‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురి కారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మతతత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు’ – దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ
నెహ్రూ స్వాతంత్ర సమరయోధుడు, ప్రపంచజ్ఞాని, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు గల రాజనీతిజ్ఞుడు. అటువంటి వ్యక్తిని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు అప్రతిష్ఠ పాలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్య్రానం తరం అనేక సమస్యలను కలిసి ఎదుర్కొని దేశ నిర్మాణానికి పునాది వేసిన నెహ్రూ, పటేల్ మధ్య లేని శత్రుత్వాన్ని ఉన్నట్లు చూపించటానికి దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ అవాస్తవాలు. వారిద్దరూ కలిసి పని చేశారు. స్వాతంత్య్రానికి ముందే దేశ పునర్నిర్మాణంపై నెహ్రూకు ఒక అవగాహన ఉండేది.
1938లో కాంగ్రెస్ అధ్యక్షులైన సుభాష్ చంద్రబోస్ స్వతం త్ర భారత అభివృద్ధి సోషలిస్టు పంథాలో ఉండాలన్నారు. నెహ్రూ అధ్యక్షతన ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘం స్వాతంత్య్ర భారతానికి దిశానిర్దేశం చేసే లక్ష్యాలను రూపొందించింది. అవి.. ‘జాతీయ కనీస జీవనస్థాయిని నిర్ణయించి ఆ మేరకు ప్రజలకు హామీ ఇవ్వాలి. జాతీయాదాయం, జాతిసంపదను పదేండ్లలో 2 నుంచి 3 రెట్లు పెంచాలి. ప్రతి వ్యక్తికి రోజుకు 2,400-2,800 కిలో క్యాలరీల ఆహారం, ఏడాదికి 30 గజాల బట్ట, 100 చదరపు అడుగుల ఇంటిస్థలం ప్రభుత్వం ఇవ్వాలి. ఆహార, ముడిపదార్థాల స్వయంసమృద్ధి, గ్రామీణ మార్కెట్ల విస్తరణ, పరిశ్రమలకు ముడిసరుకు, శ్రామికుల సరఫరా, వ్యవసాయాభివృద్ధి జరుగాలి. నిరక్షరాస్యత నిర్మూలన, అంటువ్యాధుల అంతం, ఆరోగ్యం పెంపుదలకు కృషిచేయాలి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఆర్థిక అభివృద్ధి ఉపయోగపడేవిధంగా హేతుబద్ధ జనాభా విధానాన్ని రూపొందించాలి. కార్మికులకు మెరుగైన, పరిశుభ్ర పని పరిస్థితులను కల్పించాలి. నిరుద్యోగ బీమా, కనీస వేతనాలను చట్టబద్ధంగా కల్పించాలి. ప్రాంతీయ అసమానతలను తొలగించాలి. ఈ లక్ష్యాలతో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడుల కేంద్రాలను నిర్ణయించాలి. అభివృద్ధి ఫలాలను న్యాయంగా నిష్పక్షపాతంగా పంచాలి. పీడిత వర్గాలకు ఉద్యోగాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’.
ఆంగ్లేయ పాలనలో దేశం సామ్రాజ్యవాద దోపిడీకి గురైంది. దేశ పునర్నిర్మాణానికి నెహ్రూ 1946, 1947ల్లో జాతీయ ప్రభుత్వాలను ఏర్పర్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు అంబేద్కర్, జస్టిస్ పార్టీ నేత షణ్ముగం చెట్టి, శ్వేతజాతి పాలనను సమర్థించిన హిందూ మహాసభ ప్రముఖుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ, అకాలీదళ్ బల్దేవ్సింగ్, అధికారి గోపాలస్వామి అయ్యంగార్ వీరిలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ విమర్శకులే. వైస్రాయ్ల సేవలో తరించిన బీఎన్రావు, వీపీ మీనన్, సుకుమార్ సేన్, తర్లోక్ సింఘ్లనూ దేశ నిర్మాణంలో కలుపుకొన్నారు.
ఈ అనుభవంతో ప్రధానిగా తన అధ్యక్షతన 1950 మార్చి 15న నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏర్పర్చారు. సోవియట్ పద్ధతిలో సోషలిస్టు పంథా పంచవర్ష ప్రణాళికలను అమలుచేశారు. ప్రణాళికాసంఘం శాస్త్ర సాంకేతిక పరిశోధనాభివృద్ధికి, లఘు, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘స్వయంసమృద్ధికి మాత్రమే ఆధునిక సాంకేతికతలను దిగుమతి చేసుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధరలను, కార్మికులకు కనీస వేతనానికి హామీ ఇవ్వాలి. భూ సంస్కరణలను కఠినంగా అమలుచేయాలి. వనరుల హేతుబద్ధ వినియోగానికి సహకార వ్యవసాయాన్ని పాటించాలి. స్వతంత్ర ఆర్థికవ్యవస్థను నిర్మించుకోవాలి’ అంటూ పలు ఆశయాలు పెట్టుకున్నారు. ఈ ఆశయాల సాధనకు 1950, 60 దశకాల్లో దేశంలో అనేక పరిశోధనా పత్రాలు, గ్రంథాలు విరివిరిగా వెలువడ్డాయి. అధికారులు వద్దన్నా నెహ్రూ ప్రోద్బలంతో నాటి కేంద్రమంత్రి, కెమికల్ ఇంజినీర్, కేశవ్ దేవ్ మాలవీయ ప్రభుత్వ సంస్థ ‘చమురు, సహజ వావుయుల మండలి’ని స్థాపించారు. అనేకచోట్ల చమురు నిల్వలను శోధించారు. నేడు నెహ్రూ వారసత్వాన్ని, సోషలిస్టు వాసనను గిట్టని ప్రధాని మోదీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం శోచనీయం.
దేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలను అమలుచేశారు. భారత ప్రగతికి యువతరం తోడ్పడేలా వారికి సమర్థవంతమైన, ప్రతిభా నైపుణ్యాలతో కూడిన విద్యనందించారు. ప్రపంచస్థాయి విద్యాసంస్థలైన అఖిల భారత వైద్య సేవల సంస్థ (ఎయిమ్స్), ఐఐటీలు, ఎన్ఐటీల వంటి సాంకేతిక భారతీయ సంస్థలను, ఐఐఎంల వంటి వ్యాపార విద్య సంస్థలను స్థాపించారు. రష్యా బాటలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఉచిత, నిర్భంద ప్రాథమిక విద్యను అందించారు. గ్రామీణ ఉమ్మడి పాఠశాలలను, వయోజన విద్యా కేంద్రాలను, వృత్తి, సాంకేతిక పాఠశాలలను స్థాపించారు. పోషకాహార లోపం నుంచి పిల్లల రక్షణకు ఉచిత పాలు, భోజన సదుపాయాలు కల్పించారు. ఐక్యత, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికత్వం నెహ్రూ మూలసూత్రాలు.
నెహ్రూ ఆధునిక భారత వాస్తుశిల్పి. స్వతంత్ర భారత గందరగోళ పరిస్థితులను సరిదిద్దారు. సమర్థ విదేశీ విధానం పాటించారు. పొరుగు దేశాలతోనే కాక ప్రపంచదేశాలన్నింటితో సహకార విధానాన్ని అమలు చేశారు. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో నెహ్రూ ఒకరు. చైనాతో పంచశీలను ఆమోదించారు. వలసవాదం, జాత్యహంకారం, వివక్షలకు దూరంగా ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి బలంగా పనిచేయడానికి గట్టి మద్దతునిచ్చారు. భిలాయి, బొకారొ ఉక్కు కర్మాగారాలను రష్యా సహాయంతో స్థాపించారు. తూర్పు యూరప్ సోషలిస్టు దేశాల, పశ్చిమదేశాల సహకారంతో అనేక పరిశ్రమలను, పారిశ్రామిక పథకాలను స్థాపించారు. దామోదర్ లోయ, హీరాకుడ్, నాగార్జునసాగర్, భాక్రా-నంగల్, తుంగభద్ర, కోసి, రిహంద్, చంబల్, బియాస్ తదితర ప్రాజెక్టులను నిర్మించారు.
నేడు సంఘీయులు.. నెహ్రూ తన విదేశీ విధానంలో అనేక తప్పులు చేశారని నిందిస్తున్నారు. తమవాడు కాని పటేల్ను సొంతం చేసుకున్నారు. జీవితాంతం కాంగ్రెస్లో కలిసి పనిచేసిన ఈ రాజకీయవేత్తలను ఆజన్మ శత్రువులుగా వర్ణిస్తున్నారు. కానీ, వాస్తవాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. పటేల్ను సంప్రదించకుండా, చూడకుండా రోజు గడిచేది కాదని నెహ్రూ, నెహ్రూను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని పటేల్ ప్రకటించారు. మైనారిటీలకు, మహిళలకు సమాన హక్కులు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఇవ్వడంలో నెహ్రూ, సంస్థానాల విలీనంలో, దళితులకు రిజర్వేషన్లలో పటేల్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఇద్దరూ దేశ ప్రేమికులు. దేశ సమైక్యతా సమగ్రతలను కోరుకునేవారు. వీరిలో ఎవరిని తక్కువచేసినా భరతమాతను అవమానించినట్లే. నెహ్రూ ఆధునిక భౌతికవాది. పటేల్ సనాతన సంప్రదాయవాది. స్వతంత్ర భారతానికి ప్రగతిశీల విధానాలు అవసరమని గాంధీజీ భావన. అందువల్లనే ఆయనకు దేశ పాలనా పగ్గాలను అప్పగించారు.
‘నాస్తికుడైన నెహ్రూ వల్లనే భారతం లౌకికమైందని, పటేల్ ప్రధాని అయుంటే దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించి ఉండేవాడ’ని సంఘ్ అభిప్రాయం. నేడు నెహ్రూకు పూర్తి విరుద్ధ భావాలున్న వారు, వినాశకరమైన తాత్వికతలున్న వాళ్లు దేశాధినేతలయ్యారు. అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలనుకోవడం రాజకీయం. దేశ భవిష్యత్తుకు పాటుపడటం రాజనీతిజ్ఞత. నెహ్రూ వ్యతిరేకతతో సుపరిపాలనావకాశాలను వదులుకోడం రాజకీయ నేరం. నిన్నటి తరానికి నేటితరం నీళ్ళొదిలితే, నేటితరంపై రేపటితరం బురద జల్లుతుంది. గాంధీమార్గం, నెహ్రూ ప్రణాళికలు నేటికీ ఆచరణీయాలే.
(వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంతరెడ్డి , 94902 04545, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి)