మానవుడు సంఘజీవి అని ప్రాచీన గ్రీకు తత్తవేత్త అరిస్టాటిల్ వేల ఏండ్ల క్రితం ఉద్ఘాటించాడు. కానీ అదే మానవుడు నేడు ఒక సూక్ష్మ విషక్రిమి వల్ల సంఘ బహిష్కరణకు గురవుతున్నాడు. అంతేకాకుండా రోజులు గడుస్తున్న కొద్దీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూపోతూ, దగ్గరకు వస్తే కబళిస్తానని హెచ్చరిస్తున్నది ఆ విష క్రిమి.
ఎన్నడూ లేని విధంగా ఈ సూక్ష్మక్రిమి మనిషి తన ముఖానికి మాస్క్లు తొడిగేలా చేసింది. కుల మత వర్గభేదం లేకుండా, బీద ధనిక అనే తారతమ్యం లేకుండా సర్వాంతర్యామిగా అన్ని దేశాల్లోనూ అడ్డు అదుపు లేకుండా స్వైరవిహారం చెస్తున్నది. ప్రతిభావంతుల నైపుణ్యాలకు, జ్ఞానవంతుల విజ్ఞానానికి పరీక్ష పెడుతున్నది. మనిషి తాను తలచుకొంటే కొండలను పిండి చెసే సత్తావున్నా సూక్ష్మ క్రిమి ముందు తలవంచుకునే పరిస్థితి వచ్చింది. మనిషికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని తెలిసిన నేడు అదే మనిషి యొక్క మనోబలాన్ని కుంగదీస్తున్నది.
మనిషి మూడే మూడు సర్వసాధారణ వ్యాధి నిరోధక సూత్రాలను (మాస్క్ను ధరించడం, చేతులు కడగటం, భౌతిక దూరాన్ని పాటించడం) మరిచి ఆ క్రిమి విశ్వవ్యాప్తికి తోడ్పడి, తాను నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. విపత్తులో నివసిస్తున్న మనిషి నేడు ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తున్నాడు. సమాజంలో వనరులు పరిమితంగా ఉండటం వల్ల, నేడు సాటి మనిషిని సోదరభావాన్ని మరచి నిలువునా దోచుకుంటున్నాడు.
వేదంలో పొందుపరిచిన ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడి నేడు వాస్తవ రూపం దాలుస్తున్న ది. నేటి వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్తో పోరాడుతున్నారు. బాధితులను రక్షిస్తున్నారు. తమవంతు సహాయ సహకారాలను నిర్విరామంగా అందిస్తూ సాటి మానవవునికి నారాయణుడయ్యారు. అంతే కాకుండా సమయానికి అనుగుణంగా తగు జాగ్రత్తలను చెప్తూ మనిషికి జాగరూకతను చేస్తున్నారు. ఈ సూక్ష్మ విష క్రిమి బారిన పడకుండా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ను త్వరితగతిన పరిశోధించి తీసుకొనివచ్చింది కూడా మనిషే. కొన్ని వేల మంది జీవితాలను పణంగా పెట్టి వాలంటీర్లుగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ పనితీరుకు తోడ్పడ్డారు. కానీ కొందరు సంకోచ మానవులు వ్యాక్సిన్పై సందేహాలను సృష్టించి వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవటం విషాదం.
సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో సామాజిక మాధ్యమాలలో అవాస్తవాలు అడ్డు అదుపు లేకుండా ప్రచారమై అనవసర భయందోళనలు రేగుతున్నాయి. మనిషిని వైరస్ నుంచి కాపాడాలంటే భౌతికదూరాన్ని విధిగా పాటించాలి. ఈ క్రిమి ఇప్పటికే లక్షల కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎందరినో బలితీసుకున్నది. ఎంతో మంది చిన్నారులను అభాగ్యులుగా, అనాథలుగా చేసింది.
ఈ విష క్రిమిని కట్టడి చేయాలంటే తప్పనిసరిగా భౌతిక దూరాన్నీ, మాస్క్ ను, తరచుగా చేతులను శుభ్రపరచుకోవటం చేయాలి. వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని సాటి మనుషుల జీవితాలను కాపాడాలి. తద్వారా తిరిగి మానవుడు సంఘజీవిగా మారాలి.
మనిషి తెలిసో తెలియకనో మూడే మూడు సర్వసాధారణ వ్యాధి నిరోధక సూత్రాలను
(మాస్క్ని ధరించడం, చేతులు కడగటం, సామజిక దూరాన్ని పాటించడం) మరచి ఆ సూక్ష్మ విష క్రిమిని విశ్వవ్యాప్తి చెందేవిధంగా చేసి నేడు తను నిస్సహాయ స్థితి లోనికి కూరుకుపోయాడు. ఆపత్కాల విపత్తులో నివసిస్తున్న మనిషి నేడు రాజ్యం వైపు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వైపు దీనంగా చూస్తూ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తున్నాడు.
డాక్టర్ ఎం. చంద్రశేఖర్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్)