‘భారతదేశం భాగ్యసీమరా.. పాడి పంటలకు కొదవలేదురా..బంగరు పండే భూములున్నవి.. చావు ఎరుగని
జీవనదులురా.. సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రమెట్లుందో నాయనా’… దేశ పాలకుల వైఫల్యాన్ని ఎత్తి
చూపిన ఈ చైతన్య గీతం ఎనభై, తొంభై దశకాల్లో ప్రజల నోళ్ళల్లో నానింది. అపారమైన ఖనిజ సంపద,
ఏ దేశానికి లేని మానవ వనరులు, నదీ జలాలు, సముద్ర తీరం… నిజంగా మనది బంగారు భారతం.
సకల సంపదలతో కూడిన అద్భుతమైన భారతాన్ని మన పాలకులు ఏ దిక్కున నడిపించారు? ఏడున్నర దశాబ్దాలుగా దేశ ప్రజలు ఇంకా బతుకుపోరాటంలోనే ఎందుకు తండ్లాడుతున్నారు? ఈ మౌలిక ప్రశ్నలను ఎదుర్కోకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు దేశ ప్రజలను ఏమారుస్తున్నాయి. పనికిరాని మ్యానిఫెస్టోలతో, అర్థంలేని నినాదాలతో అందలాలు ఎక్కి ఊరేగడం ఈ దేశానికి మంచి చేస్తుందా అనేదే ఇవాళ జరగాల్సిన చర్చ. ఆ దిశగా దేశంలోని ఆలోచనాపరులను ఒక్కటి చేసి, ఏకోన్ముఖంగా నడిపించే ప్రయత్నం మొదలుపెట్టారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.
ప్రపంచీకరణలో ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులకు సాగిలపడటంలో పోటీలుపడ్డ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అభివృద్ధి నమూనాను గుప్పెడు మంది పెట్టుబడిదారు ల కల్పతరువుగా తీర్చిదిద్దాయి. భారత ప్రజాస్వామ్యం నిర్దేశించుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భ్రమాజనిత అభివృద్ధి నమూనాలతో చిదిమేశాయి. లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర, సామ్యవాద దేశంగా భారత్ ఎదగాలని రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్న ఆకాంక్షలను ఈ పార్టీలు గాలికి వదిలేశాయి. ఫలితమే 75 ఏండ్లలో దేశం నిలువెల్ల గాయాలతో గోసపడుతున్నది. ఈ దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసింది గోరంత, కూల్చింది కొండంత.
1990ల తర్వాత, నాటి పాలకులు దేశాన్ని పెనం మీది కి తోస్తే, ఆధిపత్య భావజాల నరేంద్రమోదీ దేశాన్ని పొయ్యిలో పడేశారు. ఇప్పుడు ‘మూఢత్వంగా దాపురించిన మోదీత్వం’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, వ్యవస్థల వెన్ను విరిచేస్తున్నది. చివరికి రిజర్వుబ్యాంక్ ద్రవ్య విధాన స్వయంప్రతిపత్తిని తన నియంత్రణలోకి తెచ్చుకునే కుట్ర చేసింది. దేశ ఆర్థిక, ద్రవ్య విధానాలను అధ్వాన్నంగా మార్చింది. దేశ అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించాల్సిన పన్నుశాతం, ఖర్చు తదితర ఆర్థిక విధానాలను గుప్పెడు మందిని ప్రపంచ కుబేరులను చేసేందుకు ఉపయోగపడే విధంగా దిగజార్చింది. నష్టదాయకమైన జీఎస్టీ, నోట్ల రద్దు, సెస్ల వసూళ్ళు సామాన్యులను పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి. నియంతృత్వ కేంద్రం, నిస్సహాయ రాష్ర్టాలు కుట్రను అమలు చేస్తూ సమాఖ్య స్ఫూర్తిని చంపేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. వీరోచి త పోరాటాలు, ప్రాంతీయ ఆకాంక్షల ద్వారా వివిధ సామాజిక వర్గాలు సాధించుకున్న రాజ్యాంగ హక్కులను అణచివేస్తున్నారు. లౌకిక, ప్రజాస్వామ్య భావనను బలితీసుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం భావజాలాన్ని రూపుమాపుతున్నారు. వివిధ రాష్ర్టాల్లో స్థానిక ప్రజల ఆకాంక్షలు, భద్రతకు భరోసాగా నిలబడ్డ ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేయాలని, లేదా మోకరిల్లేలా చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. దానికోసం రాజ్య బలప్రయోగాన్ని ఏ బెదురూ లేకుండా అమలుచేస్తున్నారు. ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి అండగా నిలబడ్డ టీఆర్ఎస్, శివసేన, డీఎంకే, టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
ఈ దేశ సుదీర్ఘ చరిత్రలో ప్రభవించిన ఉన్నత విలువలకు మోదీ ప్రభుత్వం పాతరేస్తున్నది. అశోకుడు, అక్బర్, గౌతముడు అందించిన పరమత సహనం, సహజీవనం విలువలను; దేశ విముక్తి కోసం, సమున్నత మానవీయ విలువల కోసం త్యాగాలు చేసిన మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్సింగ్ల కలలను చిదిమేస్తున్నారు. ఈ విధంగా నకిలీ దేశభక్తి ఊరేగుతుంటే, నిలువరించి, ప్రజాప్రత్యామ్నాయ ఎజెండాను ఎత్తిపట్టడంలో రాజకీయ పక్షాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోంచే ‘దేశానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా అనివార్యం’ అని కేసీఆర్ ముందుకు వచ్చారు. రాష్ట్ర సాధకుడిగా, రైతు కేంద్రంగా పాలన నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేడొక రాజకీయ మేరునగ శిఖరం. కేసీఆర్ మొదలుపెట్టింది దారి తెలియని పోరా టం కాదు. చేరాల్సిన దరిని కనిపెట్టి, గురిచూసి వేస్తున్న అడుగుల విస్పోటనం అది. నినాదాల మోత, పాలనా వాతలతో అవస్థలమయంగా మారిన దేశానికి, దారిదీపం లాంటి ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కోట్లాది అడుగులు నేడు కేసీఆర్ వెనుక నడుస్తాయి. సోక్రటీస్కు విషమిచ్చి చంపినా, సత్యం మాత్రం సంజీవని పర్వతంలా నిలబడే ఉన్నది. మోదీ తన పాలనా క్రౌర్యంతో స్వతంత్ర వ్యవస్థలను, దర్యాప్తు సంస్థలను సాగిలపరుచుకున్నా, రేపటి సూర్యోదయాన్ని నిలువరించడం ఎవరి తరం కాదు.
ఇప్పుడు కేసీఆర్ దేశం కోసం ఓ అందమైన కలకంటున్నారు. రాబోయే కాలంలో ఈ దేశ ప్రజలు ఆవిష్కరించుకొనే సుఖశాంతుల రాష్ర్టాల సమాహార సమాఖ్య భారతం. తాగు, సాగునీటి సమస్యలు లేని సస్యశ్యామల పచ్చని భారతం. అభివృద్ధి, విద్యుత్ వెలుగులతో కాంతులీనే నవ భారతం.
(వ్యాసకర్త: డాక్టర్ ఆంజనేయ గౌడ్, 98853 52242, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు)