తెలంగాణలో ఇపుడొక దిక్కుతోచని తరం తయారైంది. ఇందులోని అత్యధికులు ఒకప్పటి రకరకాల ఉద్యమకారులు, వారి సానుభూతిపరులు. స్వీయ వైఫల్యాల వల్ల కొంత, పరిస్థితులు కలిసిరాక కొంత అన్ని ఉద్యమాలు భంగపడగా ఒక శూన్యంలోకి ప్రవేశించారు. ఈ స్థితిలో వారికి ఎక్కడా ఏ మంచీ కన్పించక సినిసిజమే సర్వస్వంగా మారింది. ఏదో తపన ఉంటుంది గాని ప్రత్యామ్నాయం ఏదీ నిర్మించలేరు. రాజకీయంగా ఏమీ చేయలేనపుడు కనీసం, తెలంగాణకు ఇంత అవసరంగా మారిన సామాజిక సంస్కరణలకోసమైనా ఎందుకు ప్రయత్నించరు?
ఏవైనా మహోద్యమాలు విఫలమైనప్పుడు దిక్కుతోచని తరాలు తయారు కావటం చరిత్రలో సర్వసాధారణం. అటువంటి తరాలలో రకరకాల ధోరణులు తలెత్తుతాయి. విఫలమైన ఉద్యమాలకు తిరిగి ప్రాణం పోయగలమని కలలు కనేవారు కొందరు. అది సాధ్యం కాదని భావించి నిరాశలో కూరుకుని జీవితం గడిపేవారు కొందరు. ప్రవాహంలో కొట్టుకుపోతూ, కనపించిన ప్రతి గడ్డిపరకా తమ ఆశయాలకు కలిసిరాగలదని భ్రమపడి పట్టుకునేవారు మరికొందరు. తమ ఆశయాలతో ఏ సంబంధమూ లేని శక్తులతో సైతం ఎత్తుగడల పేరిట స్నేహం జేసి భంగపడేవారు కొందరు. పలువురికి నిరంతరం ఏదో ఒక హడావుడి. కాని, నికరంగా చేసేది శూన్యం. దీనంతటి మధ్య ప్రతిదానిపై రాళ్లు విసురుతుంటారు. తమ ఉద్యమ దీక్షకు దానినే ఒక చిహ్నంగా భావిస్తారు. అంతకు మించి పాజిటివ్గా చేయగలిగింది ఏమైనా ఉన్నదేమో వారికి అర్థమవుతున్నట్లు లేదు.
ఉద్యమాలు విఫలమైనప్పుడు ఇటువంటి తరం ఒకటి తయారు కావటం సహజమని పైన అనుకున్నాం. కానీ అదే ఏకైక స్థితి కానక్కరలేదని, శాశ్వతం కానవసరం లేదని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ స్థితికి వారు ప్రత్యామ్నాయాలను అన్వేషించవచ్చు. తమ ఎదుటగల వివిధ రాజకీయ వేదికలలో తమకు ఏకీభావం గలదిగాని, లేదా ఆచరణాత్మకంగా (Pragmatic) చూసినప్పుడు ఏదో ఒక మేరకు తెలంగాణకు మేలు చేస్తున్నది గాని తమకు ఏదీ కనిపించకపోవచ్చు. తమ ఉద్యమాలు, తాము విఫలమై ఒక దీర్ఘకాలిక శూన్యస్థితి వంటిది ఏర్పడినప్పుడు, అంతా మేమన్నట్లు జరగవలసిందేననే absolute వాదన నెరవేరేది కాదని, ఆచరణాత్మక దృష్టి (pragmatism) అవసరమనే అభిప్రాయాన్ని వారు అంగీకరించకపోవచ్చు. కాని అంతిమంగా తెలంగాణ మంచి కోసం వారు ఇప్పటివలెనే శూన్యంలో గిరికీలు కొడుతుండాలా, లేక వీలైనంతలో ఏదో ఒకటి చేయాలా? వారు తమ రాజకీయాలను పునరుద్ధరించలేకపోయినా, వెనుకటి తరహా ఉద్యమాలు చేయలేకున్నా, తమకు మౌలికంగా తమ సమా జం పట్ల ప్రేమ ఉన్నది గనుక ఆ సమాజం మేలు కోసం కొన్ని చేయవచ్చు. అవి సామాజిక ఉద్యమాలు, సంస్కరణోద్యమాల రూపం లో ఉండి ప్రజలను చైతన్యపరచవచ్చు. అందువల్ల వర్తమానంలోనే గాక భవిష్యత్తుకు సంబంధించి కలిగే మేలు తక్కువ కాదు. సమాజంలో సంస్కరణోద్యమాల పాత్రను వారు మొదటినుంచి గుర్తించి ప్రశంసిస్తూనే ఉన్నారు.
అందువల్ల వారు వర్తమాన దశలో తమ దిక్కుతోచని స్థితినుంచి, ‘సినిసిజిం’ నుంచి బయటపడాలంటే, ఉద్యమాల వైఫల్యం తర్వాత తెలంగాణ సమాజానికి తిరిగి ఉపయోగకరం కాదలచుకుంటే, ఈ సమాజం పట్ల తమ ప్రేమను రుజువు పరచుకోవాలంటే, చేయవలసింది వట్టిగా రాళ్లు విసురుతూ కూర్చోవటమో లేక తెగిన గాలిపటాల వలె గిరికీలు కొట్టటమో కాక, నికరమైన సామాజిక సంస్కరణల కోసం ఆలోచించాలి. అటువంటి ఉద్యమాలు నిర్మించాలి. అందువల్ల తెలంగాణకు ఎనలేని మేలు జరగటమే గాక తమ జీవితాలు వృథా కాకుండా ఉంటాయి.
ఆ విధంగా తెలంగాణలో చేయదగినవి అనేకం ఉన్నాయి. వారు పరస్పరం చర్చించుకొని గుర్తించగలవి తక్కువ కాదు. ఉదాహరణకు పలువిధాలుగా సాధారణ ప్రజలలో విలువల పతనాలు, ధన సంస్కృతి ప్రభావం పెరుగుదల, మానవ సంబంధాల్లో క్షీణత, వినియోగదారీ సంస్కృతి ప్రభావం మారుమూలలకు సైతం చొచ్చుకుపోవటం, నైతికతల విపరీతమైన పతనం, వీటన్నింటి మధ్య స్త్రీలు పూర్తిగా ఆటవస్తువులుగా మారటం, జీవితంలో ప్రతి ఒక్కటి వ్యాపారమయం కావటం ఇటువంటి వాటి వల్ల సమాజ క్షీణత వంటివి ఎన్నయినా కనిపిస్తాయి. ఈ ధోరణులు గతంలో అసలు లేవని కాదు. కాని ఇటీవలి కాలంలో పెచ్చు మీరిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందు విప్లవోద్యమాలు, సామాజిక ఉద్యమాల ప్రభావంతో, తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఇటువంటి ధోరణులకు ప్రజలు, యువకులు ఎక్కువ అలవాటు పడలేదు. వారి దృష్టి అటు మళ్లలేదు. కాని రాష్ట్ర ఉద్యమం ముగిసిన తర్వాత, అప్పటికే ఇతర ఉద్యమాలు కూడా ముగియటమో బలహీనపడటమో జరిగిన స్థితిలో, ఈ వక్ర ధోరణులు బాగా ముందుకు వస్తున్నాయి. ఒకప్పటి ఉద్యమకారులు శూన్యస్థితిలోకి ప్రవేశించగా, అటువంటిదే అయిన మరొక శూన్యంలోంచి ఈ ప్రమాదకర ధోరణులు విస్తరిస్తున్నాయి. ఇవి ఏ సమాజానికైనా చేయగల హాని గురించి వేరే చెప్పనక్కరలేదు.
అందువల్ల మనం అంటున్న ఈ ‘దిక్కుతోచని తరం’ వారు, సామాజిక సంస్కరణలు తమ స్థాయికి తక్కువవి అని భావించక అటువైపు దృష్టి మళ్లిస్తే తెలంగాణకు ఎంతో మేలుచేసినవారవుతారు. తక్షణమే సమా జం ముందున్న రెండు తీవ్రమైన అంశాలను గమనించండి. సంపదలు, ధన సంస్కృతి, వినియోగదారీ తత్వం పెరిగి, పట్టణీకరణలు జరుగుతూ చివరికి గ్రామాల్లో, పేద కుటుంబాల్లో సైతం మగ పిల్లలతో పాటు ఆడపిల్లలూ ముసలి తల్లిదండ్రులను ఇండ్లలోంచి వెళ్లగొట్టడం, వారి ప్రాణాలు తీయటం చేస్తున్నారు. ఆత్మహత్యలు, పరస్పర హత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. మరొకటి, తెలంగాణ సమాజం మతతత్వానికి దూరమన్నది సంప్రదాయికంగా ఉండిన బలమైన నమ్మ కం కాగా, విలువలు, చైతన్యాలు, సామాజిక సంబంధాలు బలహీనపడుతున్న స్థితి లో ఈ నమ్మకానికి ముప్పు ఏర్పడుతున్న ది. మతతత్వం ప్రమాదకరంగా వ్యాపిస్తున్నది. ఇటువంటి అంశాలే మరెన్నో ఉన్నా యి. దిక్కుతోచకుండా ఉన్నతరం వీటిని ఒక సంస్కరణల అజెండాగా ఎందుకు మార్చుకోగూడదు?
-టంకశాల అశోక్