గోదావరిఖని, జూన్ 7: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-2ఏ గనిని జీఎం కే నారాయణ సందర్శించారు. గనిలోని సాండ్ స్టావింగ్ ఎస్ఎస్ 11/2 సిమ్ ప్యానల్లోని పనులను పర్యవేక్షించారు. అక్కడ సపోర్టు సిస్టం, ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని, ఇసుక స్టౌయింగ్ ఎలా చేపడుతున్నారని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల రక్షణ చర్యలు, బొగ్గు వెలికితీత పనులను పరిశీలించారు. భూగర్భ గనిలోని పని స్థలాలను పరిశీలించి వెంటిలేషన్ ఉండేలా చూడాలని సూచించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట రక్షణ అధికారి కేవీ రావు, ఏజెంట్ శ్రీనాథ్, మేనేజర్ రామస్వామి, ఇంజినీర్ రామమూర్తి, సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇంజినీర్ డేవిడ్, పిట్ ఇంజినీర్, అధికారులు ఉన్నారు.
‘అడ్రియాల’ గనిలోకి డైరెక్టర్
రామగిరి, జూన్ 7: సింగరేణి ఏఎల్పీ ఏరియా పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిలోకి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ దిగి పరిశీలించారు. ఈ మేరకు సోమవారం గనిలోకి దిగి లాంగ్వాల్ పని స్థలాలను సందర్శించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పని చేసి లక్ష్య సాధనకు కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఓబీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్ సమీక్షించారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, ఆర్జీ-2,3, భూపాలపల్లి, శ్రీరాంపూర్ జీఎంలు, ఓసీపీల అధికారులతో చర్చించారు. ఓబీ లక్ష్య సాధనలో వెనుకబడిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఓబీ లక్ష్యం సాధించినప్పుడే ఓసీపీల నుంచి బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. వీసీలో డైరెక్టర్ పీపీ బలరాం, కో-ఆర్డినేషన్ సూర్యనారాయణ, ఆర్జీ-3 జీఎం మనోహర్, ఏపీఏ జీఎం ఎన్వీకే శ్రీనివాస్, పీవో నాగేశ్వరరావు, ఇంజినీర్ రఘురాం, ఓసీపీ-1 పీవో రఘుకుమార్ ఉన్నారు.