చెన్నై : ఎల్లరం వంగ..ఆల్వేస్ వెల్కమ్స్ యూ.. ట్యాగ్లైన్తో తమిళనాడు విలేజ్ కుకింగ్ ఛానెల్ గడిచిన మూడేండ్లలో అమిత వీక్షకాదరణతో దూసుకుపోతోంది. రైతులే యూట్యూబ్ స్టార్స్గా మారి ఈ వంటల ఛానెల్ను నడిపిస్తుండగా తమిళనాడులోనే తొలిసారిగా కోటి మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్న తొలి యూట్యూబ్ ఛానెల్గా చరిత్ర సృష్టించింది. పుదుకొట్టాయి జిల్లాలోని కుగ్రామం చిన్న వీరమంగళం సంప్రదాయ వంటకాల వీడియోలతో గత కొన్నేండ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.
గతంలో ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ విలేజ్ వంటల యూట్యూబర్లను కలవడంతో ఛానెల్ పేరుప్రతిష్టలు విపరీతంగా పెరిగాయి. అప్పటివరకూ వారానికి పదివేల మంది సబ్స్క్రైబర్లు తోడవుతుండగా రాహుల్ పర్యటన తర్వాత ఆ సంఖ్య 30,000 నుంచి 40,000 వరకూ ఎగబాకిందని ఛానెల్ నిర్వహకులు వీ సుబ్రమణియన్, వీ మురుగేషన్, వీ అయ్యన్నర్, జీ తమిళ్ సెల్వన్లు వెల్లడించారు. కజిన్స్ అయిన వీరు తమ తాత ఎం పెరియతంబి మార్గదర్శకత్వంలో చానెల్ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. తాత గతంలో క్యాటరింగ్ పనులు చేయడం వీరికి కలిసివచ్చింది.
సంవత్సరంలో ఆరు నెలలు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే తాము మిగిలిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న సమయంలో వంటల ఛానెల్లో నిమగ్నమయ్యామని వారు చెప్పుకొచ్చారు. తాను పాతికేండ్ల వయసులో వంటల ప్రస్ధానం ప్రారంభించానని, ఇప్పుడు తన వయసు 70 ఏండ్లు కాగా తనకు ఇంత పేరు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని పెరియతంబి డైమండ్ ప్లేబటన్ను పొందుతూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ నైపుణ్యాలను మెచ్చి ఇంతలా ఆదరిస్తున్న వీక్షకులకు ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.