మనం స్వరాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో చేసిన ప్రజాహిత ప్రభుత్వ విధానాల్లో జల సంరక్షణ ప్రధానమైంది. నదులను అడ్డుకోడం, నీరు ఎగువకు కూడా మళ్లించడం, కాలువలు లేదా ఉపనదుల ద్వారా పెద్ద చెరువులకు పంపడం, వీలైనంత విస్తృత పరిధిలో భూమిని సాగుకు తేవడం, తాగునీరు అందించడం, భూగర్భ జల వనరులను అభివృద్ధి చేయడం మొదలైనవాటిని ప్రభుత్వం ఓ మహా యజ్ఞంలా నిర్వహిస్తున్నది.
సేద్యపు నీటిపట్ల, జల విధానాల పట్ల, న్యాయ నిర్ణయాల పట్ల ప్రభువుకు గల శ్రద్ధ దీనివల్ల తెలుస్తున్నది. అక్రమాలు జరిగితే జాగ్రత్త అనే హెచ్చరిక, సందేశం ప్రజలకు అందేందుకే ఈ ‘శాసనం’ నిర్మాణం జరిగింది. మరొక విశేషం, శాసనం అంతా సంస్కృతంలో ఉంటే, తీర్పు తెలుగులో రాయబడింది.
చెరువుల, డ్యాంల నిర్మాణమే కాదు వాటి చివరి నీటిబొట్టు సేద్యం కావాల్సిన, ఆఖరు పొలం దాకా పారిందా లేదా అన్నదే పరమ లక్ష్యంగా పాలన సాగాలి. అప్పుడే పాలకులకు ప్రజల గుండెల్లో గుడులు నిర్మాణమవుతాయి. మన మిషన్ కాకతీయ లక్ష్యం నిరంతరం అదే కావాలి.
సరిగ్గా మనకు 775 ఏండ్ల కిందట ఓ అద్భుత సంఘటన తెలంగాణలో జరిగింది. అది 1246 డిసెంబర్ 15, శనివారం. పరాభవ నామ సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి. అది నేటి ప్రభుత్వానికి ఆదర్శవంతంగా కాకతీయ ప్రభువుల జల సంరక్షణా విధానాలకు అద్దంపట్టే కార్యం. అప్పుడు పరిపాలిస్తున్న ప్రభువు కాకతీయ గణపతిదేవ చక్రవర్తి. ఆయన హయాంలో సుమారు 3 వేల చెరువులు జలకళతో తళతళలాడుతున్న రోజులు. పూర్వపాలకులైన విష్ణుకుండినులు, కందూరు చోళులు, కొలనుపాక చాళుక్యులు నిర్మించినవి కొన్ని కాగా తాను నిర్మించినవి కొన్ని. ‘వాపీ కూప తటాకాది’ నిర్మాణాల వెనుక ప్రభువుల పుణ్య సముపార్జనా కాంక్ష, వర్తమాన కాలాన పాడి పంటల సస్యశ్యామల తెలంగాణ దేశం, భావికాలంలో కీర్తిప్రతిష్ఠలు ఇలా త్రిముఖ వ్యూహంగా కాకతీయుల జలయజ్ఞం నడిచింది. కాకతీయ గణపతిదేవుని పెదనాన్న రుద్రదేవుని వేయిస్తంభాల గుడి శాసనంలో ‘యస్యోత్తుంగ తరంగ తాడిత వియత్ సప్తార్ణవీయా జలం’ అని వర్ణించినట్లు వారి చెరువులు బృహత్తటాకాలు. నాగ సముద్రం, కేస (రి) సముద్రం, ధర్మసాగరం, విలా (స) సాగరం, ఉదయ సముద్రం, బాల సముద్రం ఇలాంటి పేర్లు అవి నేటికీ నిల్చి ఉన్నాయి.
అయితే నాటి ఒక సంఘటనలో ఒక చిన్న పొరపాటు జరిగింది. (కరీంనగర్ జిల్లా లోని) నేటి చొప్పదండికి దగ్గరలోని చామనపల్లికి గొనుగు కాలువ ద్వారా నీరు అందుతున్న సమయంలో కాలువ చివరి బ్రాహ్మణుల పొలాలకు నీరు అందలేదు. కారణం బహుశా ఎగువన ఎవరో గండి కొట్టి ఉంటారు. ఆ విషయం వీరు ఓరుగల్లు వెళ్లి గణపతిదేవునికి మొరపెట్టుకున్నారు. ఆయన విషయం విని, నిజానిజాలు తెలుసుకునేందుకు తన బావమరిది జాయప సేనానిని పురమాయించాడు. జాయప తన వద్ద గల ‘మంచిరాజు’ అనే నమ్మకస్తుడైన వ్యక్తిని దర్యాప్తునకు పంపినాడు. ఈ పరిశీలనాధికారి సబ్బి మండలాధిపతి అక్షయ చంద్ర దేవుణ్ణి నెడవూరు గ్రామంలో కలిసి, ఆయన అనుమతితో అతని అమాత్యులైన రవిదత్తుడు, వాఘదేవుడు, హింగుళా దేవుణ్ణి కలిసి వివాద నిర్ణయార్థం చామనపల్లికి వచ్చినాడు. చిన్న పంచాయతీ పెట్టి కుమ్మరికుంట, ద్యా(దే)వనపల్లి, కట్య(ట్టె)కోలపల్లి వృద్ధులతోటి కల్సి కాలువపక్క సభపెట్టి విచారణ చేసి ప్రభువుకు తెలిపినాడు. తిరిగి దీనిపై రెండో విచారణ సాగింది. నారయణ, మహరుకా అనే వారిద్దరు సమీక్షించినారు. కొందరు రెడ్లను, నాయుళ్లను, బహుకులాల వారిని, సమీప గ్రామాల నుంచి పిలిపించినారు. వైష్ణవజియ్య (వామజియ్య), మల్లిజియ్యలను, దేవనలపలి సోబకుల అన్నపరెడ్డిని, శ్రీధర పెద్ది, పోతారెడ్డి, మిట్టపల్లి మాదిరెడ్డి వంటి గ్రామ పెద్దలను పిలిపించి విచారించగా అందరూ నీరు మహాజనులవేనని, వారికి అన్యాయం జరిగిందని తెలిపినారు.
ఈ కాలువ వివాదమున్ను ఎన్నండు లేదు. ఈ కాలువ పక్క పదునొకండవ మడి, ఉత్తరాన పల్లయుదాక, మడికుంట తూర్పెల్లి మహాజనులదే’ అని నిర్ణయించి ప్రభువు ఆజ్ఞగా రెండు రాగి రేకులపై నాలుగు పక్కల సంస్కృతంలో శాసనం చెక్కించి రాజాజ్ఞగా అందజేసి ఓరుగల్లుకు వెళ్లిపోయినారు.
ఈ శాసనం నాటి పాలకుల పాలనా విధానాలకు అద్దం పట్టింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు పరీక్షపై పరీక్ష నిర్వహించిన పలు అధికారులు, ప్రజల భాగస్వామ్యం, పలు కులాల ప్రాతినిధ్యం, క్షేత్రస్థాయి సమావేశం, అక్కడే నిర్ణయం, శాసనం అన్నీ విశేషాలే. ఈ వివాదాన్ని ‘గొనుగు కాలువ వివాదం’ అని శాసనంలో పేర్కొనబడింది. కార్తీకంలో మొదలైన వివాదం రెండు నెలల తర్వాత తీర్పువచ్చింది.
సేద్యపు నీటిపట్ల, జల విధానాల పట్ల, న్యాయ నిర్ణయాల పట్ల ప్రభువుకు గల శ్రద్ధ దీనివల్ల తెలుస్తున్నది. అక్రమాలు జరిగితే జాగ్రత్త అనే హెచ్చరిక, సందేశం ప్రజలకు అందేందుకే ఈ ‘శాసనం’ నిర్మాణం జరిగింది. మరొక విశేషం, శాసనం అంతా సంస్కృతంలో ఉంటే, తీర్పు తెలుగులో రాయబడింది. స్థానికుల ముందు ఈ శాసనం చదువుతుంటే ప్రభువు ఏం చెప్పదలిచాడో సామాన్యులైన జనులకు, రైతులకు అర్థమయ్యేలా జాగ్రత్త తీసుకొన్నారన్నమాట. అంటే మాతృభాషలో ‘జీవో’ జారీ అయింది. పాలితుల మాతృభాషకు పాలకులి చ్చే శ్రద్ధను శాశ్వతం చేసింది ఈ శాసనం. అం దుకే ఆ ప్రభువులను రెండు శతాబ్దాల తర్వాత కూడా తర్వాతి ప్రభువులు తమ శాసనాల్లో ‘ధర్మాత్ములని’ పేర్కొన్నారు.
చెరువుల, డ్యాంల నిర్మాణ మే కాదు వాటి చివరి నీటిబొ ట్టు సేద్యం కావాల్సిన, ఆఖరు పొలం దాకా పారిందా లేదా అన్నదే పరమ లక్ష్యంగా పాల న సాగాలి. అప్పుడే పాలకులకు ప్రజల గుండెల్లో గుడులు నిర్మాణమవుతాయి. మన మిషన్ కాకతీయ లక్ష్యం నిరంతరం అదే కావాలి.
డాక్టర్ సంగనభట్ల నరసయ్య