‘ఏ కులము నీదంటే గోకులమూ నవ్వింది.. మాధవుడు, యాదవుడూ మా కులమే లెమ్మంది’ అనే ఒక పాత పాట.. మధ్యయుగంలో పాలకవర్గాల కులవ్యవస్థలో జరుగుతున్న మార్పులకు సరిపోతుంది. కాకతీయుల కులం గురించి కూడా శాసనాధారాలు ఇట్లాంటి సమాధానమే ఇస్తాయి. ఆ మాటకొస్తే కేవలం కాకతీయులే కాదు, ఆ కాలంలో రాజవంశాలుగా మారుతున్న ఎన్నో చతుర్థ వర్ణానికి చెందిన కుటుంబాలకూ ఇది వర్తిస్తుంది.
కాకతీయుల కులం గురించి ప్రతాపరుద్రీయంలో ‘విద్యానాథుడు’ వీరి వంశం సూర్య, చంద్రవంశాల కంటే గొప్పదని క్షత్రియుల కంటే గొప్ప వాళ్లని చెప్తాడు. చతుర్థ కులం (శూద్ర కులం) సూర్యవంశం కంటే ఎలా గొప్పదైతది అంటే కులం రీత్యా శూద్రులైనా, రాజులైనారు కాబట్టి అనే సమాధానం వస్తది. ఇలా ఎన్నో ఉదాహరణలు చరిత్రలో దొరుకుతాయి. వరంగల్ జిల్లా మాటేడు శాసనం క్రీ.శ.1120 కళ్యాణి చాళుక్యరాజు త్రిభువన మల్లదేవ (ఆరవ విక్రమాదిత్య) కాలంలో, అనుమకొండపుర మహామండలేశ్వరుడైన ప్రోలరాజు బంటు (సైనికుడు) వెలంబోల మల్లెనాయక (మల్లినాయక) ఈశ్వర, నారాయణ, ఆదిత్యులకు గుడి కట్టించి వేయించిన శాసనం. ఇది నాటి కుల వ్యవస్థను అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ‘వాణీ ప్రియ (బ్రహ్మ) నాలుగు వర్ణాలను సృష్టించి ఈ వర్ణాలను కాపాడటానికి పులింద వంశాన్ని పుట్టించాడు. ఆ వంశంలో పుట్టిన బూచన మూడో కొడుకైన రేవకు పుట్టినవాడే మల్లి నాయకుడు. ఈయన కాకతీయరాజు బేత భూపతి శత్రువులను ఓడించి వారినుంచి కప్పం వసూలు చేసి కాకతీయ రాజ్యాన్ని బలోపేతం చేశాడు’ అని ఉంది. బంటు అయిన మల్లినాయకుడి వంశానికి విష్ణు అంశ అనే మహత్యాన్ని చేర్చడంతో వారి సాధారణ కులం, పాలకవర్గ కులంగా ఒక మెట్టు ఎదిగింది.
కాకతీయ పదం అర్థం ఏమిటి?
దాదాపు 150 ఏండ్ల కింద మొదలైన కాకతీయ పరిశోధనలో ఇప్పటికీ పూర్తిగా తేలని కొన్ని అంశాలున్నాయి. అందులో ఒకటి కాకతీయ పదానికి అర్థం. 1935లో వచ్చిన కాకతీయ సంచికలో మారేమండ రామారావు దీని గురించి చర్చించారు. వీటిలో ప్రధానంగా మూడు వాదనలున్నాయి. మొదటిది కాకతికి అర్థం గుమ్మడి తీగ నుంచి వచ్చిందని. వీరి వంశంలో ఒక బాలుడిని శత్రువుల బారిన పడకుండా గుమ్మడి తీగ కాపాడిందనీ అందుకే కాకతి అని తమ వంశం పేరు పెట్టుకున్నారని, తల్లి కలువచేరు శాసనంలో ఉన్నదని చెప్తాడు. ఆంథ్రోపాలజికల్ (మానవ శాస్త్ర) పరిభాషలో చెప్పాలంటే కాకతీయుల తొలినాళ్ల కుదురు (Clan) చిహ్నం గుమ్మడి తీగ అయి ఉండాలి. అప్పుడే వాళ్ల ఇంటిపేరు కాకతి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మన సమాజంలో ఉన్న రావి, మర్రి వంటి ఇంటిపేర్ల లాగా. ఆ గుమ్మడి తీగ కుదురు చిహ్నం ఉన్నవాళ్ల దేవత కాకతమ్మ అయి ఉండాలి.
జైన దేవతా? ఊరి పేరా?
రాష్ట్రకూట సామంతులైన తొలి కాకతీయులు జైన మతస్థులు. ఇది నిర్వివాదాంశం. జైన శాసన దేవతల్లో ఒకరు కూష్మాండినీ. ఈమెనే శ్వేతాంబరులు అంబిక అని పిలుస్తారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం. కాకతి అన్నా గుమ్మడి తీగ అని కాబట్టి జైన దేవత అయిన కూష్మాండినీ కొలిచేవాళ్లు కాబట్టి కాకతీయులైనారనేది ఇంకో అభిప్రాయం. ఇంకో వాదమేమంటే, వీరి స్వస్థలం కాకతి అనే ఊరు కాబట్టి వీరు కాకతీయులైనారనేది. కర్ణాటకలోని బెళగావి (ముందు బెల్గామ్) దగ్గర కాకతి అనే ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడినుంచి వచ్చినవాళ్లు కాబట్టి కాకతీయులైనారన్నది ఒక వాదన. ఇప్పటికీ అక్కడ మధ్యయుగం నాటికోటల వంటి కట్టడాల ఆనవాళ్లున్నాయి. అయితే కాకతి పట్టణానికి, ఆ కట్టడాలకు మన కాకతీయులకు ఏమైనా సంబంధం ఉందా ఇంకా పరిశోధించవలసి ఉన్నది.
కాకతీయులు అనగానే తెలుగువాళ్లు అనే ప్రబలమైన భావన ఉన్న నేపథ్యంలో వీళ్ల స్వస్థలం కర్ణాటకలో ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కాకతీయ వంశంలో తొలి పాలకులు రాష్ట్రకూటుల సామంతులు కాబట్టి వారి స్వస్థలం కర్ణాటకలో ఉండే అవకాశం ఉన్నది. తర్వాతికాలంలో తెలంగాణలోని కురవి, భైంసా, చివరికి అనుమకొండ చేరుకున్న క్రమంలో పూర్తిగా తెలుగువాళ్లు అయిపోయేందుకు ఆస్కారం ఉన్నది. అయినా మధ్యయుగ దక్కన్ రాజకీయాల్లో తెలంగాణ, కర్ణాటక, మరాఠ్వాడా ప్రాంతాలు ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకున్నాయి కదా! ఏదేమైనా మన చరిత్రను రాజకీయార్థిక కోణం నుంచి రాసుకునే ప్రయత్నం ఇంకా జరగాల్సి ఉన్నదని ఇలాంటి ప్రశ్నలు మనకు గుర్తుచేస్తుంటాయి.
-డా. ఎం.ఎ. శ్రీనివాసన్ , 81069 35000