హుజూరాబాద్ : తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్ ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావో చెప్పాలని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్కూర్మాచలం ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సిటీ సెంటర్ హాల్లో అనిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ను కేసీఆర్ సొంత తమ్ముడిలా భావించి రాజకీయంగా ప్రోత్సహించి ఎన్నో అవకాశాలు కల్పిస్తే ఈటల మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఈటల తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, స్వప్రయోజనాలకోసం బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడం కోసం ఇతర పార్టీలతో, నాయకులతో కుమ్మకై వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయ విలువల్లేని బీజేపీలో చేరి ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీశ్రెడ్డి గొట్టెముకుల, శానబోయిన రాజ్కుమార్, విక్రమ్కుమార్, తిరుమందాస్ నరేశ్, రఘువరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందె సాయిచరణ్, నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి గాలి రాకేశ్, టీఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.