మధురై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై కఠిన నియంత్రణలు అమలవుతున్న క్రమంలో ఓ జంట వినూత్నంగా పెండ్లి వేడుకను నిర్వహించింది. మధురై నుంచి బెంగళూరుకు విమానంలో రెండు గంటల పాటు ప్రయాణిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఒక్కటైంది. రెండు గంటల కోసం మొత్తం విమానాన్ని పెండ్లి కొడుకు తండ్రి బుక్ చేసి అందులోనే వివాహ తంతు జరిపించేశారు. వధువు మెడలో వరుడు తాళి కడుతుండగా బంధువులు, కుటుంబ సభ్యులు వారి సీట్లలో కూర్చుని కొత్త జంటను ఆశీర్వదించారు.
మధురైలో వ్యాపారవేత్త అయిన వరుడి తండ్రి విమానంలో పెండ్లి తంతకు ముందు అతిధులందరి నుంచి కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టులు సేకరించారు. ఈ వినూత్న వేడుకకు దాదాపు 160 మంది అతిథులు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకలో కొవిడ్-19 మార్గదర్శకాలను విస్మరించారు. పీపీఈ కిట్, మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి కాగా ఒకరిద్దరు మినహా ఎవరూ ఈ నిబంధనలను పాటించలేదు. విమానంలో వివాహానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.