భటిండా : నలభైల్లో పడగానే వయసైపోయిందని దిగాలు పడే ఎందరికో కనువిప్పు కలిగేలా వందేండ్లు వచ్చినా మనవళ్ల బాగుకోసం చెమటోడుస్తున్న తాత ఉదంతం పంజాబ్లోని భటిండాలో వెలుగుచూసింది. మనవళ్ల చదువు కోసం తోపుడుబండిపై ఉల్లిగడ్డలు, ఆలూ అమ్ముతూ శ్రమిస్తున్న హర్భన్స్ సింగ్ జీవితం అందరినీ కదిలిస్తోంది. మనవళ్ల ఆలనాపాలనా చూసే వారు ఎవరూ లేకపోవడంతో వారి కోసం స్వేదం చిందించాలని హర్భన్స్ బండి లాగుతున్నాడు.
బండిపై ఒక్కోసారి 200 కిలోల బరువున్నా ఆయన వెనక్కితగ్గడం లేదు. మనవళ్ల కేరింతలను చూసి బరువును బాధ్యతగా మోస్తున్నాడు. పండ్లు విక్రయించే ఆయన రెండో కుమారుడు చాలాకాలంగా వృద్ధుడికి దూరంగా ఉంటున్నాడు. మరో కుమారుడు మరణించాడు. ఇక తాత హర్భన్స్ దశాబ్ధాల తరబడి జీవనోపాధి కోసం కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.
ఈ వ్యాపారానికి ముందు ఆయన దాదాపు 18 ఏండ్లు కఠినమైన బరువులు ఎత్తే కూలీగా కూడా పనిచేశాడు. తుది మజిలీలోనూ కష్టం ఆయనను విడిచిపెట్టలేదు. మనవళ్ల చదువుకోసం మళ్లీ బరువు నెత్తినేసుకున్నాడు. వారి కోసం అమృత్సర్లో వందల కిలోమీటర్లు తోపుడుబండిని లాగుతూ బతుకుబండి లాగిస్తున్నాడు. తాను పనే దైవంగా ముందుకెళతానని మరణం గురించి భయపడనని పనిచేయడాన్నే నమ్ముతానని హర్భన్స్ చెబుతున్న మాటలు ఆ ప్రాంత వాసుల గుండెలోతుల్ని తడిమేస్తున్నాయి.