అలప్పుజ : కేరళను వరదలు ముంచెత్తడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగిన క్రమంలో పెండ్లి ముహుర్తం ముంచుకురావడంతో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసే కొత్త జంట ఆకాష్, ఐశ్వర్య పెండ్లి మంటపానికి భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. తలవడిలోని ఫంక్షన్ హాల్నూ వరద నీరు ముంచెత్తగా అతికష్టం మీద అక్కడికి చేరుకున్న నూతన వధూవరులు పరిమిత అతిధులు, బంధువుల సమక్షంలో పెండ్లి తంతు కానిచ్చేశారు. పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది.
ఇక రోడ్డు జలయమం కావడంతో అల్యూమినియం పాత్రలో వధూవరులు పెండ్లి వేదికకు వస్తున్న దృశ్యాలు పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. పెండ్లి ముహుర్తం శుభప్రదమైన రోజున ఖరారు చేయడంతో ఎలాగైనా అదే సమయానికి పెండ్లి చేసుకోవాలని తాము నిర్ణయించుకున్నామని నవ దంపతులు చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతోనే రహదారులతో పాటు పెండ్లి వేదిక నీటమునిగిందని అన్నారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.