పట్నా : మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు సహకరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇప్పటికే పలు సంస్ధలు ఆకర్షణీయ బహుమతులు, రాయితీలు, కూపన్లు అందిస్తుండగా తాజాగా బిహార్లోని దర్భంగా జిల్లాలో ఓ సెలూన్ యజమాని కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచిత హెయిర్ కట్తో పాటు, ఫ్రీగా షేవింగ్ చేస్తున్నాడు. దర్భంగా నగరంలోని బైటా చౌక్లో ఉన్న ఈ సెలూన్ యజమాని శంభు కుమార్ ఠాకూర్ చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు తాను ఇలా ఉచిత సర్వీసును ఆఫర్ చేస్తున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో సెల్ఫీ తీసుకున్న వారితో పాటు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిన వారికి ఉచితంగా సర్వీసు చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రచారం చేస్తుండగా తాము కూడా తమకు తోచిన రీతిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము ఇప్పటికే 200 మందికి పైగా క్లైంట్లకు ఉచిత సేవలు అందించామని ఠాకూర్ తెలిపారు. సెలూన్ వెలుపల ఉచిత ఆఫర్ను తెలిపే బోర్డును సైతం ప్రదర్శిస్తున్నామని చెప్పారు.