బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పద్దెనిమిదేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. 2004లో స్వర్గీయ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగాయి. నేడు తలపెట్టినట్టుగానే ఆనాడు కూడా పరేడ్గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహించారు. నాడు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం నేడు తెలంగాణ రాష్ట్రం అయింది. నాటి సమావేశాలకు సరిగ్గా మూడేండ్ల ముందే పురుడుపోసుకున్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో సంపూర్ణమైన పాత్రను పోషించింది.
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ఉద్యమ పార్టీ ప్రజల మనసును చూరగొని రాష్ట్ర ప్రజల ఇంటి పార్టీగా టీఆర్ఎస్ మారింది. అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అధికారాన్ని చేపట్టి తెలంగాణ నలుదిశలా అభివృద్ధి వీచికలను ప్రసరింపజేసింది. తెలంగాణ భావితరాలకు బంగారు బాటలను ప్రణాళీకరించడంలో చురుకైన పాత్రను పోషించింది. తెలంగాణ అస్తిత్వ భావనను పొత్తిళ్లలో శిశువును కాపాడినంత జాగ్రత్తతో పదిలం చేసుకున్నది. రాష్ర్టాభివృద్ధిని దిగంతాలకు విస్తృతపరిచింది.
అదే సమయంలో ఉమ్మడి ఏపీ నుంచి మొదలుకొని తెలంగాణలో నేటివరకు బీజేపీ ప్రస్థానం ఒక్కడుగు ముందుకువేస్తే పదడుగులు వెనకేసిన చందంగా నడిచింది. 2004లో అప్పటి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత బీజేపీ ఏకంగా కేంద్రంలోనే అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో కూడా బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్లు లాగా తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతేనేమీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనైతేనేమీ.. ఈ రెండు రాష్ర్టాల్లో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ పరిస్థితి అధఃపాతాళమే. బీజేపీకి వచ్చిన సీట్లు, ఓట్ల శాతాన్ని చూస్తే ఈ రాష్ర్టాల్లో ఉన్న ప్రజాదరణ ఏమిటో తెలిసిపోతుంది. 2014లో ‘గుజరాత్ మోడల్ నినాదం’తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకొని అబద్ధాలను ప్రచారం చేశారు. తద్వారా 2014లో కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సోషల్ మీడియా ప్రభావంతో 2019లో కూడా అధికారం గెలువగలిగింది.
ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభంజనంలో ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అన్న నినాదాన్ని మరిపించేలా మోదీ హవా కొనసాగిన రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణలో 2014లో అసెంబ్లీలో 5 సీట్లు, పార్లమెంటులో ఒక సీటు బీజేపీకి వచ్చాయి. 2018లో అసెంబ్లీలో 5 నుంచి ఆ బలం ఒకటికి తగ్గిపోగా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం వల్ల నాలుగు సీట్లు సాధించగలిగింది. ఇక స్థానిక ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 వేల పైచిలుకు పంచాయతీల్లో బీజేపీ గెలిచిన సర్పంచ్ స్థానాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సింగిల్ విండోలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితరాల విషయానికి వస్తే నామమాత్ర ప్రాతినిధ్యమే కనబడుతది. తెలంగాణ ఏర్పాటుకు మొదట్లోనే తీర్మానం చేసినా, మలిదశ ఉద్యమంలో ఉనికిని చాటుకున్నా, పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసించలేదు, వారిని అనుమానంతోనే చూశారు తప్ప ఆదరించలేదు. మొత్తంగా దేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని చూస్తే, అటు వాజపేయి ప్రాబల్యం బాగా ఉన్న రోజుల్లో, మోదీ హవా బ్రహ్మాండంగా నడిచిన సమయాల్లో కూడా తెలంగాణలో బీజేపీ ప్రభావం దాదాపు శూన్యమే అని చెప్పాలి. ఇందుకు కారణాలేమిటని విషయాలను అన్వేషిస్తే తెలంగాణ ప్రజల మనోగతం స్పష్టంగా అర్థమవుతుంది.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రజల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు, నాయకులను సమర్థించడం, వ్యతిరేకించడం లాంటి విషయాల్లో అనుసరించే విధానం వేరుగా ఉంటుంది. ప్రత్యేకించి తెలుగు రాష్ర్టాల్లో పరమత సహనం, సబ్బండ వర్ణాల సహకారం, తాత్విక జీవనం, సమాన అవకాశాల కోసం కష్టించే తత్వం ఉంటుంది. రాజకీయాలను, మత కుల జాడ్యాలను కలిపి చూసే భావన దాదాపు ఉండదనే చెప్పాలి. ప్రత్యేకించి తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ తన ఇంటి పార్టీ కాలేదని, ఉత్తరాది ప్రాబల్యంతో, సంఘ్ పరివార్ ప్రభావంతో పరాన్నజీవులుగా బతికే నాయకుల సమూహంగానే బీజేపీని చూశారే తప్పా, ప్రజల కోసం పనిచేయగలిగే నాయకుల బృందం అని అనుకోలేదు. ప్రత్యేకించి దళిత, గిరిజన వెనుకబడిన తరగతుల ప్రజలెప్పుడూ బీజేపీని విశ్వసించలేదు, విశ్వసించబోరు. దానికితోడు సుదీర్ఘకాలం సంఘపరివార్ నేపథ్యంలో బీజేపీలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యం అనే భావన ఆయావర్గాల్లో ఉన్న మాట వాస్తవం. అదే నిజంగా ఉన్నమాట కూడా. దానికి దృష్టాంతాలు కూడా అనేకం. ఉదాహరణకు జాతీయ అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసిన బంగారు లక్ష్మణ్ను పదవీచ్యుతుడిని చేసేంతవరకూ ఎలా వెంటాడి, కుమిలిపోయేలా చేశారో చూసిన తర్వాత ఆ వర్గాల్లో బీజేపీ మరింత పలుచనయిందనేది వాస్తవం. పోనీ గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చి ఇప్పుడేమైనా తీరు మార్చుకుందంటే అదీ లేదు. తీరు మార్చుకుంటే ఇది మోదీ-షా ల బీజేపీ ఎందుకు అవుతుంది. ఎస్సీల వర్గీకరణ విషయంలో దళితులకు మోసం, బీసీలకు కులగణనను నిరాకరించి బీసీలకు మోసం, ఎస్టీ రిజర్వేషన్లను పెంచడానికి నిరాకరించి ఎస్టీలకు మోసం, నిరంతర ద్వేషాగ్ని కీలలతో మైనారిటీల పట్ల దౌష్ట్యం పేరుకు ఈడబ్ల్యూఎస్ తెచ్చినా అగ్రవర్ణాలకు ఇప్పటికీ ఏమీ జరగని వైనం ప్రభుత్వ సంస్థల అమ్మకంతో, ప్రైవేటీకరణతో రిజర్వేషన్లను బలహీనపర్చటం ఇవన్నీ ఆయా వర్గాలలో బీజేపీ పట్ల వ్యతిరేక భావనను మరింత ప్రబలం చేస్తున్నది.
మరో అంశాన్ని పరిశీలిస్తే తెలంగాణ ప్రాంత ప్రజల జీవనం మొదటినుంచి పోరాటస్ఫూర్తితో, తెగువతో ముడిపడి ఉన్నదనేది చరిత్ర ఎరిగిన సత్యం. కాకతీయుల కాలం నుంచి ఒక ధర్మబద్ధమైన పరిపాలన కోసం అవసరమైనప్పుడల్లా పోరాటాన్ని ప్రదర్శించింది, నిజాం కాలంలో రజాకార్ల దౌష్ట్యాలకు ఎదురొడ్డి పోరాడింది.
సాయుధ పోరాటానంతరం స్వాతంత్ర భారత్లో నేటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకు వలస నాయకుల కబంధ హస్తాలలో నలిగిపోయిన కాలంలో కూడా ఎన్నో కష్టనష్టాలకోర్చిన తెలంగాణ గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో, కేసీఆర్ నాయకత్వంలో సాంత్వన పడింది. కుదుటపడి అభివృద్ధి దిశగా సాగుతున్నది. సంక్షేమ పాలనలో, స్వేచ్ఛా వాయువుల సేదలో, స్వయం పాలనా మధురిమలో రైతు నుంచి ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారి నుంచి కంపెనీ అధిపతుల వరకు అన్ని వర్గాల ఆకాంక్షల సాధనా సమృద్ధిలో నూతనోత్సాహంతో ప్రశాంత నిశ్చితమై సాగుతుంది.
ఈ ప్రశాంతతను, ఈ స్వేచ్ఛా మాధుర్యాన్ని, ఈ స్వయం పాలనా శక్తిని, ఈ స్వజీవన సౌందర్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదు. శ్రమైక జీవనం ప్రశాంత వాతావరణం తెలంగాణ ప్రజల జీవన విధానం. కానీ ఇవ్వాళ బీజేపీ తీరు తెలంగాణలో ప్రశాంతతను చెడగొట్టేదిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమం చేసిన ప్రజలు తమను తాము బాధించుకున్నారే తప్ప ఇతరులను కించపరిచింది లేదు, దాడులు చేసింది లేదు, ఆస్తుల నష్టానికి తెగబడింది లేదు. నిజాల ఆధారంగా, భావజాల స్ఫూర్తితో తెలంగాణ సహజ సిద్ధమైన అమాయకత్వంతో కూడిన నిష్కల్మష పోరాటాన్ని చేశారు తప్ప దౌర్జన్యాలకు తెగపడలేదు. రాష్ట్ర ఏర్పాటు పిదప మునుపటి ఏ అంశాలను గుర్తుపెట్టుకోకుండా అన్ని ప్రాంతాల వాళ్లను ఆదరిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజలది, ప్రభుత్వానిది.
ఇదంతా చూసిన బీజేపీ నేడు అధికార కాంక్షతో, రాజ్య విస్తరణాభిలాషతో, ఏం చేసైనా సరే తెలంగాణలో అధికారం తెచ్చుకోవాలని దురాశ పడుతున్నది. అందుకే దురహంకారంతో కూడిన విష ప్రయత్నాలు చేస్తున్నది. ఒకవేపు దేశంలో తగ్గుతున్న మోదీ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పెరుగుతున్న ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న అశాంతి వెరసి దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేసైనా మోదీ ప్రభ తగ్గలేదని నిరూపించాలనే ఈ దుర్నీతితో నేడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అధినాయకత్వం దన్నుతో బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా భావజాలపరంగానే విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రమే ఉండే తెలంగాణలో దాడుల సంస్కృతికి తెరదీసింది. అధికారపక్ష టీఆర్ఎస్ నాయకులపైనా, శాంతిభద్రతలు కాపాడే పోలీసులపైనా దాడులు, ఆఖరికి వరికల్లాల దగ్గరికి వెళ్లి అబద్ధపు ప్రచారానికి పూనుకుంటే తిరగబడ్డ తెలంగాణ రైతాంగంపై స్వయాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో దాడులు, మంత్రులు, అధికారపక్ష నేతల పర్యటనల్లో ఉదిక్త్రతలను రెచ్చగొట్టడం లాంటి ఆటవిక స్వామ్యానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.
ఇక విష ప్రచారానికైతే అంతేలేని పరిస్థితి నెలకొన్నది. సాక్షాత్ కేంద్రమంత్రి అమిత్ షా గతంలో బీజేపీ శ్రేణులకు బోధించినట్లు ‘అబద్ధాలు ప్రచారం చేసైనా సరే అధికారంలోకి రావాలన్న’ సూత్రాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న బీజేపీ నాయకులు అమాయక యువకులను ధర్మ పరిరక్షణ పేరుతో చేరదీసి సోషల్ మీడియా ప్రచారకులుగా తయారుచేస్తున్న వైనం అసహ్యకరం. మంచి, చెడు విచక్షణ లేకుండా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ బృందాలు చేస్తున్న ప్రచారం ప్రజలు ఏవగించుకునేలా ఉన్నా, నిందాపర్వం కొనసాగిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, అన్నిరంగాల్లో అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించి సర్టిఫికెట్లు ఇస్తున్నా రాష్ట్రంలో సోషల్ మీడియా శ్రేణులు మాత్రం విస్తృత విష ప్రచార పర్వంలో, విద్వేష భావనా ప్రచారంలో మునిగితేలుతున్నారు. దూషణలే ఆలంబనగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నది.
ఓట్ల కోసం, సీట్ల కోసం ఆఖరికి మసీదులు కూడా తవ్వుతామనీ, శవమా, శివమా అని ప్రశ్నిస్తామని అంటున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరును చూసి తెలంగాణ వ్యాకులపడుతున్నది. విశృంఖల భావాలు, విద్వేష ధోరణులు, విభజన వాదాలు అధికారాన్నిస్తాయని బీజేపీ నమ్ముతున్న తీరు జనసామాన్యాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నది. కానీ గంగా జెమునా తెహజీబ్తో, సర్వమత సమభావనలతో, గోల్కొండ నుంచి బోనం, గ్రామ చావిడి నుంచి పీర్లు, దర్గాలలో పుట్టు వెంట్రుకలు, గణేష్ శోభాయాత్రలు పరస్పర సోదరభావంతో విలసిల్లే తెలంగాణలో ఈ విద్వేష భావనలకు చోటులేదని చరిత్ర తెలియని ఈ మూర్ఖులకు అర్థం కావాలి. బీజేపీ నాయకులు ఇంత హడావుడి చేస్తున్నా, సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానాన్ని పదేపదే అవమానిస్తున్నా, కేంద్ర నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కుంటుపరచేలా ప్రవర్తిస్తున్నా, టీఆర్ఎస్ నాయకత్వం, శ్రేణులు ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి. విద్వేష ప్రచారంలో బీజేపీ అత్యంత అధమ స్థాయిని ప్రదర్శిస్తున్నది. ఆఖరికి బీజేపీ కార్యాలయంలో స్క్రీన్లు ఏర్పాటుచేసి మరి ముఖ్యమంత్రిని ఇష్టారీతిన కించపరుస్తున్నది. ఈ తీరు సంప్రదాయ బీజేపీ నాయకులకే మింగుడుపడటం లేదు.
ఇంత జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మా రాష్ర్టానికి ఈ ఎనిమిదేండ్లలో ఏమిచ్చారని? మా రాష్ర్టానికి ఏమిస్తారని? ఎందుకీ వివక్ష? ఈ ప్రశ్నలకు బీజేపీ నుంచి సూటిగా సమాధానం రావడం లేదు. అంతా దాటవేత ధోరణి, డొంకతిరుగుడు సమాధానాలు, నిస్సిగ్గుగా అబద్ధాల ప్రకటనలు, మత విద్వేష ప్రకటనలు.
బీజేపీ నాయకత్వం అర్థం చేసుకోవాల్సిందే ఒక్కటి. దార్శనికుడు, అభివృద్ధి కాముకుడు, సర్వధర్మ సమభావనను మనసా వాచా కర్మణా నమ్మే కేసీఆర్ ముందు బీజేపీ పాచికలు పారవు. విద్వేష ధోరణులు చెల్లవు. విభజన ప్రయత్నాలు నడవవు. ఇది మీ ప్రయోగశాల కాదు. ఇది తెలంగాణ గడ్డ. సంకుచిత ప్రయత్నాలు కొనసాగిస్తే తగిన బుద్ధి చెప్పే సత్తా ఉన్న కేసీఆర్ అడ్డా ఇది. విష ప్రచారకర్తల్లారా ఖబడ్దార్. తస్మా త్ జాగ్రత్త. తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు చేసుకోండి.. మీటింగులు పెట్టుకోండి.. తెలంగాణ ఆతిథ్యంలో ఓలలాడండి.. కానీ విద్వే ష భావనలు రెచ్చగొడితే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు. ఇది తెలంగాణ హెచ్చరిక.
(వ్యాసకర్త: రావుల శ్రీధర్రెడ్డి , 99855 75757, చైర్మన్, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ)