పెద్దపల్లి, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): గ్యాస్ ధర వంటింట్లో చిచ్చుపెడుతున్నది.. రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి గుదిబండగా మారుతున్నది. వెయ్యికి చేరు వై పట్టపగలే చుక్కలు చూపుతున్నది. గతేడాది 500 ఉన్న రేటు రెట్టింపై బడుగుజీవుల నడ్డివిరుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటూ సిలిండర్ ధర పెంచుతూ అటు సబ్సిడీపై కోత విధిస్తూ సగటు జీవిపై పెను భారం మోపుతున్నది.
సామాన్యులపై తీవ్ర భావం
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటే గ్యాస్ ధర నెలనెలా పెరుగుతున్నది. గతేడాది 500 ఉన్న నేడు ప్రస్తుతం 930కి చేరింది. గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంటికి చేరే వరకు మరో 50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. త్వర లో వెయ్యికి చేరే అవకాశం ఉన్నది. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో గ్యాస్ ధర పెరుగుతోంది. అయితే సబ్సిడీ విషయంలోనూ కోత విధిస్తున్నారు. సిలిండర్కు కేవలం 46.88 పైసలు మాత్రమే వినియోగదారులకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా కేంద్రం అనుమతితో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెలా పెంచుతున్నాయి. సబ్సిడీ పెంపు విషయంపై మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. గతేడాది మేలో సబ్సిడీ 213 నుంచి 45వరకు తగ్గించారు. అప్పటి నుంచే అదేరాయితీ కొనసాగుతున్నది.
ప్రతి నెలా పెరుగుదల..
సిలిండర్ ధర ప్రతి నెలా ఎంతో కొంత పెరుగుతోంది. గత ఫిబ్రవరిలో రెండు సార్లు, మార్చి, మే నెలలో ఒక్కోసారి ధరలు పెరిగాయి. మళ్లీ జూలై, ఆగస్టు మాసాల్లోనూ పెంచారు. గ్యాస్ పెరుగుదల ధరలను పరిశీలిస్తే.. గతేడాది 2020 మార్చిలో సిలిండర్ ధర 880 ఉండగా, సబ్సిడీ 348 ఇచ్చారు. ఏప్రిల్లో 816 కాగా, సబ్సిడీ 213 ఇచ్చారు. ఆ తర్వాత మే నుంచి సబ్సిడీలో భారీగా కోత విధించారు. మేలో సిలిండర్ ధరను 660కి తగ్గించగా, సబ్సిడీని 45.88కి తగ్గించారు. 2021జనవరిలో గ్యాస్ సిలిండర్ ధర 765కు పెరుగగా, సబ్సిడీ 46.88 ఇచ్చారు. ఫిబ్రవరిలో 790కి పెంచగా, మళ్లీ 50కి పెంచి 840 చేశారు. మార్చిలో 890కి ధర పెంచి సబ్సిడీని 46.88 చేశారు. జూలైలో ఏకంగా 905కు పెంచగా సబ్సిడీ మాత్రం అంతే ఉంది. ఆగస్టులో 932కి పెంచా రు. జిల్లాలో హెచ్పీసీఎల్, భారత్, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. సుమారు 19గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా 2, 28, 718గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన కింద వేలాది కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండడంతో గ్యాస్ డిమాండ్ బాగా పెరిగింది. ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడుతోంది.
కట్టెల పొయ్యే నయం..
గ్యాస్ బండ ధర 15రోజుల్లో రెండు సార్లు రూ. 25చొప్పున పెంచేశారు. వెయ్యికి చేరువలోకి వచ్చేసింది. పేదలకు భారమవుతుంది. సామాన్య ప్రజలు గ్యాస్ పొయ్యిమీద వండాలంటే జంకుతున్నారు. కట్టెల పొయ్యే నయమనుకుంటున్నాం.
-దుర్గం కోమలి, సాయినగర్, రంగంపల్లి
ధర పెంపుతో ఇబ్బందులు..
గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. తరచూ ధరలు పెరగడంతో గ్యాస్ వినియోగించాలంటేనే భయపడాల్సి వస్తుంది. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-పులిపాక మమత, మూలసాల,పెద్దపల్లి మండలం