భారతదేశ ఉత్పాదక వర్గాలు ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీలు). దేశ నిర్మాణం, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఓబీసీలు దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. భారత జనాభాలో ఓబీసీలు దాదాపు 56 శాతం ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో వీరికి సరైన వాటా లభించడం లేదు. చాలా దిగ్భ్రాంతికరమైన విషయమేమంటే ఓబీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు కూడా నిరాకరించబడుతున్నాయి. ఓబీసీలు పదే పదే దోపిడీకి గురికాకుండా ఉండాలంటే కుల ఆధారిత జనగణన ఒక్కటే మార్గం.
కుల ఆధారిత జనగణన ద్వారా ఓబీసీ జనాభా పరిమాణాన్ని నిర్ధారించాలనేది చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఆమోదనీయమైన డిమాండ్. ప్రజల జీవన స్థితిగతులు, బాధలు, వేదనలు, అవసరాల గురించి అవగాహన లేకుండా, నిరుపేదల కోసం ప్రభుత్వాలు పథకాలు రూపొందించి, సంక్షేమ చర్యలను ఎలా అమలుచేస్తాయి? వెనుకబాటుతనంపై శాస్త్రీయవిధానంలో అధ్యయనం చేయకుండా, ఆయావర్గాల వారిని గణించకుండానే వారి అవసరాలను ఎలా తీరుస్తాయి? వ్యాధిని నిర్ధారించకుండా వైద్యం చేయడం సాధ్యమా?
మన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయజీవితాల్లో కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, 1931 నుంచి విశ్వసనీయమైన కుల డేటా అందుబాటులో లేకపోవడం విచిత్రం. 1951 నుంచి 2011 వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతి జనగణన షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలకే పరిమితమైంది. 1931 జనాభా లెక్కల్లో ఓబీసీలకు సంబంధించి సేకరించిన డేటా ఆధారంగా రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ లేదా మండల్ కమిషన్ నివేదిక రూపొందించబడింది. నేటికీ ప్రభుత్వాలు దానిపై ఆధారపడుతున్నాయి. తమకు సంబంధించిన డేటా లేకపోవడం వల్ల ఓబీసీలు రాజ్యాంగపరమైన రక్షణలు లేకుండా సమాజంలో తీవ్ర వివక్ష, ప్రాథమిక హక్కుల తిరస్కరణను సైతం ఎదుర్కొంటున్నారు.
స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కుట్రపూరిత వైఖరితో కుల ఆధారిత జన గణనను నిర్వహించాలనే డిమాండ్ను తిరస్కరించాయి. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు, 2021 జనాభా లెక్కల్లో అన్ని కులాల లెక్కింపు ఉంటుందని అప్పటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటించారు. అయితే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూ టర్న్ తీసుకున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం, దేశంలో 5,000 కంటే ఎక్కువ ఓబీసీ కులాలున్నాయి. కానీ వాస్తవానికి, ఈ కులాలలో 2 నుంచి 5 శాతం కులాలకు మాత్రమే విద్య, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ, ప్రభుత్వ ప్రయోజనాలను కలిగి ఉన్నారు. మెజారిటీ ఓబీసీలు కడు పేదరికంలో, పూర్తి నిర్లక్ష్యంలో మగ్గుతున్నారు. చాలా వెనుకబడిన తరగతులు (ఎంబీసీ), డీనోటిఫైడ్ సంచార తెగలు (డీఎన్టీ) ఇప్పటికీ ఎలాంటి సామాజిక భద్రత లేకుండా బిచ్చగాళ్లలా జీవిస్తున్నారు. వెనుకబడిన కులాలకు చెందిన నాయకుడిని ప్రధానిగా ఎంపిక చేశా మని పదే పదే ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనగణనను నిర్వహించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నది?
కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న టీఆ ర్ఎస్ ప్రభుత్వం నుంచి బీసీల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక పాఠాలు నేర్చుకోవాలి. ఓబీసీ జనాభాను లెక్కించడానికి కుల ఆధారిత జనగణన కోసం 2021 అక్టోబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని పలుమార్లు కోరారు. ఆ తర్వాత, ఆయ న బాటలో ఇతర రాష్ర్టాల సీఎంలు, రాజకీయ నేతలు కూడా కులగణనకు పిలుపునిచ్చారు. అయితే, సామాజిక న్యాయ స్ఫూర్తిని, ప్రజాస్వా మ్య విలువలను విస్మరిస్తూ ఓబీసీ కులగణనను మోదీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
భారత అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని విధించిందని, దాన్ని అధిగమించలేమనే దురభిప్రాయం ఉన్నది. అయితే, అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను 50 శాతం కంటే ఎక్కువ పెంచడానికి, సామాజిక, ఆర్థిక అధ్యయనంతో సహా కులగణనను నిర్వహించి, సమర్థనను అందించాలని కోర్టు తీర్పు లు ఇచ్చింది. కులాలవారీగా ఓబీసీ జనాభా లెక్కలు లేనందున, ఈ అణగారిన వర్గాలకు ఉద్దేశించిన ప్రస్తుత రిజర్వేషన్లు కూడా అగ్రవర్ణాలచే తిరస్కరించబడుతున్నాయి. ఉదాహరణకు, అనేక ప్రసిద్ధ పీఎస్యూలు, కేం ద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలుకావటం లేదు. గతంలో నాల్సర్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాం గ్వేజెస్ యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎన్సీబీసీ, సుప్రీంకోర్టులో నేనే ఈ సమస్యను లేవనెత్తాను. ఓబీసీలకు రిజర్వేషన్ల తిరస్కరణ భారతదేశమంతటా చాలా తీవ్రంగా, విస్తృతంగా ఉన్నది. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి, ఓబీసీలు వారి వాటాను పొందేలా చేయడానికి మొదటి అడుగు కుల ఆధారిత జనగణన. ఓబీసీ జనాభాను లెక్కించి, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయకపోతే, వారు విద్య, ఉపాధిలో న్యాయమైన వాటాను పొం దలేరు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపలేరు.
రాజకీయాలకు అతీతంగా కులగణన చేయాలనే డిమాండ్ ఉన్నది. కులం సామాజిక గుర్తిం పు మాత్రమే కాదు, భారతదేశంలో ఆత్మగౌరవ వేదిక కూడా. భారత్లో కులం గుర్తింపు ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన సం క్షేమ కార్యక్రమాలు అమలుచేయబడుతు న్నా యి. అందువల్ల, కులగణనను తిరస్కరించడం బీసీల కెరీర్ అవకాశాలను నాశనం చేయడమే కాకుండా, తమ ఆత్మగౌరవాన్ని, గుర్తింపును, అస్తిత్వాన్ని హరించే అతిపెద్ద ద్రోహమని ఓబీసీ లు గ్రహించాలి. ఈ అవకాశాన్ని వదులుకొంటే కులగణన కోసం, సామాజిక న్యాయం కోసం మరో పదేండ్లు వేచి ఉండవలసి వస్తుంది. అం దుచేత సమగ్ర కులగణన కోసం సమష్టిగా ఉద్యమించాలి.
(వ్యాసకర్త: డాక్టర్ శ్రవణ్ దాసోజు, తెలంగాణ ఉద్యమకారులు)