అమరావతి ,జూలై :మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు. దీని రుచి అంట గొప్పగా ఉంటుంది మరి. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. కొన్ని ఏండ్ల క్రితం ఇక్కడి జనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసు పట్టుకుని వెళ్ళేవారట. అంతటి ప్రత్యేకమైనది పులస చేప.
గోదావరి నదిలో మాత్రమే లభించే చేప…
ఇది గోదావరి నదిలో మాత్రమే లభించే చేప. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా అని కూడా పిలుస్తారు. ‘హిల్సా ఇలీషా’ అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి.
ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత…
గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.
అందుకే ఈ చేపలకు అంత రుచి…
గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస. గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. చెనల చేప అంటే ఆడచేప, గొడ్డుచేప అంటే పోతు చేప. ఇలా పలురకాల పేర్లతో వీటిని విక్రయిస్తారు. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసేచోట లభించే చేపలకూ ఎంత ప్రత్యేకత ఉందో అంత గిరాకీ ఉంటుంది. వీటికి దాదాపు 2వేల నుంచి 15వేల రూపాయల వరకు అంటే డిమాండ్ ను బట్టి ఆ ధర ఉంటుంది. ప్రతి సీజన్లో యానాంలో పులస చేపల వ్యాపారం లక్షల రూపాయల్లో జరుగుతుంటుంది. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో అడపాదడపా లభించే పులస చేపలు ఆగస్టు నుంచి విరివిగా లభ్యమవుతాయి.