నల్లగొండ జిల్లాలోని జలాల్పురం గ్రామంలో ఉన్న ఆలయ శిలాస్తంభంపై నాలుగు వైపుల చెఱకు వంశీయుడైన ఇమ్మడి విశ్వనాథుడు వేయించిన 189 పంక్తుల పెద్ద శాసనం ఉంది. చెఱకు వంశీయులు కాకతి రాజన్యుల సామంతులుగా వారికి అండదండగా నిలిచి అనేక ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలు చేసినారు.
శాసనాలలో ఈ జలాల్పురం జమ్ములూరుగా పేర్కొనబడింది. ఇక్కడ ప్రఖ్యాతమైన 5 దేవాలయాల శిఖాలు పానగల్లు సోమేశ్వరాలయ శిఖరాలకు దగ్గరగా ఉంటాయి. వీటిని Stepped Pyramid Shape అంటారు. అంటే ఒకదానిమీద ఒకటి పేర్చుకుంటూపోయి పిరమిడ్ ఆకారంలో ఎటువంటి అలంకరణలు లేకుండా సాదాగా ఉంటాయి.
జమ్ములూరు పురవరాధీశ్వరులైన చెఱకు వంశీయులలో కేతయ నాయకుడు ప్రసిద్ధుడు. అతని పట్టమహిషి కామసాని. ఈ దంపతులకు కాటయ, మార, ఎఱ్ఱ అనే పుత్రులు జన్మించినారు. కేతయ నాయకుని మరొక భార్య కుప్పాంబ. వీరిరువురికి కాట, మార, బొల్ల అనే పుత్రులు కలిగినారు. ఈ చెఱకు బొల్లయ రెడ్డి కుమారుడే ప్రస్తుత శాసనకర్త ఇమ్మడి విశ్వనాథుడు. చెఱకు బొల్లయరెడ్డి కాకతీయ రాజన్యుల వలన కొన్ని ప్రాంతాలను పొంది, పరిపాలిస్తూ చెరువులు, సత్రాలు అనేకం నిర్మించినాడు.
జలాల్పురం శాసనం వేయించిన ఇమ్మడి విశ్వనాథుడు గణపతిదేవుని సామంతుడు. ఇతడు రేపూండి గ్రామంలో బొల్లేశ్వర, మల్లేశ్వర, గణపేశ్వర దేవాలయాలను నిర్మించాడు. ఈ ఆలయాలు తన తండ్రి బొల్లిరెడ్డి, తల్లి మల్లాంబ, అన్న లేదా రాజ్యాధినేత గణపతిల పేరుమీద నిర్మించినట్లు తెలుస్తుంది.
ఆలయ నిర్మాణం తర్వాత వాటి నిర్వహణకు ఇమ్మడి విశ్వనాథుడు కొన్ని నివర్తనాల భూమిని సమర్పించి శాసనం వేయించినాడు. శాసన కాలం శ.సం. 1175 = క్రీ.శ. 1253 (ప్రమాది వైశాఖ శుద్ధ పంచమి).
భక్తజన వత్సలుడు, భక్తి స్థిరాంగుడైన దేవుని భోగార్థం దానమివ్వబడిన భూ వివరములు చాలా స్పష్టంగా తెల్పబడినాయి. మామిడి నరువ తటాకంలో నాలుగు నివర్తనాల భూమి, గనిమెట్టకు తూర్పున, కడపరేయికి ఆగ్నేయంలో రెండు ఖండుగల భూమి, లేజింత గ్రామాన్ని విష్ణుదేవరాయలకు, సూరేపల్లి గ్రామాన్ని బ్రహ్మేశుడనే బ్రాహ్మణులకు అగ్రహారంగా సమర్పించినాడు. వీరిద్దరూ అలంపుర క్షేత్ర నివాసులు. అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున దేవునికి కారపాక గ్రామానికి దక్షిణంలో ఉన్న లక్షపతి తటాకాన్ని దానమిచ్చినాడు. రాజవోలు గ్రామం, దొడ్డపల్లి తటాకం క్రింద సగం భూములను కూడా శ్రీశైలేశునికి సమర్పించినాడు. ఇంకా సూత్రధారి మల్లోజుకు మామిడి నఱువ చెరువు వెనక రెండు మర్తుర్ల భూమిని, కేతేశ్వర, బొల్లేశ్వర దేవరల గుడుల పాత్ర భోగం వారికి కూడా సమర్పించెను.
ఈ శాసనంలో కాకతి రాజన్యుల, చెఱకు వంశీయుల వర్ణన ఉంది. రుద్రదేవ మహారాజు, గణపతిదేవుడు, అదేవిధంగా చెఱకు బొల్లయరెడ్డి, ఇమ్మడి విశ్వనాథుల ప్రస్తావన ఉంది.