ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో దేశద్రోహం చట్టం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఎప్పుడో బ్రిటీషు కాలంలో రూపొందించిన ఈ చట్టాన్ని ఇంకా కొనసాగించడం అవసరమా అని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అసలు ఈ చట్టం కథేంటని చాలామంది వెతుకుతున్నారు. అసలు బ్రిటీషు వాళ్లు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చాడు. ఇంతకీ రాజద్రోహ చట్టంలో ఏముంది? గతంలో హైకోర్టులు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసిన ఈ చట్టానికి గతంలో సుప్రీంకోర్టే ఎందుకు ప్రాణం పోసింది? ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
“రాజద్రోహ చట్టం అత్యంత అభ్యంతరకరమైనది.. ఈ చట్టాన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు.”
ఇవి జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు. ఇలా అన్నప్పటికీ ఆయన హయాం నుంచి ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దాకా ఈ చట్టం అమలవుతూనే ఉంది. ఈ చట్టం కింద అప్పట్లో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న తిలక్పై 1897లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా రెండుసార్లు ఆయన్ను ఆరెస్టు చేశారు. యంగ్ ఇండియా పత్రికలో రాసిన ఆర్టికల్స్కు గానూ మహాత్మా గాంధీని రాజద్రోహం కింద అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెక్షన్ 124-ఏను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పట్ల మాటలతో కానీ, చేతలతో కానీ, సంకేతాలతో కానీ, ప్రదర్శనలతో కానీ, మరేవిధంగానైనా అసంతృప్తి, విద్వేషం, శత్రుభావనలు ప్రేరేపించినా లేదా అందుకు ప్రయత్నించినా అది సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం కిందకు వస్తుంది. ఇది నాన్ బెయిలబుల్ క్రైం. దీనికి మూడేళ్ల జైలు నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలేరు. తమ పాస్పోర్టును కూడా అప్పగించాల్సి ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది.
బ్రిటీష్ ఇండియా మొదటి లా కమిషన్ చైర్మన్గా ఉన్న థామస్ మెకాలే రాజద్రోహ చట్టాన్ని రూపొందించారు. 1860ల్లో బ్రిటీష్ ప్రభుత్వం తొలుత ఈ చట్టాన్ని తీసుకురావాలని అనుకుంది. 1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం ప్రజల్లో ఉద్యమ, స్వాతంత్ర భావనలను తగ్గించేందుకు, తిరుగుబాటులను అణిచివేసేందుకు అప్పట్లో భారతీయ శిక్షాస్మృతిలో చేర్చాలని అనుకుంది. కానీ అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత 1863-1870 కాలంలో వహాబీ కార్యకలాపాలను అణిచివేసేందుకు 1870లో ఇదే చట్టానికి సవరణలు చేసి దీన్ని ప్రవేశపెట్టారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీనిపై చర్చ జరిపి ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదిస్తున్న 19(1) ఆర్టికల్కు ఇది అడ్డుతగిలేలా ఉందని దేశ ద్రోహం అనే పదాన్ని తీసేశారు. కానీ సెక్షన్ 124 ఏ ను మాత్రం అలాగే కొనసాగించారు. ఆ తర్వాత తమ ప్రభుత్వాన్ని ఎదురించిన వారిపై కాంగ్రెస్ ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సవరణలు చేసి.. రాజద్రోహాన్ని కాగ్నిజబుల్ క్రైంగా మార్చారు. దీని ప్రకారం ఈ సెక్షన్ కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసి విచారణ జరపొచ్చు.
కాంగ్రెస్ హయాంలోనే కాదు.. బీజేపీ ప్రభుత్వం కూడా చాలామందిపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టింది. జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్పై, అలాగే యూపీలో కొవిడ్ కట్టడిపై అనుసరిస్తున్న విధానాలను విమర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్పైన కూడా దేశ ద్రోహం కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అలర్లపై చేసిన కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టు వినోద్ దువాపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇలా తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై బీజేపీ ప్రభుత్వం సెక్షన్ 124ఏ కింద కేసులు పెడుతూనే ఉంది.
మన దేశంలో దేశద్రోహం చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన బ్రిటన్లో మాత్రం ఈ చట్టాన్ని ఎప్పుడో రద్దు చేశారు. 1977లోనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని బ్రిటన్ న్యాయ కమిషన్ సిఫారసు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుతగిలే ఇలాంటి చట్టం బ్రిటన్కు అవసరం లేదని అప్పటి బ్రిటన్ న్యాయ శాఖ సహాయమంత్రి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి చట్టాలు నేటి తరానికి పనికి రావన్నారు.
పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ అప్పటి ప్రధాని నెహ్రూ పనితీరును 1958లో రామ్నందన్ విమర్శించారు. దీంతో ఆయనపై దేశ ద్రోహం కింద కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. కానీ 1962లో కేదార్నాథ్ వర్సెస్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు .. 124ఏ సెక్షన్కు మళ్లీ ఊపిరిపోసింది. దేశాన్ని లూటీ చేసే పెట్టుబడిదారులు బూడిదవుతారంటూ కమ్యూనిస్టు నాయకుడైన కేదారీనాథ్ ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాజద్రోహం సెక్షన్ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శలు చేయవచ్చని.. అయితే వాటివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం దేశద్రోహం కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. బల్వంత్ సింగ్ కేసులో కూడా ఇదే తరహా తీర్పునిచ్చింది. అయితే ఇటీవల దేశద్రోహం కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.