తెలంగాణ రాష్ర్టావతరణ తర్వాత సబ్బండ వర్గాల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం విశేషకృషి చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలోని ఆకాంక్షలన్నీ నేడు నెరవేరుతున్నాయి. దీనికి తోడుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న రజక, నాయి బ్రాహ్మణ వర్గాలు ఎన్నో ఏండ్లుగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా వృత్తిపని చేసే చోట వారికి తగిన భద్రత, ప్రోత్సాహం లేక కుదేలయ్యారు. చేసిన పనితో వచ్చిన సొమ్మంతా డబ్బాకు, మడిగె కిరాయికి కూడా సరిపోని పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు విద్యుత్ బిల్లుల భారం భరించలేనిదిగా ఉండేది. ఈ వాస్తవిక పరిస్థితులపై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రజక, నాయిబ్రాహ్మణ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకానికి రూపకల్పన చేశారు. ఈ వృత్తిదారులందరికీ ఉచిత విద్యుత్తును ఇచ్చేందుకు నిర్ణయించటం ఈ వృత్తిదారులలో ఓ సువర్ణాధ్యాయం ప్రారంభమైనట్లేనని చెప్పవచ్చు.
రాష్ట్రంలోని సేవా పరమైన వృత్తులైన రజక, నాయి బ్రాహ్మణ వృత్తులవారి ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉత్తర్వులు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సందర్భంగా రజక, నాయి బ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ మనస్పూర్తిగా స్వయాన ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకంతో రజకులు, నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంది. అందుకే స్పెషల్ కేటగిరి కింద విద్యుత్ అధికారులు విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నది. కుల వృత్తుల అభివృద్ధి, సంక్షే మం కోసం ప్రభుత్వం తలపెట్టిన ఉచిత విద్యుత్ విధి విధానాల్లో మార్పులు చేసి, ఈ క్రింది విదంగా తగిన చర్యలు తీసుకుంటే వృత్తిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ పథకం లక్ష్యం నెరవేరుతుంది.
ట్రేడ్ లైసెన్స్ విధానం లేకుండా ఈ వృత్తులను వ్యాపార దృక్పథంతో గాకుండా సేవా పరమైన వృత్తులుగానే పరిగణించాలి. ఇందుకు గాను.. రజక, నాయి బ్రాహ్మణులకు కమర్షియల్గా గాకుండా స్పెషల్ కేటగిరి క్రింద ఉచిత విద్యుత్తును ఇవ్వాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో ఉన్న ఇస్త్రీ డబ్బాలకు తగు విధమైన రక్షణ, సాయం అందించాలి. సర్ చార్జి పడకుండా ముందే మూడు నెలల బిల్లు రజకులు, నాయిబ్రాహ్మణులు చెల్లించాలనేది లేకుండా చూడాలి.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఇండ్లలోనే రజకులు ఇస్త్రీ చేస్తున్నారు. కాబట్టి వీరికి కూడా ఉచిత విద్యుత్ వర్తింపజేయాలి. గృహ, కుటీర పరిశ్రమల కింద 250 యూనిట్లు దాటిన తర్వాత ప్రతి యూనిట్కు రూ.2 చొప్పున మాత్రమే చార్జీ వేయా లి. రజకులందరికి ఉచితవిద్యుత్ ఉపయోగపడటం కోసం కుల దృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, కుటుంబం ఫొటో, ఇస్త్రీ చేసే ఫొటోతో రెంటల్ అగ్రిమెంట్తో సంబం దం లేకుండా తక్కువ ధరకే విద్యుత్మీటర్ మంజూరు చేయాలి. ఇస్త్రీ చేసే సందర్భంలో రజకుడు చనిపోతే విద్యుత్ పథకంలో భాగంగా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించాలి. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన ఆధునిక ధోభీఘాట్లకు కూడా ఉచిత విద్యుత్ వర్తింపచేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిదారులందరికీ న్యాయం జరుగుతుంది.
కొండూరు సత్యనారాయణ
(వ్యాసకర్త: ఎం.బి.సి. రాష్ట్ర కో-కన్వీనర్ )