న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తితో పెండ్లిండ్లు, శుభకార్యాలను పలువురు రద్దు చేసుకోవడం, వాయిదా వేయడం చేస్తున్నారు. అయితే మరికొందరు మహమ్మారి ప్రభావంతో తాము తలపెట్టిన కార్యాలను వాయిదా వేయకుండా వినూత్న పద్ధతుల్లో జరిపించేస్తున్నారు. జూమ్ పెండ్లిండ్ల నుంచి వేడుకలో పీపీఈ కిట్లను ధరించడం వరకూ పలు జాగ్రత్తలతో పెండ్లి తంతును మమ అనిపించేస్తున్నారు.
ఇక ఇదే తరహాలో వెదురు కర్ర సాయంతో వధూవరులు వరమాలను మార్చుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 19 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్ లో షేర్ చేశారు. కరోనా విపత్తు వెంటాడుతున్న వేళ మన ఈవెంట్ మేనేజర్లు తెలివిగా వెడ్డింగ్స్ ను ప్లాన్ చేస్తున్నారని ఆయన ఈ వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.