2019 జూన్లో వ్యక్తిగత సెలవుపై అమెరికా వెళ్లినప్పటి సంగతి. మా బిడ్డ చదువుకున్న టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఏర్పాటుచేసిన సింహం బొమ్మ దగ్గర ఒక శిలాఫలకం నన్ను ఆకర్షించింది. ఈ యూనివర్సిటీ ప్రాంతం ఒకప్పుడు కాడో జాతి స్థానిక అమెరికన్ల నివాస ప్రాంతం. వీరి నివాస ప్రాంతం నైరుతి దిశలో ఆర్కాన్సాస్ వరకు, వాయవ్య దిశలో లూసియానా వరకు ఉండేది.
‘అమెరికాలో రెడ్ ఇండియన్స్ లాగా. మనం, మన సంస్కృతి మ్యూజియంలో వస్తువులుగా మారవద్దనుకుంటే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుందాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ రాదు’ ఇట్లా సాగేది ఆ ప్రసంగాలు. అయితే ఆ దురవస్థ తెలంగాణకు పట్టకుండా తప్పిపోయింది. సమస్త తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిలబడి కలబడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నది.
16వ శతాబ్దానికే కాడోజాతి అమెరికన్లు గ్రామా ల్లో స్థిర వ్యవసాయం ప్రారంభించారు. వీరికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి, పండుగలు, ఆచార వ్యవహారాలున్నాయి. యూరప్ నుంచి వలసవాదులతో వ్యాపార లావాదేవీలు జరిపేవారు. 1889లో అక్కడ యూనివర్సిటీ ఏర్పాటుచేయడంతో వారిని ఓక్లాహామా ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించారు. అక్కడ స్వయం ప్రతిపత్తి కలిగిన కాడోనేషన్ కూడా ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ర్టానికి ఆ పేరు కాడోజాతి వారి భాషలో ఉన్న టేషస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే స్నేహితులని అర్థం. శిలాఫలకంలో వివరాలన్నీ రాశారు.
ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక అమెరికన్ నేషన్స్ అమెరికా అంతట చాలా ఉన్నాయి. యూరప్ వలసవాదులు అమెరికా ఖండాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడి స్థానిక అమెరికన్లతో జరిగిన ఘర్షణలు, మానవ హననం అమెరికా అభివృద్ధి చరిత్రలో మానని గాయం. ఈ వివరాలన్నీ హోవార్డ్ జిన్ రాసిన ‘అమెరికా ప్రజల చరిత్ర’ ( ఏ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్) పుస్తకంలో చదువవచ్చు. విల్లు, బాణాలతో చేసే స్థానికుల పోరాటాలు యూరోపియన్ల తుపాకుల ముందు నిలువలేకపోయాయి. వలసవాదులకు లొంగిపోయి బానిసలుగా మారారు. ధిక్కరించిన జాతులు ఊచకోతకు గురైనాయి. యూరోపియన్లు రాక మునుపు లక్షల సంఖ్యలో ఉండే జాతుల ప్రజలు వందల్లోకి తగ్గిపోయారు. విశాలమైన భూ ఖండాన్ని అభివృద్ధి చేయడానికి వారికి మానవశ్రమ కావలసి వచ్చింది. ఆఫ్రికా నుంచి వేటాడి తీసుకువచ్చిన వేలాది మంది నల్లజాతి బానిసల శ్రమతో అమెరికాలో వ్యవసాయం, గనులు, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. అమెరికా అభివృద్ధి అంతా రక్తసిక్త చరిత్ర అని ఆ పుస్తకం వివరించింది.
ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్ కాన్యాన్ కొలరాడో నదీ లోయ ప్రాంతంలో కూడా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ‘వాలాపై’ జాతికి చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాలాపై నేషన్ను 1883లో ఏర్పాటుచేసింది. 2900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వాలాపైనేషన్ ప్రాంతం లో నమోదైన మొత్తం జనాభా 2300. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు సుమారు 1350. ఇక్కడి రాతికొండల నడుమ కొలరాడో నది ప్రవహిస్తుంది. గాజుతో నిర్మించిన స్కై వాక్ బ్రిడ్జి మీద నుంచి పర్యాటకులు గ్రాండ్ కాన్యాన్ అందాలను వీక్షిస్తారు. ఫొటోలు దిగుతారు. ఫొటోలు అక్కడి ఉద్యోగులు మాత్రమే తీస్తారు. వారంతా వాలాపైజాతికి చెందిన వారే. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం అంతా వాలాపైనేషన్కు చెందుతుంది. స్కైవాక్ బ్రిడ్జి మీదకు వెళ్లేముందు క్యూలైన్ గోడలపై వాలాపై జాతి ప్రజల చరిత్ర, వారి పోరాటాలు, వారు గతంలో ఉపయోగించిన వస్తువులు తదితర పోస్టర్లను ప్రదర్శనకు పెట్టారు.గ్రాండ్ కాన్యా న్ వద్ద ఏర్పాటుచేసిన దుకాణంలో ‘అయామ్ ది గ్రాండ్ కాన్యాన్: ది స్టోరీ ఆఫ్ ది హవసుపాయి పీపుల్’ పుస్తకం నన్ను ఆకర్షించింది. బంగారం కోసం యూరోపియన్ల దాడులు, స్థానికుల పోరాట చరిత్ర దానిలో ఉన్నది. గ్రాండ్ కాన్యాన్ వద్ద వాలాపైజాతి ప్రజలు వదిలేసిన ఊరును సందర్శకుల కోసం కాపాడుతున్నారు.వారి గుడిసెలు, పశు వుల కొట్టాలు, వంటపాత్రలు, వ్యవసాయ పనిముట్లు అక్కడ దర్శనమిస్తాయి. స్థానిక వాద్యాలతో వారి పాటలను కొందరు వినిపిస్తూంటారు. స్థానిక అమెరికన్ గ్రామాలన్నీ ఇటువంటి పర్యాటక ప్రాంతాలుగా మారాయి. 1970వ దశకంలో హాలీవుడ్ హిట్ సినిమా ‘మెకన్నాస్ గోల్’్డ షూటింగ్ ఇక్కడే జరిగిందని మిత్రుడు కొండపల్లి వేణుగోపాలరావు చెప్పాడు.
తెలంగాణ ఏర్పాటైన ఏడేండ్ల తర్వాత ఇదంతా గుర్తుచేసుకోవడానికి పూర్వరంగం ఉన్నది. ఉద్యమకాలంలో ప్రొఫెసర్ జయశంకర్ అనేక సభల్లో చేసిన ప్రసంగాల్లో తరచుగా భాష,సాంస్కృతిక పరాయీకరణ గురించి చెప్పేవారు. ‘ఒక జాతి ఆర్థికంగా నష్టపోతే పుంజుకోవచ్చు. కానీ సాంస్కృతికంగా నష్టపోతే జాతి అస్తిత్వం కనుమరుగవుతుంది. తెలంగాణ ఏర్పాటు కాకపోతే మన భాష, సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతాయి. ఒకప్పుడు మనుగడలో ఉన్న తెలంగాణను, మ్యూజియాల్లో భద్రపరచిన మన బతుకమ్మను, మన బోనాలను, మన సాంస్కృతిక చిహ్నాలను చూసుకో వలసిన దుస్థితి మన తర్వాతి తరంవారికి వస్తుంది. ‘అమెరికాలో రెడ్ ఇండియన్స్. అట్లా ‘మనం, మన సం స్కృతి మ్యూజియంలో వస్తువులుగా మారవద్దనుకుంటే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుం దాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ రాదు’ ఇట్లా సాగేది ఆ ప్రసంగాలు. అయితే ఆ దురవస్థ తెలంగాణకు పట్టకుండా తప్పిపోయింది. సమస్త తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిలబడి రాష్ట్రం సాధించుకున్నది. తెలంగాణ తన భాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకుంటూ పురోగమిస్తున్నది.
శ్రీధర్రావు దేశ్పాండే