ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. భారత జనాభాలో సుమారు 65 శాతం 28 సంవత్సరాల లోపు వారే అని వర్క్ ఫోర్స్ గణాంకాలు చెబుతున్నాయి. ఆ మాటకు వస్తే, 45 శాతం జనాభా 25 సంవత్సరాల లోపు వారే. వీరందరూ భారత్ భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా మారనున్నారు. అయితే, వీరు చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉండటం గమనార్హం. అంటే చేసే పనికి కావలసిన నైపుణ్యాలు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
మనదేశంలో యువకుల చదువులకు అకడమిక్ రికార్డు పరంగా మంచి మార్కులు, గ్రేడ్లు వస్తున్నాయి. కానీ తదుపరి జీవన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనుటలో నైపుణ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరవడుతున్నది. దీంతో వారు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. యువతలో చదువు (అకడమిక్)- నైపుణ్యాలు – నాలెడ్జ్ ఈ మూడు అంశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో ప్రపంచ మార్కెట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారు. ఈ గ్యాప్స్ ఎంత త్వరగా పూడ్చడానికి చర్యలు తీసుకుంటే, అంత త్వరగా ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకొని వారితో పాటు, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరవేయగలరు.
సింగపూర్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల యువతకు భవిష్యత్తు అవసరాలను తీర్చే నైపుణ్యా లు, నాలెడ్జ్ అందిస్తున్నాయి. తద్వారా ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకుని, అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండే విధం గా తర్ఫీదు ఇస్తున్నారు. అదే విధంగా, ఫిన్లాండ్ దేశం కూడా ఆ దేశ యువతకు వివిధ పరిశ్రమలకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన చదువును, నైపుణ్యాలను అందిస్తున్నది. వారికి టీవీఈటీ ద్వారా ప్రపంచ మార్కెట్లో నిలబడే విధంగా తర్ఫీదు ఇస్తున్నది. ఇటువంటి దేశాల ఒరవడిని మనదేశ యువతకు మన పాలకులు, ప్రభుత్వాలు అందించాలి. అప్పుడే ప్రపంచ వ్యాప్తం గా అన్ని రంగాల్లో మన యువత తమ మేధోమథనం ద్వారా భారత ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా నిలబడగలరు.
ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఒకేషనల్ శిక్షణను అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. ఈ 21వ శతాబ్దపు ఆధునిక కాలంలో ముఖ్యంగా ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జీ-పాట్ వంటి నూతన చదువులు, విధానాలు అన్నింటా ఆధిపత్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో మనదేశ విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానానికి, నైపుణ్యాల అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. అంతే కానీ, కాలం చెల్లిన మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు బలపరిచే చదువులకు చోటివ్వరాదు. సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహించే చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక కొవిడ్ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త చదువులు, రంగాలు రంగప్రవేశం చేశాయి. ముఖ్యంగా నర్సింగ్, బ్యూటీ, వెల్నెస్, ఇంటర్ నెట్ సేవలు, ఆన్ లైన్ వ్యాపారాలు, మార్కెట్లు సాఫ్ట్వేర్ రంగాలు, యానిమేషన్, గిగ్, మూన్ లైట్నింగ్, అంతరిక్ష పర్యాటకం, టూరిజం, పర్యావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలా అనేక నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మహిళలు, పురుషులు ఉద్యోగాలు అందిపుచ్చుకుంటున్నారు. ఆ మాటకు వస్తే, 2022 ఇండియా స్కిల్ రిపోర్ట్ నివేదిక ప్రకారం మనదేశంలో స్త్రీలు 52.8 శాతం ఈ నూతన రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
పురుషులు కేవలం 47.2శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారు. బ్యూటీ వెల్నెస్ వంటి మార్కెట్ లో 2018 నాటికి భారత్ వాటా 901.07 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండగా, 2024 నాటికి 2,463.49 బిలియన్ డాలర్ల వాటా ఉంటుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అనగా 2019-2024 మధ్య కాలంలో 18.40 శాతం పెరుగుదల ఈ వ్యాపార రంగాల్లో ఉంటుందని తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మన యువత నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్, టీం వర్క్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ వంటి వాటిని ఆకళింపు చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్ లో సుమారు 29 మిలియన్ల యువత నైపుణ్యలేమితో ఇబ్బంది పడతారని తెలిపారు. అందుచేతనే, ఇకనైనా చదివిన చదువుకు, అకడమిక్ పరిజ్ఞానంతో పాటు, నైపుణ్యాలు సాధించాలి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేసి, శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా ప్రభుత్వాలు విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
అప్పుడు మాత్రమే మనదేశానికి వరంగా ఉన్న యువ జనాభా, భవిష్యత్తులో భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరవేయగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలి. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యా య, అధ్యాపక ఖాళీలు భర్తీ చేయాలి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రంథాలయాలు, లేబరేటరీలు అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.అన్ని రంగాల్లో పేటెంట్ హక్కులు చేజిక్కించుకునే విధంగా మన విద్యావ్యవస్థను నిర్మించాలి. భవిష్యత్తులో ప్రపంచ మార్కెట్లను మన ఆధీనంలో ఉండే విధంగా మన యువత నైపుణ్యాలు అందిపుచ్చుకొని, ఉద్యోగ ఉపాధి అవకా శాలతోపాటు, వ్యాపార రంగా ల్లో సత్తా చాటాలి. 500 ట్రిలియ న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషించాలి…
ఐపీ రావు
63056 82733