పల్లెలే దేశానికి పట్టుగొమ్ములు అని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. కానీ.. నేడు పల్లెలు విడిచి… పట్టణాలకు వలస వెళ్తున్నారు జనాలు. సిటీలకు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. ఒకప్పుడు పల్లెల్లోనే అత్యధిక జనాభ ఉండేది. కానీ.. నేడు పట్టణాల్లో అత్యధిక జనాభా కనిపిస్తోంది. పల్లెలన్నీ బోసిపోతున్నాయి. కానీ.. డబ్బు మాత్రం ఎక్కువగా పల్లెల్లో ఉండే జనాల వద్దనే ఉందట.
మీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మన ఇండియాలోనే ఉంది. ప్రపంచం మొత్తం మీద ఈ గ్రామంలో ఉన్నంత డబ్బు ఏ గ్రామంలో లేదట. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది అంటారా?
ఆ ఊరి పేరు మాధాపూర్. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. కచ్ జిల్లాలో మిస్ట్రీస్ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. జిల్లాలోని 18 గ్రామాల్లో ఎక్కువగా ఇదే కమ్యూనిటీ వాళ్లు ఉంటారట. అందులో ఈ మాధాపూర్ కూడా ఒకటి. ఇక.. ఈ గ్రామంలో 7600 ఇండ్లు ఉంటాయట. ఇక.. ఈ ఊరి చుట్టూ 17 బ్యాంకులు ఉన్నాయట. ఆ బ్యాంకుల్లో కేవలం ఈ ఊరికి చెందిన వాళ్లు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాలా 5 వేల కోట్ల రూపాయలు. షాక్ అయ్యారు కదా. అవును.. అందుకే.. ఆ ఊరును ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం అని పిలుస్తున్నారు.
ఆ గ్రామంలో సగటు పర్ క్యాపిటా డిపాజిట్ 15 లక్షలు. ఇక.. ఆ ఊళ్లో 17 బ్యాంకులతో పాటు.. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, చెరువులు, పార్కులు, డ్యామ్లు, హెల్త్ సెంటర్లు, గుళ్లు.. ఇంకా పెద్ద గోశాల కూడా ఉందట.
మిగతా ఊళ్లకు, ఆ ఊరుకు తేడా ఏంటి? అంటారా? ఉంది.. ఆ ఊరి వాళ్ల దగ్గర అంత డబ్బు ఉండటానికి కారణం.. ఆ ఊరికి చెందిన వాళ్ల పిల్లలు ఎక్కువగా విదేశాలలో సెటిల్ అయ్యారట. అంటే.. ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు కానీ.. ఇద్దరు కానీ.. ఫారెన్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారట. చాలామంది యూకే, యూఎస్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారట.
అక్కడ సంపాదించిన డబ్బులను తమ ఫ్యామిలీలకు ఇండియాకు పంపిస్తున్నారట. అలాగే.. అక్కడ సంపాదించిన డబ్బును.. తమ ఊరిలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి దాస్తున్నారట.
చాలామంది ఎన్ఆర్ఐలు.. విదేశాల్లో బాగా డబ్బు సంపాదించి.. తమ ఊరి బ్యాంకుల్లో డిపాజిట్ చేసి.. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి.. గ్రామంలోనే ఏదైనా వ్యాపారం చేస్తున్నారట.
ఇక.. ఈ ఊరికి ఒక అసోషియేషన్ కూడా ఉందండోయ్. దాని పేరు మాధాపూర్ విలేజ్ అసోసియేషన్. లండన్లో 1968లో దీన్ని ఏర్పాటు చేశారు. మాధాపూర్ గ్రామానికి చెందిన వాళ్లు.. విదేశాల్లో ఎక్కడున్నా వాళ్లందరినీ కలిపే వేదిక అన్నమాట అది. ఇంత డబ్బు ఉన్నా.. తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడినా.. ఆ ఊరిలో ఉండే వాళ్లు మాత్రం ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు.