పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే అర్ధాంతరంగా ముగిశాయి. ఇది ఆకస్మికంగా జరిగింది కాదు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్కన్నా పార్లమెంటు సమావేశాల్ని ముందే ముగించటం మోదీ హయాంలో ఒక సంప్రదాయంగా మారిపోయింది. ప్రస్తుత సమావేశాలతో కలిపి ఇప్పటికి వరుసగా ఏడుసార్లు పార్లమెంటును ముందే ముగించారు. పైగా అధికారపక్షం తమ తప్పు లేకుండా నెపాన్ని విపక్షాలపై నెట్టే ప్రయత్నం చేయటం విచిత్రం. మిగిలిన నాలుగురోజుల్లో రెండు రోజులు పండుగ సెలవులే కాబట్టి, వివిధ పార్టీల ఎంపీలు ఇండ్లకు వెళ్తామని అడిగారని, దానికి సానుకూలంగా స్పందించామంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. ఈసారి ఇలాగైతే, మరి ఇంతకుముందు ఆరుసార్లు జరిగిన కుదింపుల మాటేమిటి?
ప్రజల జీవనాన్ని దుర్భరం చేస్తున్న ధరల పెరుగుదలపై తక్షణం చర్చిద్దామని.. జూలై 8న వర్షాకాల సమావేశాలు మొదలుకాగానే ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దానికి అధికారపక్షం అంగీకరించకపోవటంతో సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. రెండు వారాలు ఇదే పరిస్థితి. ఏకంగా 27 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వారు పార్లమెంటు ఆవరణలో గాంధీజీ విగ్రహం దగ్గర 50 గంటల నిరవధిక నిరసన తెలిపారు. ఆఖరికి ధరల పెరుగుదలపై చర్చ జరిగినా ఎటువంటి ఫలితం లేదు. యథావిధిగా ఆర్థికమంత్రి దేశ ఆర్థికవ్యవస్థ భేషుగ్గా ఉందంటూ స్వోత్కర్షకు దిగారు. వివాదాస్పద విద్యుత్ సంస్కరణల బిల్లును సమావేశాల చివరిరోజు లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒకే దేశం-ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే మతం వంటి సంకుచిత ధోరణులు పెరిగిపోయాయి. భిన్నత్వాన్ని సహించలేని పరిస్థితులు తలెత్తాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను బలహీనపరచాలని మోదీ ప్రభుత్వం యత్నిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సమస్యలపై చర్చలు జరుపాల్సిన పార్లమెంటులో వారాల తరబడి ప్రతిష్టంభన వల్ల అమూల్యమైన సమయం వృథా అవుతున్నది. నిజానికి, ఈ రకంగా సుదీర్ఘంగా పార్లమెంటును స్తంభింపజేయటం అనే దుస్సంప్రదాయాన్ని యూపీఏ హయాంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీనే ప్రారంభించింది. ఇప్పుడు అధికారపక్షంగానూ అది కొనసాగే పరిస్థితులను సృష్టిస్తున్నది. అధికార పక్షానికి మెజారిటీ ఉన్నంత మాత్రాన ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకోవడం తగదు. ప్రధాని మోదీ పార్లమెంటు చర్చలలో పాల్గొనడానికి విముఖంగా ఉంటారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించరు. ఇక ప్రతిపక్షాలు, చర్చలు ఎందుకు? బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి కట్టుగా ఎదుర్కొని మోదీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అడ్డుకోవాలి.