దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచాయి. అమృతోత్సవాలంటూ కేంద్రప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ, ఈ 75 ఏండ్లలో సాధించిన ఫలితాలున్నట్లుగానే, సాధించవలసిన విషయాలూ ఉన్నాయి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగసభ రచనాసంఘం చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. ‘ఒక మనిషికి ఒక ఓటు, ఒకే ఓటు విలువ వల్ల మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ, సమాజంలో, సామాజిక ఆర్థికరంగాల్లో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అసమానతలను పరిష్కరించకపోతే రాజకీయ సమానత్వం నిలబడదు. ఈ వైరుధ్యాలను తొలగించకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.’ అని హెచ్చరించారు. కానీ ఆయన హెచ్చరికను ఎవరూ పట్టించుకోలేదు. అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి.
అంతేకాకుండా దేశ స్వాతంత్య్రానంతరం తర్వాత దళితులకు అందిన ఫలాలు తక్కువ. రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు వంటి పథకాలన్ని కూడా బ్రిటిష్ కాలంలోనే అమల్లోకి వచ్చాయి. 1935 చట్టం ద్వారా అంబేద్కర్ సాగించిన కృషి ఫలితంగా ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రిజర్వేషన్లు వచ్చాయి. 1946 నుంచే ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ల పథకం మొదలైంది.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ అప్పుడే మొదలయ్యాయి. అయితే స్వాతంత్య్రానంతరం అత్యాచారాలకు సంబంధించిన చట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ స్థాపన మాత్రమే జరిగాయి. దేశం ఈ 75 ఏండ్లలో దళితులకు అందాల్సిన ఫలాలను అందించలేకపోయింది. 1974 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎలాంటి విధానాలను రూపొందించలేదు. 19 70 దశకం తొలిభాగంలో దళితుల పోరాటాలు, తిరుగుబాటుతో రాజకీయ అవసరాల కారణంగా అప్పటి ప్రభుత్వం 1974లో ‘ట్రైబల్ సబ్ప్లాన్’ పేరుతో జనాభా ఆధారంగా నిధులు కేటాయించడం ప్రారంభించింది. 1980 నుంచి ఎస్సీల కోసం స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఇది మొదలై 40 ఏండ్లు గడిచినా అమలు జరపడంలో ప్రభుత్వాలు చూపెట్టిన నిర్లక్ష్యం వల్ల దళితుల జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. 2017లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్లాన్, నాన్ప్లాన్ పద్దులను తొలగించడం వల్ల సబ్ప్లాన్ చట్టానికి, ఆ విధానానికి అర్థం లేకుండాపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్ప్లాన్ చట్టం స్థానంలో ‘ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్’ను తీసుకువచ్చింది.
మోదీ హయాంలో ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీల ఉనికి ఉన్నట్టే భావించడం లేదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. దానితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశమే వారి అజెండాలో కానీ మ్యానిఫెస్టోలో కానీ లేకుండాపోయింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయిస్తున్న అరకొర నిధులు కూడా ఖర్చుకాకుండా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు 2014-15లో కేంద్ర బడ్జెట్ రూ.17,63,214 కోట్లు కాగా వారికి కేటాయించింది 50,548 కోట్లు. వాస్తవానికి వారికి రావాల్సింది 81,460 కోట్లు. వారికి కేటాయించిన నిధుల శాతం 2.4గా తేల్చారు. దానికి కొనసాగింపుగానే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో 3 శాతానికి మించకుండా నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ కేటాయింపులలో కూడా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల అవసరాలకు పెద్దగా ఉపయోగపడని శాఖలకే అధికంగా కేటాయిస్తున్నారు.
ఎస్సీ విద్యార్థులు అధికంగా ఆధారపడే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చాలా ఘోరంగా కోతకు గురయ్యాయి. 2017-18 బడ్జెట్లో రూ.3,414 కోట్లు కేటాయిస్తే, 2019-20 సంవత్సరానికి అది రూ.292 కోట్లకు చేరింది. 2021-22 బడ్జెట్లో రూ.3,415 కోట్లు కేటాయించినప్పటికీ నాలుగేండ్లుగా ఒకేరకమైన కేటాయింపులు చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా 2020-21లో రూ.700 కోట్లు, 2021-22లో రూ.725 కోట్లు ఉండగా అది 2022-23 బడ్జెట్లో 500 కోట్లకు తగ్గిపోయింది. ఎస్సీల కోసం కేటాయించే నేషనల్ ఫెలోషిప్ కేటాయింపులు కూడా 2021-22లో 300 కోట్ల నుంచి 2022-23లో 173 కోట్లకు తగ్గిపోయింది. మాన్యువల్ స్కావెంజింగ్ లాంటి అత్యంత అమానవీయమైన పనిలో శతాబ్దాల తరబడి మునిగితేలుతున్న దళితులకు పునరావాసం కల్పించి, వారిని ఆ వృత్తి నుంచి దూరంగా తీసుకురావడానికి ప్రతి కార్మికుడికి రూ.40 వేలు ఇచ్చి ఆ పనిని మాన్పించాలని ప్రభుత్వాలే నిర్ణయించాయి. అయితే, 2019లోపు వారందరికీ పునరావాసం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.232 కోట్లు అవసరమవుతాయి. ‘సఫాయి కర్మచారి ఆందోళన్’ అంచనాను తీసుకుంటే రూ.480 కోట్లు అవసరం. కానీ దీనికి కేంద్రం రూ.30 కోట్లు కేటాయించడం చూస్తే కేంద్ర ద్వంద్వవైఖరి అర్థమమవుతుంది.
కనీసం కాగితాల వరకైనా జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపులే లేవు. ఎస్సీల సబ్ప్లాన్లో 16 శాతం కేటాయించాల్సి ఉండగా 2017-18లో 8.4 శాతం, 2018-19లో 8.8 శాతం, 2019-20లో 9.3 శాతం మాత్రమే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనైనా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాఖలాల్లేవు. అంతేకాకుండా వారి పట్ల, ముఖ్యంగా ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం శత్రు వైఖరినే అవలంబిస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల బలిదానం నుంచి మొదలుకొని, ఆవు మాంసం తిన్నారనే పేరుతోనో మరో కారణంతోనో దళితుల మీద జరిగిన హత్యాకాండను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తుండటం తెలియనిది కాదు. రిజర్వేషన్ల వల్ల తమ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదనే కోపం కూడా కొన్ని వర్గాల్లో ఉంది. దీన్ని ఉపయోగించుకొని బీసీలతో సహా హిందూ సమాజంలోని కులాలన్నింటినీ ఏకం చేయడం కోసమే ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అందువల్లనే బీజేపీ ప్రభుత్వ బడ్జెట్ ఉపన్యాసాల్లో కనీసం ఎస్సీ, ఎస్టీ కార్యక్రమాల ప్రస్తావన లేకుండాపోతున్నది. ఏటా ప్రకటించే ఎకనమిక్ సర్వే నివేదికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి పట్ల ఒక అంచనా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది కనుమరుగైంది.
1950 నుంచి 1994 వరకు ప్రత్యేకంగా దళితుల మీద జరిగిన అత్యాచారాల లెక్కలను జాతీయ నేర నమోదు సంస్థ డాక్యూమెంట్లలో పొందుపర్చలేదు. అయితే 1994 నుంచి 2020 వరకు అందుబాటులో ఉన్న లెక్కలను పరిశీలిస్తేనే హృదయం ఉన్న ప్రతి మనిషి చలించక తప్పదు. కేవలం 26 ఏండ్లలో 17,835 మంది హత్యకు గురయ్యారు. 44,506 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఆధిపత్య కులాల దాడుల్లో 85,219 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏటా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గుతున్న దాఖలాలు లేవు. కుల విద్వేషం ప్రత్యేకించి అంటరాని కులాల పట్ల ఉన్న ద్వేషమే ఈ దాడులకు కారణం. 1994లో 546 మంది హత్యకు గురైతే 2004లో అది 654కి చేరింది. 2014లో 704 మంది దళితులు హత్యకు గురయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ హత్యల సంఖ్య మరింత పెరిగింది. 2018లో 798 మంది, 2019లో 923 మంది 2020లో 902 మంది కులహింసకు బలయ్యారు.
1994లో 992 మంది దళిత మహిళలపై కులోన్మాద అత్యాచారాలు జరిగితే 2004 వచ్చేసరికి ఆ సంఖ్య 1,157కి చేరింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య తారా స్థాయికి చేరింది. 2015లో 2,326, 2016లో 2,541, 2017లో 2,714, 2018లో 2,936, 2019లో 3,514, 2020లో 3,396 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి.
మొత్తం ఈ 26 ఏండ్లలో 9,25,268 కేసులు నమోదయ్యాయి. 1994లో 33,908 కేసులు నమోదవ్వగా, 2020లో 52,749 కేసులు రిజిష్టరయ్యాయి. కానీ, శిక్షలు పడింది మాత్రం అత్యల్పం. 2017-18 హోం మంత్రిత్వ శాఖా నివేదిక ప్రకారం కేవలం 16.3 శాతం కేసుల్లో శిక్షలు పడినట్టు నమోదైంది. చాలా కేసుల్లో కిందిస్థాయి న్యాయస్థానాలు విధించిన శిక్షలను హైకోర్టులు , సుప్రీంకోర్టు కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా వదిలిపెడుతున్నాయి. ఇక్కడ కుల పక్షపాతమే ప్రధానంగా కనిపిస్తుంది.
దళితులు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్న కేంద్రానికి ఎందుకు మనసు చలించడం లేదో అర్థం కాదు. అంటరాని కులాలకు తమ సామజికవర్గాన్ని ఏ పేరుతో పిలవాలో నిర్ణయించుకునే హక్కు లేదు. ‘దళిత’ అనే పదాన్ని సైతం వాడరాదంటూ నిషేధం విధించారు. ఈ గడ్డ మీద పుట్టి, ఈ మట్టిలో పెరిగిన అదే సామజిక వర్గాలకు కానీ, లేదా ఇతర మతస్థులకు కానీ తమకు నచ్చిన ఆహారం తీసుకునే కనీస హక్కు లేదు.
దళితులకు ఈ దేశ సహజ వనరులలో ప్రధానమైన భూమి మీద హక్కులు లేకుండా పోయాయి. భూమి లేని దళితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇన్ని సమస్యల నుంచి దళితులు బయటపడకుండా, దళితులపై అత్యాచారాలు తగ్గకుండా, పేదరికం నిర్మూలన కాకుండా అమృతోత్సవాలుగా పిలవడానికి ఈ ఉత్సవాలు అర్హత సాధించవు. రోజురోజుకు దేశంలో పెరిగిపోతున్న పేదరికం, అత్యాచారాలు, అవమానాలు దేశ స్వాతంత్య్ర ఉత్సవాలను వెక్కిరిస్తాయి. నూటికి 30 శాతం ఉన్న దళితులు, ఆదివాసులు ఈ దేశ ప్రజాస్వామ్యంలో, దేశ సంపదలో భాగం పంచుకోకుండా అమృతోత్సవాలు వెలుగులు పంచలేవు. అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో భారత్ తలెత్తుకొని నిలబడలేదు.
(వ్యాసకర్త: మల్లేపల్లి లక్ష్మయ్య చైర్పర్సన్,సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)