Tea | అలసిన శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది ఛాయ్.. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఒక్క కప్పు ఛాయ్ తాగగానే రీఫ్రెష్ అయిపోతాం.. అందుకే చాలామంది ఛాయ్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. కొంతమందికి అయితే పొద్దున్నే లేచిన తర్వాత టీ తాగకపోతే ఏ పని తోచదు. అంతలా ఈ ఛాయ్ భారతీయుల జీవితంలో మమేకమైపోయింది. మరి అలాంటి ఛాయ్ తాగడం ఫస్ట్ ఎక్కడ మొదలైంది? అది భారత్కు ఎలా వచ్చింది? ఇక్కడ టీ తోటల పెంపకం ఎలా ప్రాచుర్యం పొందింది వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం…
తొలిసారిగా ఛాయ్ని చైనాలో కనుగొన్నారు. క్రీ.పూ. 2737వ సంవత్సరంలో చైనాను షెన్ నాంగ్ అనే చక్రవర్తి పాలించేవాడు. ఆయన ఒక శాస్త్రవేత్త కూడా. షెన్ నాంగ్ ఒక రోజు తోటలో చెట్ల నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలసిపోయి ఉన్న చక్రవర్తి కోసం ఒక పరిచారిక తోటలో మంచినీటిని వేడి చేస్తుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో గాలికి ఎగిరొచ్చిన ఆకులు ఆ నీటిలో పడ్డాయి. ఇది గమనించని పరిచారిక ఆ నీటిని అలాగే తీసుకెళ్లి చక్రవర్తికి ఇచ్చింది. ఆ నీటిని అలాగే తాగిన చక్రవర్తికి ఉపశమనం కలిగింది. ఉత్తేజితంగా అయిపోయారు. దీంతో ఆ ఆకులు ఏ చెట్టువో కనుక్కోమని భటులకు చెప్పాడు. అప్పట్నుంచి తేయాకుతో టీ తయారు చేయడం మొదలైంది.
చైనాలో మొదలైన ఈ టీ.. తర్వాత యూరోపియన్ దేశాలకు పాకింది. 15వ శతాబ్దం వచ్చేప్పటికి యూరోపియన్ దేశాల్లో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ద్రవ్య వినిమయ పద్ధతిలో చైనా నుంచి తేయాకును దిగుమతి చేసుకునేది. అదే సమయంలో బ్రిటన్ నుంచి వర్తకం కోసం భారత్కు వచ్చారు. ఈ క్రమంలోనే 1823లో రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి కూడా భారత్ వచ్చాడు. అసోంలోని రంగ్పూర్లో తేయాకు చెట్లు పెరుగుతుండటాన్ని గమనించాడు. సింగ్పోస్ తెగ ప్రజలు ఈ తేయాకును పండించేవారు. ఈ తేయాకు.. చైనాలో దొరికే తేయాకు ఒక్కటే రకమని బ్రూస్ నిర్ధారించాడు. కానీ అప్పటికే మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, కడుపు నొప్పి వచ్చినప్పుడు.. నీళ్లలో తేయాకును వేసి తాగేవారు. అయితే అసోంలో తేయాకు చెట్లు ఉన్నాయని తెలవడంతో 1839లో బ్రిటీష్ పరిపాలకులు అక్కడ టీ కంపెనీ ప్రారంభించారు. బ్రిటీష్ పాలకుల వద్ద పనిచేసిన మణిరామ్ దివాన్ అనే వ్యక్తి కూడా సొంతంగా తేయాకు తోటల్ని పండించి, ఛాయ్ పొడిని విక్రయించడం మొదలు పెట్టాడు. ఇలా ఒక్కొక్కటిగా మొదలై 1862 నాటికి అసోంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కు పైగా తేయాకు తోటలు అసోంలో ఉన్నాయి. ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్లో రెండో స్థానంలో ఉంది. దీనికి కారణం కూడా అసోంలోని టీ తోటలే. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు తేయాకు తోటలో పనిచేస్తుండటం విశేషం.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సమయం ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో టైంజోన్ ఉంటుంది. భారత్లో ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. దీని ప్రకారం భారత్లోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే టైం ఉంటుంది. కానీ అసోంలోని తేయాకు తోటల్లో మాత్రం సమయం ఒక గంట ముందు ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య ప్రాంతంలో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. సాయంత్రం ఒక గంట ముందు అస్తమించేవాడు. దీంతో తేయాకు ఉత్పత్తిని పెంచుకునేందుకు బ్రిటీష్ పాలకులు పనిగంటలను కూడా ఒక గంట ముందుకు జరిపారు. అంతటా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే.. తేయాకు తోటల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తారు. ఈ విధానాన్ని టీ గార్డెన్ టైమ్ అని పిలుస్తుంటారు. బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చిన ఈ సమయాన్నే ఇప్పటికీ తేయాకు తోటల్లో పాటిస్తున్నారు. ఈ టీ గార్డెన్ టైమ్ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక టైం జోన్ కావాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
బ్రిటన్ రాజకుటుంబంలో మన గౌరమ్మ.. క్వీన్ విక్టోరియా దత్తపుత్రిక గురించి తెలుసా?