స్వాతంత్య్రం కోసం ఓవైపు జాతీయోద్యమం కొనసాగుతుంటే, మరోవైపు ప్రజలను చైతన్య పరచటానికి సాహితీరంగంలో కృషి చేసిన మహనీయులు ఎందరో. వారిలో దీపస్తంభం లాంటి వ్యక్తి మున్షీ ప్రేమ్చంద్. ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ (1880-1936) తన కలంపేరును ప్రేమ్చంద్గా పెట్టుకొని, ఆధునిక హిందీ సాహిత్యానికి మూలవిరాట్టుగా నిలిచారు. ప్రజలలో గూడుకట్టుకున్న మూఢాచారాలను, కుల, మత, లింగ వివక్షలను తుదముట్టించి, జాతీయోద్యమం వైపు తరలించటానికి తన రచనలతో గొప్ప కృషి చేశారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ముఖ్యమైన ఆటంకంగా మారిన మతపరమైన విభేదాలపై 1931లో ప్రేమ్చంద్ రాసిన వ్యాసం 90 ఏండ్ల తర్వాత కూడా ప్రామాణికతను కలిగి ఉంది. ఆ వ్యాసం పూర్తిపాఠం.
అనుమానాలు, విద్వేషాలు ఎన్నడూ కూడా ఐక్యతను, శాంతిని పెంపొందించలేవు. మురికితో నిండి ఉన్న గోడపై రంగు వేసినట్లుగా అవి వ్యర్థ యత్నాలుగానే నిలుస్తాయి. చరిత్ర పొడవునా చోటు చేసుకున్న అనేక వక్రీకరణల కారణంగా పరస్పరం ద్వేషించుకొనే విధంగా మన మనసులు అనుమానాలు, విద్వేషాలతో నిండిపోయాయి. అదే జీవితం అనుకునే స్థాయికి మనం చేరుకోవటం మరింత విషాదం.
హిందువులు తమను అంటరానివారిగా, పరాయివారిగా చూస్తారనీ, తమ నుంచి మంచినీళ్లు కూడా తీసుకోవటానికి కూడా తిరస్కరిస్తారని ముస్లింలు విమర్శిస్తారు. మరోవైపు, తమ రాజ్యాలను, దేవాలయాలను ముస్లింలు ధ్వంసం చేసి లూటీ చేశారనీ హిందువులు కోపంగా ఉంటారు. అలాగే హిందూ స్త్రీలను బలవంతంగా పెండ్లి చేసుకోవటం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారని ఆరోపిస్తారు. ఈ విధంగా హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అంతటితోనే ఆగరు.. పరస్పరం మత దూషణకు పాల్పడుతారు. ఒకరి ఆచారాలను మరొకరు ఎద్దేవా చేస్తుంటారు.
విజేతలు పరాజితుల పట్ల చేసే అతిపెద్ద అన్యాయం ఏమిటంటే, పరాజితుల చరిత్రను విషతుల్యం చేయటం. అంతేకాదు, పరాజితుల మధ్య విషబీజాలను నాటుతారు. పరస్పరం అపనమ్మకాన్ని సృష్టిస్తారు. తద్వారా వారి భవిష్యత్తుకూ చెరుపు చేస్తారు. భారతదేశంలో ప్రస్తుతం (బ్రిటీష్ హయాంలో) జరుగుతున్నది అదే. హిందూ-ముస్లింలు ఎల్లప్పుడూ బద్ధ శత్రువులుగానే ఉన్నారని మనకు నూరిపోసి, చివరికి అదే నిజమని మనం నమ్మే పరిస్థితిని తీసుకొచ్చారు. కానీ, దానికి చరిత్రలో ఇసుమంతైనా ఆనవాళ్లు, రుజువులు లేవు.
కత్తి చేతపట్టి ఇస్లాం మతం విస్తరించి, బలపడింది అనటం చారిత్రక తప్పిదం. ఏ మతం కూడా కత్తితో అశేష ప్రజల అభిమానాన్ని, మద్దతును పొందలేదు. ఒకవేళ అలా చేసినా అది ఎంతో కాలం నిలువదు. నిజానికి హిందువుల్లోని నిమ్న కులాల పట్ల అగ్రకులాల అకృత్యాల కారణంగానే, నిమ్న కులాల వారు ఇస్లాంలో చేరటం జరిగింది. ఆ విధంగానే ఆ మతం మన దేశంలో బలోపేతమైంది. అంతకుముందు ఈ దేశంలో బౌద్ధం పుంజుకున్నది. ఆ సమయంలో హిందూమతం బలహీనపడింది. మనుషుల మధ్య ఉన్న కులాల అంతరాలను, అసమానతలను నిర్మూలించాలని బౌద్ధం కృషి చేసింది. అందరూ సమానమేనని ప్రబోధించింది. బౌద్ధం దేశమంతటా విస్తరించిన దశలో నిమ్నకులాల హిందువులు తమ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించుకున్నారు. అగ్ర, నిమ్న కులాలు అన్నీ సమానమేనని పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో బౌద్ధంపై ఆధిపత్యం సాధించేందుకు హిందూమతం కత్తినే నమ్ముకున్నది. అసంఖ్యాకమైన బౌద్ధులను సంహరించింది. అగ్రకుల హిందువులు బౌద్ధాన్ని నిర్మూలించిన తర్వాత, అంతకుముందు నిమ్నకులాలు జరిపిన విప్లవంపై ప్రతీకారం తీర్చుకున్నారు. వారిపై గతంలో కన్నా అధికంగా అణచివేత మొదలైంది. ఈ సంక్షోభ సమయంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది.
ఇస్లాం మనుష్యుల మధ్య సమానతను పాటించింది. అందరూ కలిసి నమాజ్ చేయటం, ఎలాంటి వివక్ష లేకుండా అందరూ కలిసి భోజనం చేయటం వంటి పద్ధతులను ఆచరణలో పెట్టింది. ఉన్నత కులాల హిందువులు కూడా ముస్లింలను గౌరవించారు. ముస్లింలను ఏ కులమని అడగలేదు. ఇదే సమయంలో, తమ మతంలోని నిమ్న కులాల హిందువులపై మాత్రం అదే వివక్షను, అణచివేతను కొనసాగించారు. దీంతో నిమ్నకులాల హిందువులకు ఇస్లాం ఒక ఆశాదీపంగా నిలిచింది. గ్రామాలకు గ్రామాలు ఇస్లాంను అక్కున చేర్చుకున్నాయి. దేశంలో ఎక్కడ తీవ్రమైన కులవివక్ష, అణచివేతలున్నాయో అక్కడ ఇస్లాం బలంగా వేళ్లూనుకొన్నది. కశ్మీర్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు బెంగాల్ లాంటి చోట్ల ఇస్లాం బలంగా పాదుకొన్నది. భారత్లో ఇస్లాం బలం పుంజుకోవటానికి ఆ మతంలో మనుష్యుల మధ్య సమానత్వాన్ని పాటించటమేనన్నది హిందువులు అర్థం చేసుకోవాలి.
నేటికీ హిందూ నిమ్నకులాలు ఇస్లాం పట్ల భక్తిభావాన్ని చూపుతుంటారనటానికి నిదర్శనం పీర్ల పండుగ. వారి దృష్టిలో ఇస్లాం అనేది విజేతల మతం కాదు. అందుకు భిన్నంగా అది వారికి సామాజిక గౌరవాన్ని, స్వేచ్ఛను ఇచ్చిన మతం.
ఈ విధంగానే మనదేశంలో ఇస్లాం విస్తరించింది, బలోపేతమైంది. కానీ హిందూ అగ్రకులాలు నేటికీ తమ వివక్షాపూరిత, విద్వేష ఆలోచనల నుంచి బయటపడలేదు. నిమ్నకులాలపై అదే వివక్ష, అణచివేతలను కొనసాగించారు. బావుల నుంచి మంచినీళ్లు తోడుకోనీయలేదు. ఆలయాల్లోకి రానీయలేదు. అందరితో సమానంగా చూడలేదు, తిరగనీయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుల వివక్షపై ఎలుగెత్తి పోరాడారు మహాత్మాగాంధీ. నేడు అగ్రకులాల హిందువుల్లో ఏ కొంచెమైనా ఉదారత్వం కనిపిస్తున్నదంటే అది పూర్తిగా గాంధీజీ జరిపిన కృషి కారణంగానే.
ఇక సంస్కృతి విషయానికి వస్తే… హిందు, ఇస్లాం మతాల మధ్య మౌలికమైన తేడాలేమీ లేవు. ముస్లింలు పైజామాలు ధరిస్తారు. పంజాబ్, ఇతర సరిహద్దు రాష్ర్టాల్లో హిందువులు కూడా పైజామానే ధరిస్తారు. మన దేవుళ్లు, ప్రవక్తలు వేర్వేరు. కానీ జ్ఞానం, వివేకం, త్యాగం, వీరత్వం కోసం మనం మన దేవుళ్లను ప్రార్థించినట్లుగానే ముస్లింలు కూడా తమ దేవుళ్లను అందుకోసమే ప్రార్థిస్తారు. హిందువులు రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువులను పూజిస్తే; ముస్లింలు మహమ్మద్ ప్రవక్తను, హస్సేన్ను పూజిస్తారు. హిందువులు ఆలయానికి వెళ్తే ముస్లింలు మసీదుకు, క్రిష్టియన్లు చర్చికి వెళ్తారు. జైనులు, ఆర్యసామాజికులు హిందూ ఆలయాలను సందర్శించరు. మరి, వారిని ఇతరులుగా పరిగణిస్తామా? సిక్కులు కూడా గురుద్వారాకు పోతారు కానీ హిందూ ఆలయాలకు రారు. కానీ, వారితో మనం కొట్లాటలు పెట్టుకోం. హిందువులు తమ మతంలో తరతరాలుగా కొనసాగుతున్న కులవివక్షను, తారతమ్యాలను పట్టించుకోకుండా ఉంటున్నప్పుడు.. ముస్లింలు మసీదులో నమాజ్ చేయటాన్ని ఏ విధంగా తప్పుపడతారు?
ముస్లింల పట్ల శత్రుత్వానికి హిందువులు ఏం కారణం చెప్తారు? గోవులను చంపటాన్ని కారణంగా చెప్తారా? హిందువులు ధరించే జంధ్యాన్ని ముస్లింలు ధరించకపోవటాన్ని తప్పు పడతారా? ముస్లింలు తలపై ధరించే టోపీని తప్పు పడతారా? జంధ్యాన్నే తీసుకుంటే, 80 శాతం మంది హిందువులు దానిని ధరించరు. గోవధనే తీసుకుంటే.. అరబ్ దేశాల్లో ఆవులే ఉండవు. అక్కడ ఒంటెలు, గుర్రాలుంటాయి. మనది వ్యవసాయిక సమాజం కాబట్టి ఆవును మనం పూజిస్తాం. అయినప్పటికీ, విదేశాల్లో విద్యను అభ్యసించిన హిందువుల్లో కొందరు మాత్రమే గోమాంసం తీసుకోకుండా ఉండటం ఒక వాస్తవం. చారిత్రకంగా హిందువులు ఆవును పూజిస్తారు. అలాగని, ఇతరులూ ఆవును పూజించాలని బలవంతం చేయలేం. వారికి ఆ మేరకు విజ్ఞప్తి మాత్రమే చేయగలం. పైగా, ముస్లింలలోని పేదలు మాత్రమే గోమాంసాన్ని తింటారు. వారిలో అత్యధికులు హిందూ అగ్రకులాల దుర్మార్గాల కారణంగా ఇస్లాంను స్వీకరించిన హిందూ నిమ్న కులాల వారే. ముస్లింలలోని చాలా మంది గోమాంసాన్ని తినరు.
ఇక హిందీ, ఉర్దూ మధ్య ఉన్న జగడం విషయానికి వస్తే.. అది విద్యావంతులైన ఉన్నతవర్గానికి మాత్రమే పరిమితమైన అంశం. నిజానికి, పలు రాష్ర్టాల్లో నివసిస్తున్న ముస్లింలు స్థానిక భాషలే మాట్లాడుతుంటారు. కాబట్టి, ముస్లింలను ఉర్దూ భక్తులని అనటానికి లేదు. క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ రెండు మతాల మధ్య ఇంత శత్రుత్వం ఎందుకు ఉన్నదంటే చెప్పటం కష్టం. కానీ పూడ్చలేని అగాధం ఉన్నదన్నది మాత్రం వాస్తవం. అహేతుకమైన ఈ విద్వేషం నుంచి బయటపడిన వారు అతికొద్దిమంది మాత్రమే. దురదృష్టవశాత్తు కొందరు జాతీయ నేత లు కూడా ఈ వైరస్ నుంచి తప్పించుకోలేక పోయా రు. కాబట్టే, నేడు హిందూ ముస్లిం ఐక్యత అసాధ్యంగా పరిణమించింది. నిజం చెప్పుకోవాలంటే, హిందూమతంలోని నిమ్నకులాలకు ఇస్లాం మతం ఎనలేని మేలు చేసింది. కుల వివక్ష, అణచివేతలనే సంకెళ్ల బారి నుంచి వారిని కాపాడింది. 1857 సిపాయిల తిరుగుబాటులో హిందు-ముస్లింలు కలిసి కట్టుగా బ్రిటిష్వారికి వ్యతిరేకంగా పోరాడారు.
హిందూ, ముస్లిం రాజుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. కానీ, అవి మతం ప్రాతిపదికన జరుగలేదు. ఎవరికి వారు తమ రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేశారు. ఆ క్రమంలోనే ముస్లిం సైనికులు తమ హిందూ రాజుల కోసం యుద్ధం చేస్తే, హిందూ సైనికులు తమ ముస్లిం రాజుల కోసం పోరాడిన ఘట్టాలు అనేకం.
‘మధ్యయుగాల భారతదేశంలో హిందూ-ముస్లింల సంబంధాలు’ అనే పుస్తకంలో ప్రొఫెసర్ మహమ్మద్ హబీబ్ ఇలా చెప్పారు. ‘మధ్యయుగాల నాటి రాజకీయాలు, చరిత్ర, సాహిత్యం, కాల్పనిక సాహిత్యం వేటిని చూసినా హిందూ-ముస్లింల మధ్య శత్రుత్వం అనేది ఇసుమంత కూడా కనిపించదు. అంటే హిందువులు బలహీనంగా ఉన్నారని కాదు. వారు సంఘటితంగా, శక్తిమంతంగా, పోరాటాలకు సిద్ధంగా ఉన్నవాళ్లే. కానీ, ఆ కాలంలో కనీసం ఒక్కటంటే ఒక్క మతపరమైన యుద్ధం చోటుచేసుకోలేదని అన్ని ఆధారాలూ నిరూపిస్తున్నాయి. పైగా, ముస్లింలు మరాఠాల తరఫున పానిపట్ యుద్ధంలో పోరాడితే, అఫ్ఘాన్లు మరో హిందూపాలకుని తరఫున పోరాడినట్లుగా ఆధారాలున్నాయి’ అని పేర్కొన్నారు.
మొత్తంగా చెప్పుకోవాలంటే.. హిందూ-ముస్లింల మధ్య శత్రుత్వానికి వాస్తవమైన కారణం ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. కాబట్టి, మనం తక్షణం చేయాల్సింది ఏమిటంటే.. మన మనసుల్లో ముద్రితమైన వక్రీకరింపబడిన చరిత్రను తుడిచి వేసుకోవాలి. ఆ క్రమంలో, ఎవరినైతే మనం ఇంతకాలంగా శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లు నిజానికి వెనుకబడిన వర్గాలకు విముక్తి ప్రదాతలుగా నిలిచిన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. మన కులవ్యవస్థలో ఘనీభవించిన బంధనాలను వాళ్లు వదులు చేశారని, తద్వారా మన నాగరికతను అభివృద్ధి చేయటంలో సహకరించారని మనం తెలుసుకోగలుగుతాం.
-మున్షీ ప్రేమ్చంద్