దర్శనం మొగులయ్య- అరుదైన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు. మన తెలంగాణ బిడ్డ. ఇటీవల పద్మశ్రీ వరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్ల కింద తన ప్రతిభను గుర్తించి సత్కరించిన తర్వాతే తాను బయటి ప్రపంచానికి తెలిసానని, ఆ తర్వాతే పద్మశ్రీ వచ్చిందని మొగులయ్యే స్వయంగా అన్నారు. బీజేపీ వారి నైచ్యం సహించలేక పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానంటున్నారు ఇప్పుడు.
నిఖత్ జరీన్- భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డ. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల కింద ఇచ్చిన రూ.50 లక్షల ప్రోత్సాహంతో ఆర్థిక సమస్యలు అధిగమించి, నేడు ప్రత్యర్థులను బాక్సింగ్లో తుత్తునియలు చేసి విశ్వవిజేతగా నిలిచింది. కేసీఆర్ సహాయం, ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని నిఖత్ కుటుంబమే చెప్పింది. ఈ వ్యాసం రాసే సమయానికి మత విద్వేష కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుంచి నిఖత్కు మనఃపూర్వక అభినందన కానీ, ప్రోత్సాహం కానీ అందలేదు.
అయినా.. మొక్కవోని దీక్షతో ఈ రాష్ట్ర పాలకుడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవాలతోపాటు క్రీడలు, కళలు, సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ సమాజానికి పరిపూర్ణత తేవడం కోసం అహరహం శ్రమిస్తున్నారు. కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతున్నా తన ప్రజల మద్దతుతో దూసుకుపోతున్నారు.
మహా భారతం సభాపర్వంలో దుర్యోధనుడిని ఉద్దేశించి నన్నయ రాసిన కందపద్యం ఇది, చూడండి ఓసారి…
అవనీరాజ్య వ్యాపార విహీనుండయి సుహృద్విరంజనుఁడైకౌరవ పాంసనుండు పాప వ్యవసాయమునందు బుద్ధివదలక నిలిపెన్.
ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా కుదిరే అన్వయం. హస్తిన నుంచి తుచ్ఛ రాజకీయాలు చేస్తూ, షడ్యంత్రాలు రచిస్తూ దేశాన్ని మతమౌఢ్యపు దారిలో నడిపే పాపకార్యంలో మునిగితేలుతున్న దుర్యోధనుడి లాంటి ప్రధాని, ఆయనచుట్టూ దుష్టత్రయం లాంటి అమిత్ షా, అంబానీ, అదానీ. ఒకవైపు కేసీఆర్ తెలంగాణ మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తూ ఉంటే, మోదీ- షా ప్రభుత్వం, దాని సైద్ధాంతిక మాతృసంస్థ.. ప్రార్థనా మందిరాల కింద ఏమున్నయోనని తవ్వితీసే పనిలో ఉన్నరు. బాలీవుడ్ హీరోల దగ్గరి నుంచి గుడుల దగ్గర తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే వరకూ ముస్లింలందరినీ టార్గెట్ చేస్తున్నది బీజేపీ మత రాజకీయం. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్ను కూడా బీజేపీ వద్దంటదా? ఆ అంతర్జాతీయ ఖ్యాతి, ఆ మెడల్ పరాయి అయిపోతుందా? మనిషిని మనిషిలా గుర్తించనిరాకరించడం ఏం సంస్కారం? వారి సాంస్కృతిక జీవనాన్ని విధ్వం సం చేసే ప్రార్థనాలయాల పెళ్లగింపు ఏం నీతి?
‘మందిర్ గిర్ తా, ఫిర్ బన్జాతా
దిల్ కా కౌన్ సంభాలే, ఓ దునియాకే రఖ్ వాలే’ అని పాడుతారు మహమ్మద్ రఫీ ‘బైజూ బావరా’ సినిమాలో. రఫీనీ, అబ్దుల్ కలాంనీ వదులుకుందామా? ఈ ఘన వారసత్వాన్ని ఆర్తిగా హత్తుకోవడం, గంగా-జమునా తెహజీబ్కు మురిసిపోవడం మన సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పు అని కదా మొన్న అన్నడు అమిత్ షా. నిజాలేమిటో తెలియని లేమితనం, లేకితనం వారిది. మన సత్యసంధతను, రుజువర్తనను తట్టుకోలేని పిరికితనం వారిది. వెలుగును చూడలేని భయం వారిది. ఆ భయవిహ్వలతలోనే వారు బతుకుతున్నరు. సమతను వారు నరుకుతూ పోతున్నరు, మనం చిగురింపజేస్తూ ఉన్నము. వారు తవ్విపోస్తున్నరు, మనం తలెత్తుకు నిలుస్తున్నం. అందుకే వారికి కడుపు మంట.
భారత సమాజమా! మీ చైతన్యశీలత ఒక్కటే వారి దుష్ట రాజకీయానికి విరుగుడు. తెలంగాణను మాత్రమే కాదు, యావత్ దేశాన్ని రక్షించుకునే అత్యవసరం మన ముందున్నది. మనమంతా ముస్లిములుగా, హిందువులుగా, క్రైస్తవులుగా, ఇంకా అనేకరకాల సాంస్కృతిక అభి ‘మతాల’ వారిగా భిన్నజీవనం సాగిస్తూ ఏకత్వ భావనతో ఉంటేనే ఆ దుష్ట చతుష్టయ మాఫియాను అడ్డుకోగలం.
‘సస్యశ్యామల దేశం/ అయినా నిత్యం క్షామం/ ఉప్పొంగే నదుల జీవజలాలు/ ఉప్పుసముద్రంపాలు’.. అంటూ మూడు దశాబ్దాల కింద రాసిన శ్రీశ్రీ మాటలు ఇప్పటికీ అంతే నిజంగా ఉండటం ఎవరి పాపం? ఎందుకు బీజేపీ పాలన వల్ల 140 కోట్ల భారతీయులు చీకట్లో మగ్గాలి? ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మనం ఎందుకు అల్లాడాలి? అనాగరికులలాగా ఒకరినొకరు ఎం దుకు చంపుకోవాలి? అన్నపూర్ణ అయిన మన దేశం ఎందుకు తన రైతుల గొంతులో ఎండ్రిన్ పోయాలి? ఎందుకు మనం సహించాలి? ఎందు కు మన జీవితాలపై ఈ ‘కేంద్రీకృత’ దాష్టీకం సాగాలి? మనకంటే ఎక్కువ జనాభా కలిగిన చైనా ఎట్లా అభివృద్ధి చెందుతున్నది? మనమెందుకు అడుక్కుతింటున్నాం?
ఈ దుస్థితి మారాలి. మారుతుంది. కేసీఆర్ నేతృత్వంలో మారితీరుతది. ఆయన ఇంతకు మునుపు అసాధ్యాలను సుసాధ్యం చేసినవాడు గనక, ఈ సారి కూడా మారితీరుతది. తెలంగాణ విముక్తి కోసం సకలజనులను జాగృతపరచిన నాయకత్వ దక్షత, అనుకున్నది సాధించే ఆత్మబలం, అందుకు తగిన కార్యశూరత, మొక్కవోని దీక్ష-కేసీఆర్లోని ఈ లక్షణాలే అసాధ్యాలను సుసా ధ్యం చేస్తాయి. ‘ఒక పార్టీనో, ఒక వ్యక్తినో గద్దె దిం పి మరొక పార్టీనో, వ్యక్తినో గద్దె ఎక్కించడం మన అజెండా కాదు. పాలకుల మార్పు కాదు, పాలనలో మార్పు కావాలి’ అంటున్నరు కేసీఆర్. ‘దశాబ్దాలుగా దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశ ప్రజలకు సామూహిక లక్ష్యం ఉండాలి. అట్లా అన్ని దేశాలు చేస్తాయి. మనమెందుకు చేయకూడదు? ఎందుకు చీకట్లో బాణంలా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతున్నాం?’అని ప్రశ్నిస్తున్నరు కేసీఆర్.
75 ఏండ్లలో మన ప్రజాస్వామ్యం పరిపక్వం చెందలేదు. Democracy is the government By the people, Of the people, For the people అన్నారు అబ్రహం లింకన్. కానీ మోదీ పాలనలో అది Buy the people (ప్రజలను కొనేసేదిగా), Off the people (ప్రజల భాగస్వామ్యం లేనిదిగా), Far the people (ప్రజలకు దూరంగా) అన్నట్టుగా మారిపోయింది. ‘ప్రజలను ఆర్గనైజ్ చేస్తం. డెమోక్రటిక్గా కొట్లాడుతం. మేమేమీ ఆగమాగమైతలేము, తెల్లారేసరికల్లా ఏదో అయిపోవాలనే స్వార్థమూ, తొందరా లేదు మాకు’- ఇది నాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ప్రకటించిన సం కల్పం, కార్యాచరణ ప్రణాళిక. ఇపుడూ అదే మాట. అయితే, కాన్వాస్ మారింది. లక్ష్యం విశాలమయింది.
హైదరాబాద్ వేదికగా కొత్త అజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారుచేసే పనిలో ఉన్న రు కేసీఆర్. ప్రత్యామ్నాయ కూటమి, ప్రత్యామ్నా య గుంపు కాదు, ప్రత్యామ్నాయ విధానం కావా లంటున్నరు. నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు రావాలి. స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ లభించే దేశాన్ని నిర్మిద్దామంటున్నరు. తాను ఎడ్యుకేట్ చేస్తూ, తాను స్వయంగా నేర్చుకుంటూ; అందరినీ ఆర్గనైజ్ చేస్తూ, తానూ అవుతూ; అందరి పోరాటాలకు మద్దతు ఇస్తూ, తానూ పోరాడుతూ బయల్దేరుతున్నరు దేశ పర్యటనకు. కలిసి నడుద్దాం ఆయనతో. భయం, అనుమానం వద్దు. దేశం సుఖశాంతులతో తలెత్తుకు నిలబడాలనుకునే భరతమాత బిడ్డలం మనకు అడ్డేమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఎదిరింపనలవి కాని ప్రభుత్వాలు గానీ, నాయకులు గానీ లేరు. తమకు అడ్డులేదనుకొని విర్రవీగిన నియంతలను రాజకీయంగా సమాధి చేసిన ఘనచరిత్ర మన దేశానికి ఉన్నది. మోదీ పార్టీకి దేశంలో లభించిన ఓట్లు 40 శాతం కంటే తక్కువే. అంటే పది మందిలో ఆరుగురు మోదీని మెచ్చలేదు. వారందరినీ ఐక్యం చేద్దాం.
ఈ రోజు వరకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆస్తి, అస్తిత్వం. ఇకనుంచి టీఆర్ఎస్ ఈ దేశ భవితవ్యం. గుండెల నిండుగా విశ్వాసంతో కదులుదాం. నియంతలకు, నియంతృత్వాలకు, మతోన్మాదానికి ఈ దేశంలో స్థానం లేదని చాటిచెబుదాం. ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో నిలబెట్టుకుందాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దాం. జై భారత్
-శ్రీశైల్రెడ్డి పంజుగుల , 90309 97371