జిల్లా స్థాయి అధికారుల నివాస గృహాలు పూర్తికావచ్చాయి.