రామగుండం సీపీ సత్యనారాయణ
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడి కుటుంబానికి పరామర్శ
జ్యోతినగర్, జూన్ 30: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు, అలియాస్ శంకర్(శంకర్రావు) అలియాస్ చంద్రన్న జనజీవన స్రవంతిలోకి రావాలని రామగుండం సీపీ సత్యనారాయణ కోరారు. ప్రసాద్రావు తల్లి వరలక్ష్మి ఇటీవల మృతి చెందగా, బుధవారం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని వారి ఇంటికి ఓఎస్డీ శరత్చంద్ర పవార్తో కలిసి వెళ్లిన సీపీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పండ్లు అందజేసి మా ట్లాడారు. అడవిలో ఉన్న ప్రసాద్రావు జనంలోకి రావాలన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తున్నదని, ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దన్నారు. గతేడాది ప్రసాద్రావు తండ్రి మృతి చెందగా, ఇప్పుడు తల్లి కూడా చనిపోయిందని చివరి చూపు కూడా దూరమైనట్లు తెలిపారు. ఇప్పటికైనా కుటుంబ సభ్యుల ద్వారా, లేక మీడియా, పౌర హక్కుల సంఘం ద్వారా ప్రభుత్వానికి లొంగిపోతే ప్రభుత్వం, పోలీసు శాఖ స్వాగతం పలుకుతుందన్నారు. తగిన వైద్య సాయం అందజేసి, జీవనోపాధి కల్పించి వారిపై ఉన్న రివార్డు అందజేస్తామని, ఆనందంగా జీవించేలా చూస్తామని తెలిపారు. ముందుగా పుల్లూరి ప్రసాద్రావు తల్లిదండ్రుల చిత్రపటాలకు సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కూడా పుల్లూరి ప్రసాద్రావును లొంగిపోవాలని మీడియా ద్వారా కోరారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సీఐ కణతాల లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్రాజ్, కార్పొరేటర్ రమణారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెట్టుపల్లి అనిల్రావు తదితరులు ఉన్నారు.
కంకణాల తల్లికి ఓఎస్డీ పరామర్శ
కాల్వశ్రీరాంపూర్, జూన్ 30: కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం ఓఎస్డీ శరత్చంద్ర పవార్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. కిష్టంపేటకు చెందిన మావోయిసు ్టకేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తల్లి వీరమ్మను పరామర్శించారు. ఈ సందర్భం గా ఆమెకు పండ్లు, బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ రాజిరెడ్డి మీడి యా ద్వారా కాని , పౌరహక్కుల సంఘం సభ్యు ల ద్వారా గాని లొంగిపోతే జీవనోపాధి కల్పించడంతోపాటు, అతడిపై ఉన్న రివార్డు అందిస్తామన్నారు. రాజిరెడ్డి తల్లి వీరమ్మ కంటి సమస్యతో బాధపడుతున్నదని, అమెకు పోలీస్ తరపున ఆపరేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. రాజిరెడ్డి లొంగిపోతే ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్, సర్పంచ్ తిరుపతిరెడ్డి ఉన్నారు.
ఇంటికి రారా రాజన్న..
‘ఊరికి దూరమై కాటికి దగ్గరవుతున్న కొడుకా రాజన్నా.. ఇంటికి రారా అంటూ కంకణాల రాజి రెడ్డి తల్లి వీరమ్మ చేతులు జోడించి వేడు కుంది. ముసలి దాన్ని అయిన బిడ్డా చేతగాని స్థితిలో ఉన్నా, నీరందిలోనే మీ నాయిన్న చనిపోయిండు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న కొడుకా రారా అంటూ కోరింది. నిన్ను చూడాలని ఉంది రారా కొడుకా అంటూ కంట తడి పెట్టింది. నా పాణం పోయే ముందు ఇంటికి వచ్చి నన్ను చూసుకోరా అంటూ విలపించింది. బీపీ, షుగర్, ముసలి తనంతో కంటి చూపు సరిగాలేక నడవలేక పోతున్నా, భూమి జాగ అన్ని ఉన్నా ఆడవికి ఎందుకు పోతివిరా, నీ కోసం కంటిమీద కునుకు లేకుండా చూత్తన్నా కొడుకా.. రాజన్నా ఇంటికి రారా అని విలపించింది.