జైపూర్ : రాజస్ధాన్లోని అజ్మీర్కు సమీపంలోని రాంపురా గ్రామంలో పెండ్లివేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పెండ్లి మంటపానికి చేరుకునేందుకు గుర్రంపైకి ఎక్కిన వరుడికి చేదు అనుభవం ఎదురైంది. పెండ్లి వేడుక సందర్భంగా అక్కడున్న వారు టపాసులు పేల్చడంతో గుర్రం అదుపుతప్పి పరుగులు పెట్టింది.
గుర్రాన్ని కంట్రోల్ చేసేందుకు పెండ్లి కుమారుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని పెండ్లి మంటపం వద్దకు గుర్రం వెనుక కార్లు, బైకులు బారులుతీరాయి. మొత్తంమీద పెండ్లి కుమారుడికి ఎలాంటి గాయాలు కాకుండానే పెండ్లి వేదిక వద్దకు క్షేమంగా తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.